NTV Telugu Site icon

World Population: 2100 నాటికి చైనా, ఇండియాలో భారీగా తగ్గనున్న జనాభా.. కారణాలు ఏంటంటే..?

Population

Population

india and china population decreased by year of 2100: ప్రపంచంలో జనాభా పరంగా భారత్ రెండో స్థానంలో ఉంది. చైనా అగ్రస్థానంలో కొనసాగుతోంది. 2022 లెక్కల ప్రకారం చైనాలో జనాభా 142.6 కోట్లుగా ఉంటే భారత్ జనాభా 141.2 కోట్లుగా ఉంది. అయితే ఓ సర్వే ప్రకారం 2100 నాటికి చైనా జనాభా 49.4 కోట్లకు తగ్గిపోనుంది. అంతేకాకుండా భారత్‌లో కూడా జనాభా 100.3 కోట్లకు చేర‌నుంది. అంటే భారత్‌లో జనాభా 41 కోట్లు తగ్గిపోనుంది. చైనాలో అయితే రికార్డు స్థాయిలో 93.2 కోట్ల మంది తగ్గిపోతారని సర్వే అంచనా వేసింది. రానున్న కాలంలో భారత్‌లో జనాభా మరింత పెరుగుతుందని అందరూ అంచనా వేస్తున్న సందర్భంలో.. స్టాన్ ఫోర్డ్ అధ్యయనం మాత్రం ఆశ్చర్యపరిచేలా సర్వే రిపోర్టును వెల్లడించింది. రానున్న 78 సంవత్సరాల్లో భారత్ లో జనాభా 41 కోట్లు తగ్గిపోయి 100 కోట్లకు పరిమితం అవుతుందని స్టాన్ ఫోర్డ్ అధ్యయనం వెల్లడించింది.

Read Also: Indian Talent: తల్లికి తెలియకుండా ఆమె పాత ల్యాప్‌టాప్‌తో ఏకంగా అమెరికా ఉద్యోగమే సంపాదించాడు. కానీ..

ఇండియాలో ప్రస్తుతం ప్రతి చదరపు కిలోమీటర్ కు 476 మంది జీవిస్తుండగా, చైనాలో ఇది 148గానే ఉంది. 2100 నాటికి భారత్‌లో జనసాంద్రత చదరపు కిలోమీటర్ కు 335కు తగ్గుతుంది. జనాభా అంతరించిపోవడం వల్ల విజ్ఞానంతో పాటు జీవన ప్రమాణాలు స్తుబ్దుగా ఉంటాయని స్టాన్ ఫోర్డ్ సర్వే పేర్కొంది. సంతానోత్పత్తి రేటు ఆధారంగా స్టాన్ ఫోర్డ్ జనాభాను అంచనా వేసింది. భారత్‌లో సంతానోత్పత్తి రేటు ప్రస్తుతం ఒక మహిళకు సగటున 1.79 జననాలుగా ఉంటే, 2100 నాటికి 1.19కు తగ్గుతుంది. అంటే ఒక మహిళ సగటున ఒకరికే జన్మనివ్వనుంది. దేశాలు సుసంపన్నంగా మారితే సంతానోత్పత్తి రేటు తగ్గడం సహజమేనని స్టాన్‌ఫోర్డ్ అధ్యయనం పేర్కొంది. అయితే ఆఫ్రికా దేశాలు ఈ శతాబ్దం రెండో భాగంలో జనాభా వృద్ధికి ఇంజన్లుగా పనిచేయవచ్చని సర్వే అభిప్రాయపడింది.