NTV Telugu Site icon

Israel-Iran War: ‘‘హిట్ లిస్ట్’’ రిలీజ్ చేసిన ఇరాన్..ఫస్ట్ టార్గెట్ ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ..

Netanyahu

Netanyahu

Israel-Iran War: ఇజ్రాయిల్-హిజ్బుల్లా-ఇరాన్ పరిణామాలు మిడిల్ ఈస్ట్‌లో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమవుతోంది. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను ఇజ్రాయిల్ హతమార్చింది. నస్రల్లానే కాకుండా హిజ్బుల్లా ప్రధాన కమాండర్లు అందరిని చంపేసింది. దీంతో ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్, ఇజ్రాయిల్‌పై బాలిస్టిక్ క్షిపణులతో దాడులు నిర్వహించింది. దీంతో ఆ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయాలు నెలకొన్నాయి. ఇరు దేశాలు సంయమనం పాటించాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి.

ఇదిలా ఉంటే, ఇరాన్ ‘‘హిట్ లిస్ట్’’ తయారు చేసిందనే వాదనలు వినిపిస్తు్న్నాయి. అధికారికంగా దీనిపై ఇరాన్ స్పందించలేదు. అయితే, ఇరాన్ తయారు చేసిన ‘‘కిల్ లిస్ట్’’గా చెప్పబడుతున్న దాంట్లో ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో పాటు ఆ దేశ రక్షణ మంత్రి యోవ్ గాలట్, ఇజ్రాయిల్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కమాండర్ల పేర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్టర్లపై ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా స్పందించలేదు. అయితే, ఇరాన్ మిలిటరీ ఇంజెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇజ్రాయిల్ నాయకుడు, ముఖ్యంగా ప్రధాని నెతన్యాహూనే మెయిల్ టార్గెట్ అని తెలుస్తోంది.

Read Also: Priyanka Mohan: తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డ హీరోయిన్ ప్రియాంక మోహన్

జాబితాలో ఇజ్రాయిల్ మిలిటరీ జనరల్ స్టాఫ్ హెర్జీ హలేవి, అతడి డిప్యూటీ అమీర్ బారం, ఉత్తర-దక్షిణ-సెంట్రల్ కమాండ్ చీఫ్స్ మేజర్ జనరల్స్ ఒరి గోర్డిన్, యెహుదా ఫాక్స్ మరియు ఎలియేజర్ తోలెడానితో పాటు మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ అహరోన్ హలీవా పేరు కూడా ఉంది. ఈ జాబితా నిజమైతే ఇరాన్ ముందుగా నెతన్యాహూని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఇదే సమయంలో ఇజ్రాయిల్ కూడా ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని లక్ష్యంగా చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇరాన్ ప్రాక్సీగా ఉన్న హిజ్బుల్లాను ఇజ్రాయిల్ దారుణంగా దెబ్బతీయడంతో ఇరాన్ రగిలిపోతోంది. నస్రల్లాతో పాటు ఆ సంస్థలోని 11 మంది మంది హిజ్బుల్లా కమాండర్లను హతమార్చింది. దీంతో హిజ్బుల్లా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైంది. గత 10 రోజుల్లోనే ఇజ్రాయిల్, హిజ్బుల్లా వ్యవస్థాపక సభ్యుల్లో కనీసం 8 మంది సీనియర్ నేతల్ని హతం చేసింది. నస్రల్లా, అలీ కర్కీ, ఫువాద్ షుక్ర్, ఇబ్రహీం అకిల్,నబిల్ కౌక్ ఇలా ఉన్నత స్థాయి నేతల్ని ఇజ్రాయిల్ హతమార్చింది. లెబనాన్‌పై దాడుల్లో ఇప్పటి వరకు 1900 మంది మరణించగా, 9000 మంది గాయపడినట్లు ఆ దేశ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.