Papua New Guinea: పపువా న్యూగినియాలో సాయుధ గ్యాంగ్లు రెచ్చిపోతున్నాయి. దేశంలోని ఉత్తర ప్రాంతంలోని మూడు గ్రామాల్లో దాదాపు 26 మందిని ఈ గ్యాంగ్ చంపేసినట్లు ఐక్యరాజ్య సమితితో పాటు ఆ దేశ పోలీసులు వెల్లడించారు. దేశంలోని ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్ పోలీస్ కమాండర్ జేమ్స్ బౌగెన్ మాట్లాడుతూ.. ఇది చాలా భయంకరమైన ఘటన.. మృతుల్లో పిల్లలు, మహిళలు కూడా ఉన్నారని పేర్కొన్నారు. దాదాపు 30 మంది దుండగులు వారిని హత్య చేశారని వెల్లడించారు.
Read Also: Sessions of Parliament: పార్లమెంట్ లో అమరవీరులకు ఘన నివాళ్లు.. మౌనం పాటించిన సభ్యులు
అలాగే, కొన్ని మృతదేహాలు గ్రామాల్లో కుళ్లిపోయే పరిస్థితికి చేరాయి.. మరికొన్నింటిని రాత్రి వేళల్లో మొసళ్లు నదిలోకి ఈడ్చుకెళ్లిపోయాయని జేమ్స్ బౌగెన్ తెలిపారు. చాలామందిని తలలు నరికి హత్య చేశారు.. మృతుల్లో 16 మంది చిన్నారులు ఉండగా.. మిగతా వాళ్లు ఆడవాళ్లే అని స్థానిక మీడియా కథనాలు ప్రసారం చేసింది. దాదాపు ఆరు నెలలుగా ఇక్కడ శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. సాధారణంగా పపువా న్యూగినియాలో భూవివాదాలే ఈ స్థాయి హత్యలకు కారణమవుతాయని అధికారులు చెప్పుకొస్తున్నారు. గతంలో కూడా హైల్యాండ్స్ ఏరియాలో ఇలానే 26 మందిని దారుణంగా హత్య చేసినట్లు గుర్తు చేశారు. గతేడాది ఇక్కడ భూహక్కుల కోసం ఆదివాసీల మధ్య వివాదం స్టార్ట్ అయింది.. దీంతో దాదాపు ఎంగా ప్రావిన్స్లో మూడు నెలలు లాక్ డౌన్, కర్ఫ్యూతో పాటు ఆంక్షలను విధించాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు.