Trump-Iran: ఆ విషయంలో ‘పొరపాటు’ జరిగింది.. ట్రంప్ బృందానికి ఇరాన్ రహస్య సందేశం?

  • ఆ విషయంలో ‘పొరపాటు’ జరిగింది
  • ట్రంప్ బృందానికి ఇరాన్ రహస్య సందేశం?
  • అంతర్జాతీయ మీడియాలో కథనం
Iranus

Iranus

ఇటీవల ఖమేనీ అంత్యక్రియల సమయంలో హార్ముజ్ జలసంధిలో నౌకలపై ఇరాన్ ఆకస్మిక దాడులు చేసింది. దీంతో టర్కీలో ఉన్న ట్రంప్ ప్రతీకార దాడులకు ఆదేశించారు. ఇరాన్‌తో తాత్కాలిక ఒప్పందం ముగిసిందని ప్రకటించారు. ఈ పరిణామాలతో మరోసారి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తలెత్తాయి. మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి.

అయితే తాజాగా ఈ వ్యవహారంపై ఇరాన్ స్పందించింది. హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడి తమ వైపు జరిగిన తప్పిదమేనని ఇరాన్ అధికారులు అమెరికా చర్చల బృందానికి రహస్యంగా తెలిపినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. హార్డ్‌లైన్ వర్గాలు శాంతి చర్చలను భగ్నం చేయాలనే ఉద్దేశంతో ఆ దాడులకు పాల్పడ్డాయని.. అయితే ఇరాన్ ప్రభుత్వం మాత్రం అమెరికాతో చర్చలను కొనసాగించాలనే అభిప్రాయంలో ఉందని సమాచారం. అమెరికా మీడియా సంస్థ సీబీఎస్ న్యూస్ కథనం ప్రకారం.. ఇరాన్ అధికారులు ట్రంప్ సలహాదారులతో గోప్యంగా సంప్రదింపులు జరిపి హార్ముజ్ జలసంధిలో నౌకలపై జరిగిన దాడి చర్చలకు విఘాతం కలిగించేందుకే కొందరు కఠినవాదులు చేపట్టిన చర్య అని వివరించారు. తాము శాంతి చర్చలను కొనసాగించాలని కోరుకుంటున్నామని కూడా అమెరికాకు సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం.

ఈ పరిణామాల నేపథ్యంలో హార్ముజ్ దాడి తప్పిదమేనని ప్రపంచం ముందే ఇరాన్ అధికారికంగా అంగీకరించాలని వైట్‌హౌస్ కోరుతున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్చలను పూర్తిగా నిలిపివేయకుండా కొనసాగించాలని తన బృందానికి ఆదేశాలు ఇచ్చారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్, ప్రత్యేక దౌత్య ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో నేతృత్వంలో చర్చలు కొనసాగనున్నాయి. ఈ కీలక సమావేశం ఒమన్‌లో జరగనున్నట్లు సమాచారం.

ఈ వారం అమెరికా మరోసారి ఇరాన్‌పై వైమానిక దాడులు జరిపింది. దీనికి ప్రతిగా ఇరాన్.. అమెరికా మిత్రదేశాలైన బహ్రెయిన్, ఖతార్, కువైట్‌లపై క్షిపణి దాడులు చేసింది. జోర్డాన్‌లో కూడా సైరన్లు మోగాయి. అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగినట్లు సమాచారం. మరోవైపు ఇరాన్ అధికారులు అమెరికా తమ ఏకైక అణు విద్యుత్ కేంద్రం పరిసర ప్రాంతాలపై కూడా వైమానిక దాడులు జరిపిందని ఆరోపించారు. దేశంలోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించినట్లు పేర్కొన్నారు.

ఇటీవల మరణించిన ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి మష్హద్‌లో అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును లక్ష్యంగా చేసుకుని నినాదాలు వినిపించాయి. కొందరు మద్దతుదారులు ‘‘Kill Trump’’ అని రాసిన ప్లకార్డులు ప్రదర్శించారు.

ఇరాన్ నుంచి వస్తున్న బెదిరింపులపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. తన అధికారిక వెబ్‌సైట్‌లో చేసిన పోస్టులో.. ‘‘ఇరాన్ ప్రభుత్వం నాపై హత్యాయత్నం చేసే ప్రయత్నం చేస్తే వెయ్యి క్షిపణులు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. అవసరమైతే మరిన్ని వేల క్షిపణులు ప్రయోగిస్తాం.’’ అని హెచ్చరించారు. అంతేకాదు.. ‘‘ఇరాన్‌లోని అవసరమైన ప్రతి లక్ష్యాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తాం.’’ అని కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు.

అమెరికా అధికారుల ప్రకారం.. ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకునేందుకు ట్రంప్ చర్చల బృందానికి పరిమిత గడువు మాత్రమే ఇచ్చారు. చర్చలు విఫలమైతే అమెరికా దగ్గర అనేక ప్రత్యామ్నాయ చర్యలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. అయితే మరోవైపు ఐక్యరాజ్యసమితిలోని ఇరాన్ ప్రతినిధి మాట్లాడుతూ.. హార్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రత, మైన్ల తొలగింపు వంటి అన్ని చర్యలపై పూర్తి అధికారం ఇరాన్‌కే ఉందని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా ఖతార్ మధ్యవర్తిత్వ బృందం కూడా శుక్రవారం టెహ్రాన్ చేరుకుని ఇరాన్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమైనట్లు ఇరాన్ విదేశాంగ శాఖ వెల్లడించింది. దీంతో ఒమన్ వేదికగా జరగనున్న అమెరికా-ఇరాన్ చర్చలు మధ్యప్రాచ్య సంక్షోభ భవిష్యత్తును నిర్ణయించే కీలక పరిణామంగా మారాయి.