అమెరికాలో అబార్షన్కు సంబంధించి సుప్రీంకోర్టు గత శుక్రవారం సంచలన నిర్ణయం తీసుకుంది. గర్భస్రావాలను నిషేధించాలా వద్దా అనేది ఇక నుంచి రాష్ట్రా ఇష్టమని చెప్పింది. అబార్షన్కు రాజ్యాంగ రక్షణ కల్పించే చట్టాన్ని కోర్టు రద్దు చేసింది. యాభై ఏళ్ల కిందటి ఉత్తర్వును రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా.. దేశంలోని దాదాపు సగం రాష్ట్రాలు.. అబార్షన్పై నిషేధం విధించేందుకు..అలాగే కఠిన చట్టాలు చేసేందుకు అధికారం పొందనున్నాయి. ఈ నిర్ణయంతో 30 రాష్ట్రాలు తక్షణం అబార్షన్ను నిషేధించే ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉంది.
సుప్రీంకోర్టు నిర్ణయంపై ప్రెసిడెంట్ బైడెన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది అమెరికాకు విచారకరమైన రోజని అభివర్ణించారు. మహిళల ఆరోగ్యం ప్రమాదంలో పడిందంటూ ఓ ప్రకటన కూడా విడుదల చేశారాయన. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా సుప్రీం కోర్టు నిర్ణయాన్ని పూర్తిగా తప్పుపట్టారు. ఈ తీర్పు స్వేచ్ఛపై దాడిగా పేర్కొన్నారాయన. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అయితే ఇది భయంకరమైన నిర్ణయం అని కామెంట్ చేశాడు. అమెరికన్ మహిళల భయం, ఆగ్రహాన్ని ఊహించటానికి కూడా భయంగా ఉందని ఆయన ట్వీట్ చేశారు. అమెరికా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కారణంగా మహిళా ఆరోగ్య ప్రాముఖ్యత తగ్గడంతో పాటు వాళ్ల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందంటూ చాలా మంది ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా తమ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం కోర్టు తీర్పును స్వాగతించారు. ఆయన హయాంలో నియమితులైన ముగ్గురు న్యాయమూర్తుల వల్లనే ఈ తీర్పు సాధ్యమైంది.
మరోవైపు, సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ మహిళా లోకం మండిపడుతోంది. వేలాది మంది వీధుల్లోకి వచ్చి తమ నిరసన తెలుపుతున్నారు. నిజానికి గత కొంత కాలంగా అబార్షన్ అంశంపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. నిరుడు అబార్షన్పై పరిమితులు విధిస్తూ టెక్సాస్ రాష్ట్రం ఓ కొత్త చట్టాన్ని తేవటంతో నిరసనలు వెల్లువెత్తాయి. ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పుతో ఆందోళనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. 1973లో అమెరికా అబార్షన్ని చట్టబద్ధం చేసింది. ‘రో వర్సెస్ వేడ్’ అని పిలిచే ఈ చట్టాన్ని రద్దు చేయాలంటూ దాఖలైన కేసులో సుప్రీం కోర్టు ఈ తాజా తీర్పు చెప్పింది. గర్భవిచ్ఛిత్తికి సంబంధించి అమెరికాలో ఇటీవల జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో మెజార్టీ పౌరులు అబార్షన్కు మద్దతు పలికారు. మహిళలకు ఆ విషయంలో పూర్తి హక్కులు ఉండాల్సిందే అన్నారు. ఈ నేపథ్యంలో తాజా తీర్పుతో నిరసనలు ఎగిసిపడుతున్నాయి. తమ శరీరం గురించి నిర్ణయాలు తీసుకునే హక్కు తనకు తప్ప మరెవరికీ లేదని మహిళా లోకం నినదిస్తోంది. నవ మాసాలు మోసి పిల్లలను కనే కష్టం ఆడవాళ్లదే కాబట్టి దానిపై నిర్ణయం తీసుకునే హక్కు తమకే ఉండాలంటున్నారు.
వాస్తవానికి, అమెరికాలో ఒకప్పుడు అమెరికాలో అబార్షన్ చాలా చిన్న విషయం. అబార్షన్ క్లినిక్స్ మహిళలకు అందుబాటులో ఉండేవి. అయితే డాక్టర్లతోపాటు మంత్రసానులు, నకిలీ డాక్టర్లూ కూడా అబార్షన్లు చేయటం ప్రారంభించటంతో గర్భిణుల ప్రాణాలు ప్రమాదంలో పడేవి. ఒక్కోసారి చనిపోయేవారు. ఈ నేపథ్యంలోనే అబార్షన్ చట్టాలకు పునాదులు పడ్డాయి. 1821లో తొలిసారిగా కనెక్టికట్ రాష్ట్రం గర్భస్రావాన్ని నిషేధించింది. తరువాత అనేక రాష్ట్రాలు దానిని అనుసరించాయి. ఫలితంగా అబార్షన్లు చేసే డాక్టర్లు మాయమయ్యారు…క్లినిక్లు మూతపడ్డాయి. కానీ, గర్భస్రావాలు మాత్రం ఆగలేదు. చట్ట వ్యతిరేకంగా చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఓ మహిళ తన అబార్షన్ ఫెయిల్ కావటంతో 1971లో సుప్రీంకోర్టులో కేసు వేశారు. దీన్నే “రో వర్సెస్ వేడ్” కేసుగా చెబుతారు. రెండేళ్ల తర్వాత కోర్టు తీర్పు వినిపించింది. గర్భస్రావం చట్టబద్ధమని ఉత్తర్వులు ఇచ్చింది. గర్భిణికి అబార్షన్పై నిర్ణయం తీసుకునే హక్కును రాజ్యాంగం కల్పిస్తుందని చెప్పింది. ఈ తీర్పు తరువాత ఆస్పత్రుల్లో అబార్షన్ సౌకర్యాలు కల్పించడం తప్పనిసరి అయ్యింది.
మరోవైపు, గత కొన్ని దశాబ్దాలలో అబార్షన్ అంశానికి రాజకీయ ప్రాధాన్యత కూడా ఏర్పడింది. డెమాక్రాట్లు దీనిని సమర్దిస్తుండగా…రిపబ్లికన్లు వ్యతిరేకిస్తారు. నిజానికి 1973 వరకు అమెరికాలో గర్భస్రావాన్ని ఒక రాజకీయ అంశం ఎవరూ చూడలేదు. కానీ, గర్భ విచ్ఛితిని పాపం అని భావించే కేథలిక్ గ్రూపులు రిపబ్లికన్ పార్టీతో చేతులు కలపటంతో దాని చుట్టూ రాజకీయం మొదలైంది. 70వ దశకంలో విడాకుల కేసులు పెరగడం, పెళ్లిపై యువత అభిప్రాయాల్లో మార్పులు రావటం, పెళ్లికి ముందు సెక్స్, గర్భస్రావం లాంటి అంశాలు రిపబ్లికన్ పార్టీకి ప్రధాన ప్రచారాంశాలయ్యాయి. పైగా అది ప్రచ్ఛన్న యుద్ధ కాలం కావటంతో దానికి కమ్యూనిస్టులను కూడా కలిపారు. వారి ప్రభావంతో తమ సంస్కృతి నాశనం అవుతోందనే ప్రచారం కూడా చేశారు. గర్భంలో ఇంకా పుట్టని బిడ్డకు కూడా జీవించే హక్కు ఉందని, ఆ బిడ్డను ఆ దేవుడు ఇచ్చాడే తప్ప తల్లిదండ్రులు, సమాజం, ప్రభుత్వాలు కాదని వాదించారు.
రో అండ్ వేడ్ కేసులో కోర్టు తీర్పు తర్వాత రాష్ట్రాలన్నీ గర్భస్రావంపై అమలు చేసిన ఆంక్షలను తొలగించడం మొదలవగానే ఈ రిలీజియస్ గ్రూపులకు అది అతిపెద్ద సమస్యగా మారింది. దానిని అడ్డుకోడానికి అవి రాజకీయ మార్గాన్ని ఎంచుకున్నాయి. 1970 ప్రాంతంలో రిపబ్లికన్ పార్టీ బలహీనంగా ఉండేది. అది ఈ గ్రూపులతో కలిసి బలం పుంజుకుంది. ఈ మత వర్గాలు క్రమంగా రాజకీయ నేతలు విస్మరించలేని ఒక పెద్ద ఓటు బ్యాంకులా మారారు. ఫలితంగా 1968 నుంచి 1988 మధ్య జరిగిన ఆరు అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఐదు సార్లు గెలిచింది.
1983లో గర్భస్రావ చట్ట సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. కానీ అది ఆమోదం పొందలేదు. ఆ తర్వాత పార్లమెంటు ద్వారా గర్భస్రావాన్ని నిషేధించడం కష్టమని ఆ గ్రూపులకు అర్థమై కోర్టుల్లో తేల్చుకోవాలనుకున్నారు. అయితే అందుకు సంప్రదాయ జడ్జిల నియామకం అవసరమైంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు ఇతర జడ్జీలను కూడా అమెరికా అధ్యక్షుడే నియమి స్తాడు. అయితే వీరి నామినేషన్ని సెనేట్ నిర్ధారించాల్సి ఉంటుంది.
ఒకసారి జడ్జీలు పదవిలోకి వచ్చాక వారు జీవితకాలం ఆ పదవిలో కొనసాగుతారు. గత 233 సంవత్సరాలలో అమెరికా సుప్రీంకోర్టు 17 మంది ప్రధాన న్యాయ మూర్తులను మాత్రమే చూసింది. గత 35 ఏళ్లలో ఇద్దరు మాత్రమే ఆ పదవిని చేపట్టారు. ప్రస్తుత చీఫ్ జస్టిస్ జాన్ జి. రాబర్ట్స్ జూనియర్ ని 2005లో నాటి అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ అపాయింట్ చేశాడు. రాబర్ట్స్కు ముందు 1986 లో రొనాల్డ్ రీగన్ ..విలియం రెహ్ంక్విస్ట్ ని ప్రధాన న్యాయమూర్తిగా నియమించాడు. 2005లో తన 80వ ఏట మరణించే వరకు ఆయన ఆ పదవిలో కొనసాగారు.
ప్రస్తుత చీఫ్ జస్టిస్ జాన్ జి. రాబర్ట్స్ జూనియర్ గత పదిహేడేళ్గుగా చీఫ్ జస్టిస్గా ఉన్నారు. ఆయన వయస్సు 67 ఏళ్లు..ప్రస్తుతం ఆమెరికా పౌరుల సగటు ఆయుర్థాయం 79.05 సంవత్సరాలుగా ఉంది. ఈ లెక్కన ఆయన కనీసం మరో 13 ఏళ్లు ఆ పదవిలో ఉంటారు. ఈ పద్దతిని మార్చడా నికి బైడెన్కు అవకాశం వచ్చింది. తన ఎన్నికల ప్రచారంలో ఆయన జడ్జీల శాశ్వత నియామకం గురించి లేవనెత్తారు. కానీ అధ్యక్ష పదవి చేపట్టిన తరువాత ఆ మాటే మర్చిపోయాడు.
ఈ నేపథ్యంలో గత కొన్ని దశాబ్దాలుగా సుప్రీంకోర్టు జడ్జిల నియామకం విషయంలో రాజకీయ పార్టీలు రెండుగా చీలాయి. అధికారం డెమాక్రాట్స్ చేతుల్లో ఉంటే సుప్రీంకోర్టులో గర్భస్రావాన్ని సమర్థించే జడ్జిలు వస్తారు. అలాగే రిపబ్లికన్లు అధికారంలో ఉంటే గర్భస్రావాన్ని వ్యతిరేకించే ఆలోచనా ధోరణి ఉన్న జడ్జిలను నియమిస్తారు. రిపబ్లికన్ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ అబార్షన్ పట్ల వ్యతిరేక భావాలు కలిగిన న్యాయమూర్తులను నియమించాడు.
సుప్రీం కోర్టు తాజా తీర్పు వల్ల రాష్ట్రాలు అబార్షన్పై స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవచ్చు. ప్రస్తుతం పాతిక నుంచి 30 రాష్ట్రాలు గర్భస్రావాలను వ్యతిరేకిస్తున్నాయి. అంటే ఆ రాష్ట్రాలు 1973 కు ముందు ఉన్న పరిస్థితులకు వెళ్లిపోతాయి. ఇప్పటికే, అలబామా, అర్కన్సాస్, కెంటకీ, లూసియానా, మిసోరి, ఒక్లహామా, సౌత్ డకోటా అబార్షన్లను నిషేధించే ప్రక్రియను ప్రారంభించాయి. మరో 23 రాష్ట్రాలు అదే బాటలో ఉన్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో అబార్షన్ క్లినిక్స్ మూతపడ్డాయి. తాజా గణాంకాల ప్రకారం అమెరికాలో ప్రతి నలుగురు మహిళలో ఒకరు 45 ఏళ్ల వయసులోనూ అబార్షన్ చేయించుకుంటున్నారు. 20–30 ఏళ్ల వయసు వారిలో ఏకంగా 60 శాతం అబార్షన్లు జరుగుతున్నాయి. వీరిలో ఆఫ్రికన్ నిరుపేద, అందులోనూ నల్లజాతి మహిళలే ఎక్కువ. ఇన్సూరెన్స్ లేని టీనేజర్లు, వలస వచ్చిన మహిళలపై తాజా తీర్పు తీవ్ర ప్రభావం చూపించనుంది.
మరోవైపు, డెమొక్రాట్ల ప్రాబల్యం కలిగిన కాలిఫోర్నియా, న్యూయార్క్, వాషింగ్టన్ సహా పది రాష్ట్రాల్లో అబార్షన్లకు చట్టబద్ధత కొనసాగనుంది. దాంతో నిషేధమున్న రాష్ట్రాల మహిళలు అబార్షన్కు వందలాది మైళ్ల దూరం ప్రయాణించి ఇలాంటి రాష్ట్రాలకు వెళ్లాలి. సుప్రీంకోర్టు తాజా తీర్పు వల్ల దేశం అబార్షన్ వ్యతిరేక, అనుకూల రాష్ట్రాలుగా విడిపోయింది. అబార్షన్ వ్యతిరేక గ్రూపులు దీనిని మొత్తం దేశమంతా నిషేధించాలంటూ ప్రచారం ప్రారంభించాయి. రాబోవు కాలంలో అమెరికాలో ఇది కీలక అంశంగా కొనసాగుతుందనటంలో సందేహం లేదు.
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గణాంకాల ప్రకారం వివిధ కారణాలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఐదున్నర కోట్ల మందికి పైగా మహిళలు అబార్షన్ చేయించుకుంటున్నారు. వాటిలో 45 శాతం గర్భస్రావాలు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. భారత్ లాంటి దేశాల్లో అయితే ఆ ప్రమాదం మరీ ఎక్కువ. సాధారణంగా పెళ్లికాని యువతులు అబార్షన్ గురించి వైద్యులను సంప్రదించడానికి వెనకాడుతారు. అందుకే, భారత్లో అబార్షన్ చట్టాల్లో మార్పు తేవాలనే డిమాండ్లు పెరిగిపోయాయి. పార్లమెంటులో దీనిపై సవరణ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. ఈ ప్రతిపాదిత బిల్లు ప్రకారం… పెళ్లయినా, కాకపోయినా మహిళలు అబార్షన్ చేయించుకోవచ్చు. మహిళల వ్యక్తిగత గోప్యతకు కూడా ఈ బిల్లు ప్రాధాన్యమిస్తుంది. డాక్టర్లు వారిని అనవసర ప్రశ్నలు అడగడానికి కూడా వీల్లేదు. 18ఏళ్లు దాటిన మహిళలు ఎవరి అనుమతీ తీసుకునే అవసరం కూడా లేదు.
అమెరికాతో పోల్చితే భారత్లో డాక్టర్ల అనుమతితో 20 వారాల వయసు పిండాన్ని తొలగించుకోవచ్చు. పిండంలో ఏవైనా తీవ్ర వ్యాధులు ఉన్నట్లు సంకేతాలు కనిపిస్తే మెడికల్ బోర్డ్ అనుమతితో 20 వారాల తర్వాత కూడా కొన్ని వారాల వరకు గర్భస్రావం చేయించుకోవచ్చు. అంటే, గర్భస్రావం విషయంలో అమెరికాతో పోలిస్తే ఇక్కడి మహిళల పరిస్థితి మెరుగ్గా ఉందనిపిస్తుంది. కానీ, ఇక్కడ అబార్షన్ నిర్ణయం మహిళల చేతుల్లో కాకుండా వారి భర్త, కుటుంబం చేతిలో ఉంది. కాబట్టి, అబార్షన్ కోసం మహిళ ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దానిని సమాజంలో ఒక కళంకంలా కూడా చూస్తారు. అందుకే చాలా కేసుల్లో మహిళలు సురక్షితం కాని గర్భస్రావ పద్ధతులను ఎంచుకోవాల్సి వస్తోంది.
ఒక అధ్యయనం ప్రకారం మన దేశంలో ప్రతి ఏటా కోటిన్నర మందికి పైగా మహిళలు అబార్షన్కు వెళుతున్నారు. కానీ అందులో కేవలం 20 శాతం మాత్రమే ..అంటే 35 లక్షల అబార్షన్లు మాత్రమే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల వరకు వెళుతున్నాయి. అంటే చట్టపరంగా గర్భస్రావం చేయించుకునే అవకాశం ఉన్నప్పటికీ ఇతర సమస్యల వల్ల సురక్షితం కాని పద్దతులను మార్గాలను ఎంచుకోవాల్సి వస్తోంది. చట్టం ఉంది…కానీ అమలులో లోపాలు ఉన్నాయని అర్థమవుతోంది. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితి కాస్త మారుతోంది. అబార్షన్ గురించి మాట్లాడుతున్నారు.
అబార్షన్ నిషేధిత చట్టాలను కొన్ని దేశాలు కఠినంగా అమలు చేస్తుండగా మరి కొన్ని దేశాలు ప్రత్యేక పరిస్థితులలో అనుమతిస్తున్నాయి. ఇస్లామిక్ దేశాలలో అబార్షన్ను తీవ్ర నేరంగా పరిగణిస్తారు. పోలండ్ వంటి పలు ఐరోపా దేశాలలో అబార్షన్ చట్టాలను కఠినంగా అమలుచేస్తారు. చాలా దేశాలలో అన్ని రకాల అబార్షన్లను నేరంగానే పరిగణిస్తారు. పిండంలో లోపాలున్నా కూడా గర్భస్రావం అవకాశం లేదు. దీనిపై తరచూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇతర దేశాలకు వెళ్లి అబార్షన్లు చేయించుకోవాల్సి వస్తోంది. అబార్షన్ చట్టాలను సరళం చేసే బిల్లును పోలండ్ పార్లమెంట్ తాజాగా తిరస్కరించింది.
గల్ఫ్ దేశాలలో అబార్షన్ తీవ్ర నేరంగా పరిగణిస్తారు. డాక్టర్లు, ఇస్లామిక్ న్యాయ నిపుణులతో కూడిన కమిటీ ఆమోదం తెలిపిన తర్వాత తల్లి ప్రాణానికి హాని ఉందని భావించినప్పుడు మాత్రమే దానికి అనుమతిస్తారు. అక్రమ అబార్షన్లకు పాల్పడిన వారికి కొరడా దెబ్బలతో పాటు జైలు శిక్షలు తప్పవు. ఏదేమైనా, అమెరికా సుప్రీం కోర్టు నిర్ణయంతో అబార్షన్ అంశం మరోసారి మీడియా హెడ్లైన్స్ కు ఎక్కింది. యూఎస్ లో పలు చోట్ల అబార్షన్ క్లినిక్ లు మూతపడుతున్నాయి. ఇప్పుడు ఇష్టం లేని గర్భాన్ని తొలగించుకోవాలంటే రాష్ట్రం దాటి వెళ్లటం ఒక్కటే మార్గం.
రాబోవు రోజులలో అమెరికా వీధుల్లో ఆందోళనల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు, ఈ తీర్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అధ్యక్షుడు బైడెన్ కు దీని నుంచి రాజకీయ ప్రయోజనం కలిగే అవకాశం కూడా ఉంది. వచ్చే నవంబర్లో జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో ఆయన గెలుపై అనుమానాలు వ్యక్తమవుతున్న సమయంలో ఇది ఆయనకు కలిసొచ్చే అంశం. వ్యక్తిగత స్వేచ్ఛను అమెరికన్లు జన్మహక్కుగా భావిస్తారు కాబట్టి అబార్షన్ హక్కు కోసం నిరంతరం పోరాటం కొనసాగుతూనే ఉంటుంది!
As US makes abortion illegal, Latest Telugu New, Special Story on US Abortion Law