ఇండోనేషియాలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. శనివారం ఉదయం 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించగా.. తాజాగా ఉత్తర సుమత్రా ప్రాంతంలో 6.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. వరుస భూకంపాలతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) ప్రకారం.. భూకంపం 158 కిలోమీటర్ల లోతులో సంభవించింది.
ఈ తాజా భూకంపానికి కొన్ని గంటల ముందు ఇండోనేషియా తీరానికి సమీపంలో 7.7 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఆగస్టు 15న తెల్లవారుజామున సంభవించిన ఈ భూకంపం కారణంగా కనీసం ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. పలు భవనాలు దెబ్బతిన్నాయి. 7.7 తీవ్రతతో వచ్చిన భూకంపం తర్వాత ప్రాంతంలో అనేక ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో అధికారులు కొంతకాలం సునామీ హెచ్చరిక జారీ చేశారు. అయితే పరిస్థితిని పరిశీలించిన అనంతరం ఆ హెచ్చరికను ఉపసంహరించుకున్నారు.
భూకంప ప్రకంపనలు ఇండోనేషియాలోని పలు ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కొన్ని ఆసుపత్రులను ఖాళీ చేయించినట్లు సమాచారం. అధికారులు భూకంపం కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నారు. తాజాగా ఉత్తర సుమత్రాలో 6.8 తీవ్రతతో మరో భూకంపం సంభవించడంతో ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది. అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ.. అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నారు.

