Israel-Hezbollah: హిజ్బుల్లా అండర్‌గ్రౌండ్‌ను గుర్తించిన ఐడీఎఫ్.. వీడియో విడుదల

  • హిజ్బుల్లాపై కొనసాగుతున్న ఐడీఎఫ్ దాడులు
  • హిజ్బుల్లా అండర్‌గ్రౌండ్‌ను గుర్తించిన ఐడీఎఫ్
  • వీడియో విడుదల చేసిన ఐడీఎఫ్
Idf

Idf

పశ్చిమాసియాలో కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నప్పటికీ లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య మాత్రం దాడులు ఆగలేదు. హిజ్బుల్లా ఉగ్రవాదులు నిత్యం కవ్వింపు చర్యలకు దిగుతోంది. ఇజ్రాయెల్ ఐరన్ డ్రోమ్‌పై ఇటీవల హిజ్బుల్లా దాడి చేసింది. మరోవైపు దక్షిణ లెబనాన్‌లోని హిజ్బుల్లా ఉగ్రవాదులే లక్ష్యంగా ఐడీఎఫ్ కూడా భీకర దాడులు చేస్తోంది.

తాజాగా దక్షిణ లెబనాన్‌లో హిజ్బుల్లా అండర్‌గ్రౌండ్ టన్నెల్స్‌ను ఐడీఎఫ్ బయటపెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. దక్షిణ లెబనాన్‌లోని లిటాని ప్రాంతంలో ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. ఈ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ “ఫార్వర్డ్ డిఫెన్స్ లైన్”గా పేర్కొంది. “హిజ్బుల్లా ఉగ్రవాదులు ఉపయోగించిన నివాస ప్రాంతాల ప్రత్యేక దృశ్యాలు” అంటూ ఐడీఎఫ్ వీడియోను షేర్ చేసింది. ఈ ఆపరేషన్లలో 100కుపైగా సైనిక లక్ష్యాలపై దాడులు నిర్వహించినట్లు వెల్లడించింది.

ఐడీఎఫ్ ప్రకారం.. హిజ్బుల్లా స్థావరాలు, భారీగా ఆయుధాలు నిల్వ చేసిన భూగర్భ టన్నెల్స్‌, మందుగుండు సామగ్రి గోదాములు, క్షిపణి ప్రయోగ కేంద్రాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. అలాగే సమీప పోరాటాల్లో డజన్ల కొద్దీ హిజ్బుల్లా మిలిటెంట్లను హతమార్చినట్లు పేర్కొంది. ఈ ఆపరేషన్లకు వైమానిక దళం మద్దతు కూడా అందించినట్లు వెల్లడించింది.

ఇటీవల ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య డ్రోన్ యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చింది. ముఖ్యంగా హిజ్బుల్లా తక్కువ ఖర్చుతో తయారయ్యే ఎఫ్‌పీవీ కామికాజే డ్రోన్లను ఉపయోగించి దక్షిణ లెబనాన్‌లో ఉన్న ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై దాడులు నిర్వహిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా నివేదిస్తోంది.

ఇదిలా ఉంటే గత వారం లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 39 మంది మృతి చెందినట్లు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దక్షిణ లెబనాన్‌లోని సక్సాకియెహ్ పట్టణంపై జరిగిన దాడిలో కనీసం ఏడుగురు మరణించినట్లు తెలిపింది. అయితే తాము హిజ్బుల్లా సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నామని ఐడీఎఫ్ స్పష్టం చేసింది.

గత నెలలో ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్‌-లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అనంతరం దానిని మరో మూడు వారాల పాటు పొడిగించారు. అయినప్పటికీ ఇరుపక్షాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి.