Russia-Ukraine War: ఐక్యరాజ్యసమితిలో ఓటింగ్.. భారత్‌, చైనా దూరం..

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది.. రాజధాని కీవ్‌ను పూర్తిస్థాయిలో ఆధీనంలోకి తీసుకునేలా ముందుకు కదులుతున్నాయి రష్యా బలగాలు.. ఇప్పటికే కీవ్‌ ఎయిర్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకుంది రష్యా.. మరోవైపు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశం అయ్యింది… రష్యాకు వ్యతిరేకంగా భద్రతా మండలిలో ఓటింగ్‌ కూడా నిర్వహించారు.. అయితే, ఓటింగ్‌కు మాత్రం భారత్‌, చైనా దూరంగా ఉన్నాయి.. భద్రతా మండలి 15 సభ్యదేశాల్లో 11 దేశాలు రష్యాకు వ్యతిరేఖంగా ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఖండిస్తూ ఓటు వేయగా.. భద్రతా మండలిలో ఐదు శాశ్వత దేశాల్లో ఒకటైన రష్యా తన విటో అధికారాన్ని ఉపయోగించి ముసాయిదాను తిరస్కరించింది.

Read Also: COVID 19: తగ్గుతున్న కేసులు.. కేంద్రం కీలక నిర్ణయం

అయితే, ఉక్రెయిన్‌-రష్యా వివాదంలో మొదటి నుంచి తటస్థంగా ఉన్న భారత్‌తో పాటు చైనా, యూఏఈలు ఈ ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.. కాగా, తాము హెచ్చరిస్తున్నా ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి వెళ్లడాన్ని జీర్ణించుకోలేకపోతున్న అమెరికా.. రష్యాను ఏకాకిగా చేయాలని భావించిన అల్బేనియాతో కలిసి ఈ ముసాయిదా తీర్మానాన్ని తయారు చేసింది.. ఇక, 193 సభ్యదేశాలు ఉన్న ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలో ఈ ముసాయిదాను ప్రవేశపెట్టేందుకు సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తోంది. భద్రతా మండలిలో రష్యా తన విటోను ఉపయోగించి తీర్మానాన్ని అడ్డుకున్నప్పటికీ, ఆ దేశాన్ని అంతర్జాతీయంగా ఒంటిరి చేశామని మరికొన్ని దేశాలు అభిప్రాయపడుతున్నాయి..