Bank Locker Swept: వరదల్లో కొట్టుకుపోయిన బ్యాంకు లాకర్.. రూ. లక్షల్లో డబ్బు.. ఎగబడిన జనం

  • నేపాల్ వరదల్లో కొట్టుకుపోయిన బ్యాంకు లాకర్
  • రూ.58 లక్షల నగదు
  • 29 మంది అరెస్ట్
Bank Locker Swept

Bank Locker Swept

నేపాల్‌లో భారీ వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ ప్రకృతి విపత్తులో 600 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, సుమారు 2,500 మంది ఇప్పటికీ గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. గల్లంతైన వారిలో 537 మంది విదేశీయులు ఉండగా.. వారిలో 320 మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు మరింత ప్రమాదం పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.

వరదల్లో కొట్టుకుపోయిన బ్యాంకు లాకర్

నేపాల్‌లో వరదల విధ్వంసం మధ్య ధాదింగ్ జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రసువా ప్రాంతం నుంచి వరద నీటిలో కొట్టుకుపోయిన ఓ బ్యాంకు లాకర్ త్రిశూలి నది ఒడ్డుకు చేరింది. ధాదింగ్ జిల్లాలోని గల్చీ గ్రామీణ మున్సిపాలిటీ-4 పరిధిలోని బెల్‌ఖుఖోలా సమీపంలో ఈ లాకర్‌ను స్థానికులు గుర్తించారు. లాకర్‌లో నగదు ఉన్న విషయం తెలియడంతో పలువురు అక్కడికి చేరుకుని డబ్బును తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో నగదు కోసం అక్కడ ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి నెలకొంది.

29 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు

బ్యాంకు లాకర్‌లోని నగదును తీసుకున్న ఘటనకు సంబంధించి పోలీసులు 29 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మొత్తం 92,68,505 నేపాలీ రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం భారత కరెన్సీలో సుమారు రూ.58 లక్షలకు సమానం. అరెస్టైన వారిలో పవన్ పౌడే, బీర్ బహదూర్ రాణా మగర్, బినోద్ గిరి, నవరాజ్ భేటువాల్, పూర్ణ లాల్ శ్రేష్ఠ, విష్ణుమణి అధికారి, కృష్ణ మగర్, శివ్ బహదూర్ రాణా మగర్, యువరాజ్ అధికారి, సుశాంత్ శ్రేష్ఠ, సూచింబహదూర్ రాణా మగర్, సబిన్ శ్రేష్ఠ, ప్రేమ్ బహదూర్ రాణా మగర్, అనిల్ భేటువాల్ తదితరులు ఉన్నారు. స్వాధీనం చేసుకున్న నగదు ఎక్కడి నుంచి వచ్చింది? లాకర్‌కు అసలు యజమాని ఎవరు? ఈ ఘటనలో మరెవరైనా ప్రమేయం ఉందా? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.