Cockroach Party: మరో దేశానికి పొంచి ఉన్న ‘కాక్రోచ్’ ముప్పు.. అవినీతిపై ఢిల్లీ తరహాలో కసరత్తు

  • మరో దేశానికి పొంచి ఉన్న ‘కాక్రోచ్’ ముప్పు
  • అవినీతిపై ఢిల్లీ తరహాలో కసరత్తు
  • భారీగా పెరుగుతున్న మద్దతు
Pakistan

Pakistan

నీట్ పేపర్ లీకేజీపై కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన విద్యార్ధుల ఉద్యమం దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సంచలన సృష్టించింది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నెల రోజులకు పైగా విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఇక చలో సంసద్ సందర్భంగా పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో తీవ్ర సంచలనంగా మారి చివరికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది.

ఇప్పుడు ఈ కాక్రోచ్ ఉద్యమం మరో దేశానికి పాకింది. దాయాది దేశం పాకిస్థాన్‌కు కూడా బొద్దింకల నుంచి ముప్పు పొంచి ఉన్నట్టుగా కనిపిస్తోంది. భారత్‌లో వైరల్ అయిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ తరహాలో పాకిస్థాన్‌లోనూ కొత్త రాజకీయ ఉద్యమం తెరపైకి వచ్చింది. ‘కాక్రోచ్ పార్టీ పాకిస్థాన్’ పేరుతో సోషల్ మీడియాలో ప్రారంభమైన ఈ ఉద్యమం అవినీతి, నిరుద్యోగం, పాలనా వైఫల్యాలు, ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా యువత ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని ప్రకటిస్తోంది. అయితే భారతదేశంలోని కాక్రోచ్ జనతా పార్టీతో తమకు అధికారిక సంబంధం ఉందని ఈ సంస్థ ఇప్పటివరకు ప్రకటించలేదు.

పాకిస్థాన్‌లో రాజకీయ, ఆర్థిక పరిస్థితులు దిగజారుతున్న నేపథ్యంలో ఈ కొత్త ఉద్యమం ప్రాధాన్యత సంతరించుకుంది. అవినీతిని నిర్మూలించడం, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, పాలనా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడం తమ ప్రధాన లక్ష్యాలని ‘కాక్రోచ్ పార్టీ పాకిస్థాన్’ పేర్కొంది. దేశ ఆర్థిక, రాజకీయ స్థిరత్వాన్ని పునరుద్ధరించడంతో పాటు విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం, ఇంధన సంక్షోభానికి శాశ్వత పరిష్కారం కనుగొనడం, పెరుగుతున్న నీటి కొరత సమస్యను పరిష్కరించడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఉద్యమానికి సంబంధించిన వెరిఫైడ్ ఖాతాకు ఇప్పటికే 1.12 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నట్లు సమాచారం. ‘‘పాకిస్థాన్ దేశం ప్రజలకు చెందింది.. అవినీతి మాఫియాలకు కాదు’’ అనే నినాదంతో ఈ సంస్థ ప్రచారం నిర్వహిస్తోంది. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. ఈ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా మే నెలలో ప్రారంభమైంది. కెనడా నుంచి ఈ ఖాతాను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల ప్రారంభంలో ఖాతాకు వెరిఫికేషన్ లభించింది. సంస్థ ఛైర్మన్‌గా సల్మాన్ తరార్‌ను పేర్కొంది.

కేవలం సోషల్ మీడియా ప్రచారానికే పరిమితం కాకుండా.. పార్టీ పదవుల కోసం దరఖాస్తులను కూడా ఆహ్వానించడం ప్రారంభించింది. దీంతో డిజిటల్ వేదిక దాటి.. క్షేత్రస్థాయిలో కూడా రాజకీయ సంస్థగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల విడుదల చేసిన మేనిఫెస్టోలో సాధారణ పాకిస్థానీయులకు, ముఖ్యంగా అవినీతి, కుటుంబ పాలన, ప్రత్యేక వర్గాల ఆధిపత్యంతో విసిగిపోయిన యువతకు తమ ఉద్యమం ప్రాతినిధ్యం వహిస్తుందని పేర్కొంది.

పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజాస్వామ్య సంస్కరణలు, ప్రతిభ ఆధారిత పాలన, ఉద్యోగాల కల్పన, విద్యా రంగంలో మార్పులు, దీర్ఘకాలిక ఇంధన విధానాలను అమలు చేస్తామని ‘కాక్రోచ్ పార్టీ పాకిస్థాన్’ హామీ ఇచ్చింది. పాకిస్థాన్‌లో కొనసాగుతున్న రాజకీయ అస్థిరత, ఆర్థిక ఇబ్బందులు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, పాలనా వైఫల్యాలపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని తమ ఉద్యమం ప్రతిబింబిస్తోందని పేర్కొంది.

ఇదిలా ఉండగా.. పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ కూడా ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారాయి. ఇస్లామాబాద్‌లో జరిగిన పాకిస్థాన్ ఎకనామిక్ సమ్మిట్‌లో మాట్లాడిన ఆయన.. ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న పాలనా వ్యవస్థ పూర్తిగా విఫలమైందని అంగీకరించినట్లు స్థానిక మీడియా తెలిపింది. ప్రస్తుత వ్యవస్థలో సమస్యలకు పరిష్కారం సాధ్యం కాదని వ్యాఖ్యానించారు.

పాకిస్థాన్ యువత ప్రభుత్వ సాయాన్ని కాకుండా న్యాయం, ప్రతిభకు ప్రాధాన్యత, ఉద్యోగ అవకాశాలను కోరుకుంటోందని నఖ్వీ పేర్కొన్నారు. యువత ఐక్యమైతే దేశంలోని పరిస్థితులను పూర్తిగా మార్చివేయగలరని హెచ్చరించారు. ‘‘వారిని యువత అనండి.. కాక్రోచ్‌లు అనండి.. ఇంకేదైనా అనండి.. ఈ కాక్రోచ్‌లు ఒక్కటైతే అన్నింటినీ తలకిందులు చేయగలరు’’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

పాకిస్థాన్ రాజకీయ వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు చేపట్టకుండా.. ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ చేస్తున్న ప్రయత్నాలు కూడా దీర్ఘకాలిక ఫలితాలను ఇవ్వవని నఖ్వీ అభిప్రాయపడ్డారు. దేశ పాలనా వ్యవస్థను రాజకీయ నాయకులు కలిసి సరిదిద్దకపోతే.. అసిమ్ మునీర్ చేస్తున్న కృషి వల్ల ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు.

అయితే సోషల్ మీడియాలో భారీ ఆదరణ పొందుతున్న ‘కాక్రోచ్ పార్టీ పాకిస్థాన్’ నిజంగా బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతుందా లేదా అన్నది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. క్షేత్రస్థాయిలో పార్టీకి ఎంత మద్దతు ఉంది, సంస్థాగత నిర్మాణం ఎంత బలంగా ఉంది, పాకిస్థాన్‌లోని తీవ్ర రాజకీయ ధ్రువీకరణ మధ్య ఈ ఉద్యమం ఎలా ముందుకు సాగుతుందనే ప్రశ్నలు ఉన్నాయి. అయినప్పటికీ ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అవినీతి, పాలనా వైఫల్యాలు, రాజకీయ-సంస్థాగత అధికార కేంద్రీకరణపై పాకిస్థాన్ యువతలో పెరుగుతున్న అసంతృప్తికి ఈ ఉద్యమం ప్రతీకగా మారుతోందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.