Site icon NTV Telugu

Iran-US War: రోడ్డెక్కిన ఇరానీయులు.. విద్యుత్ ప్లాంట్ల దగ్గర మానవహారాలు

Power1

Power1

ఈ రాత్రికి ఇరాన్ నాగరికత అంతం చేస్తామంటూ ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో లక్షలాది మంది ఇరానీయులు రోడ్డెక్కారు. విద్యుత్ ప్లాంట్లపై దాడులు చేస్తామని అమెరికా సూచించిన నేపథ్యంలో ఇరానీయులంతా చేరుకుని మానవహారాలుగా ఏర్పడ్డారు. చిన్నారులు, పెద్దలు సమూహంగా ఏర్పడ్డారు. దాడులు చేయొద్దంటూ చిన్నారులు ప్లకార్డులు పట్టుకున్నారు.

ఇరాన్‌లోని వంతెనలు, రైల్వే నెట్‌వర్క్‌లు, విద్యుత్ ప్లాంట్లు వంటి పౌర మౌలిక సదుపాయాలను అమెరికా లక్ష్యంగా చేసుకుంది. తబ్రిజ్-జంజాన్ హైవేపై ఉన్న ఒక వంతెనను పేల్చివేసింది. కాషాన్ నగరంలోని ఒక రైల్వే వంతెనపై జరిగిన దాడిలో ఇద్దరు పౌరులు మరణించగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. దీనికి నిరసనగా ఇరాన్ పౌరులు వీధుల్లోకి వచ్చారు. ఐక్యతను, దేశభక్తిని ప్రదర్శిస్తూ మానవ హారాలుగా ఏర్పడి నిరసన తెలుపుతున్నారు.

ప్రస్తుతం ఇరాన్‌లోని పలు ప్రధాన వంతెనలు, రైల్వే నెట్‌వర్క్‌లపై అమెరికా దాడులు చేయడంతో ప్రజలు గుమిగూడారు. అలాగే ఇరాన్‌లోని పలు ప్రధాన విద్యుత్ ప్లాంట్లను ధ్వంసం చేస్తామని కూడా ట్రంప్ బెదిరించారు. దీంతో పౌరులంతా విద్యుత్ ప్లాంట్ల దగ్గరకు చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఖిర్ ఘాలిబాఫ్ ఎక్స్‌లో… తాను ఇరాన్‌కు ‘‘అంకితమైనవాడినని’’ రాసుకొచ్చారు. 14.3 మిలియన్లకు పైగా ప్రజలు సైన్-అప్ అయినట్లు తెలిపారు. ఇది తమ దేశం పట్ల ఇరాన్ ప్రజల విధేయతను ప్రదర్శిస్తుంది. దేశాన్ని బెదిరించే లేదా లొంగిపోతున్నట్లు సంకేతం ఇచ్చే ఏ వేలునైనా తాను ‘‘నరికివేస్తానని’’ ఘాలిబాఫ్ హెచ్చరించారు.

 

Exit mobile version