Nepal: నేపాల్‌లో తప్పిన విమాన ప్రమాదం.. రన్‌వే‌ను దాటుకుని..!

  • నేపాల్‌లో తప్పిన విమాన ప్రమాదం
  • రన్‌వేను దాటుకుని భూమిలోకి దూసుకెళ్లిన ఫ్లైట్
  • క్షేమంగా బయటపడ్డ ప్రయాణికులు, సిబ్బంది
Nepal

Nepal

నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం తప్పింది. భద్రాపూర్ విమానాశ్రయంలో బుద్ధ ఎయిర్ ఏటీఆర్ 72 విమానం ల్యాండ్ అవుతుండగా అదుపు తప్పి రన్‌వే నుంచి దూసుకెళ్లింది. ఒక నది వరకు దూసుకెళ్లి ఆగిపోయింది. ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు. దీంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Off The Record: ముందస్తు ముచ్చట.. పట్టుదలగా మంత్రి తుమ్మల?

బుద్ధ ఎయిర్ సంస్థ నడుపుతున్న టర్బోప్రాప్ ప్యాసింజర్ విమానం ఖాట్మండ్ నుంచి భద్రాపూర్‌కు బయల్దేరింది. విమానంలో 51 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. మంగళవారం భద్రాపూర్ ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్ అవుతుండగా ఒక్కసారిగా రన్‌వేను దాటుకుని భూమిలోకి దూసుకుపోయింది. దీంతో ప్రయాణికులంతా గజగజ వణికిపోయారు. ఏం జరుగుతుందో తెలియక హడలెత్తిపోయారు. ఒక నది ఒడ్డు వరకు వెళ్లి విమానం ఆగిపోయింది. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది, అధికారులు ప్రయాణికులను సురక్షితంగా దింపేశారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ ఘటనలో విమానం స్వల్పంగా దెబ్బతింది.

ఇది కూడా చదవండి: Off The Record: “రెండు కళ్ల సిద్ధాంతం”.. పవన్‌ విషయంలో పార్టీ నేతలు, ఫ్యాన్స్ అంచనాలు తప్పుతున్నాయా?

ఇక ప్రమాదాన్ని అంచనా వేసేందుకు ఖాట్మండు నుంచి సాంకేతిక, సహాయ బృందాలను పంపినట్లు బుద్ధ ఎయిర్ తెలిపింది. అయితే వాతావరణ సమస్యలు, సాంకేతిక సమస్యలు కూడా ఏమీ లేనట్లుగా ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. కారణమేంటో తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.