డచ్ యువరాణులను హత్య చేయడానికి కుట్ర పన్నినట్లు బయటపడింది. భవిష్యత్ డచ్ రాణి, 22 ఏళ్ల యువరాణి కాథరీనా-అమాలియా, 20 ఏళ్ల యువరాణి అలెక్సియా లను హత్య చేయాలని ప్రణాళిక వేశారు. ఈ కేసులో పోలీసులు ఒక అనుమానితుడిని అరెస్టు చేశారు. అతడు ఫార్-రైట్ (దక్షిణపక్ష) తీవ్రవాద భావజాలం, ముఖ్యంగా నాజీ ప్రేరణతో ప్రభావితమై ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కుట్ర వెనుక అసలు ఉద్దేశ్యం ఇంకా పూర్తిగా తెలియరాలేదు. హేగ్ (The Hague) పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం ప్రకారం, నిందితుడు సోమవారం (మే 4) కోర్టులో హాజరవుతాడు.
ఫిబ్రవరి 2026లో హేగ్లో అరెస్టు చేయబడిన 33 ఏళ్ల అనుమానితుడి వద్ద రెండు గొడ్డళ్లు లభ్యమయ్యాయి. వాటిపై “అలెక్సియా”, “మొస్సాద్” (ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ), నాజీ యుగపు నినాదం “సీగ్ హీల్” (Sieg Heil) అనే పదాలు లిఖించి ఉన్నాయి. అంతేకాకుండా, అతని వద్ద చేతితో రాసిన ఒక కాగితం కనుగొన్నారు. దానిపై ఇద్దరు యువరాణుల పేర్లు (“అమాలియా”, “అలెక్సియా”)తో పాటు “రక్తపాతం” లేదా “బ్లడ్బాత్” (bloodbath) అనే పదం రాసి ఉంది.
యువరాణి అమాలియా గతంలో కూడా అనేక బెదిరింపులను ఎదుర్కొంది. మాజీ ప్రధాని మార్క్ రుట్టేను కిడ్నాప్ చేయాలని మాదకద్రవ్యాల ముఠాలు కుట్ర పన్నినట్లు ఆరోపణలు వచ్చాయి. భద్రతా కారణాలతో 2022లో ఆమ్స్టర్డామ్లోని తన హాస్టల్ను వదిలి హేగ్లోని రాజభవనానికి మారాల్సి వచ్చింది. 2024లో చదువు కోసం స్పెయిన్ (మాడ్రిడ్)లో రహస్యంగా కొంతకాలం గడిపింది. భద్రతా ఆంక్షల వల్ల సాధారణ విద్యార్థి జీవితం గడపలేకపోతున్నానని ఆమె బహిరంగంగా వ్యాఖ్యానించింది. “వీధుల్లో నడవడం, దుకాణాలకు వెళ్లడం వంటి సాధారణ విషయాలు చాలా కోరుకుంటున్నాను” అని ఆమె చెప్పారు. ఆమె తల్లి క్వీన్ మాక్సిమా కూడా ఈ బెదిరింపులు కుమార్తెపై తీవ్ర ప్రభావం చూపాయని, ఆమె ఒంటరిగా బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.
