బ్రిటన్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. అధికార లేబర్ పార్టీలో అంతర్గత విభేదాలు కారణంగా ప్రధాని పదవికి కీర్ స్టార్మర్ రాజీనామా చేశారు. స్వయంగా కీర్ స్టార్మర్ ప్రకటించారు. సోమవారం ఉదయం రాజు చార్ల్స్-IIIకి ఫోన్ ద్వారా తన రాజీనామా విషయాన్ని తెలియజేశారు. దేశానికి కొత్త నాయకత్వం అవసరమని పేర్కొన్నారు. తన వారసుడికి పూర్తి సహకారం అందించి అధికార బదిలీ సాఫీగా జరిగేలా చూస్తానని తెలిపారు. గత దశాబ్దంలో పూర్తి పదవీకాలం ముగియకముందే పదవి వీడిన ఆరో బ్రిటిష్ ప్రధానిగా స్టార్మర్ నిలిచారు. దీంతో యునైటెడ్ కింగ్డమ్లో ఒక్కసారిగా రాజకీయ సంక్షోభం నెలకొంది.
ఇక కీర్ స్టార్మర్ రాజీనామాతో తదుపరి బ్రిటన్ ప్రధాని రేసులోకి ఆండీ బర్న్హామ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గ్రేటర్ మాంచెస్టర్ మేయర్గా ఉన్న ఆండీ బర్న్హామ్ తదుపరి ప్రధాని రేసులో ముందంజలో ఉన్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల జరిగిన మేకర్ఫీల్డ్ ఉపఎన్నికల్లో ఆయన సాధించిన ఘన విజయం లేబర్ పార్టీలో ఆయనకు మద్దతును మరింత పెంచింది. 56 ఏళ్ల బర్న్హామ్ను స్టార్మర్కు ప్రధాన అంతర్గత ప్రత్యర్థిగా పరిగణిస్తారు. లేబర్ పార్టీని మధ్యమార్గ రాజకీయాల వైపు తీసుకెళ్లాలని స్టార్మర్ ప్రయత్నించగా.. బర్న్హామ్ మాత్రం సంప్రదాయ లేబర్ భావజాలానికి దగ్గరగా ఉన్న నేతగా గుర్తింపు పొందారు. ఉత్తర ఇంగ్లాండ్లో బలమైన ప్రజాదరణ కారణంగా ఆయనను “కింగ్ ఆఫ్ ది నార్త్” అని కూడా పిలుస్తారు. 2017 నుంచి వరుసగా మూడు మేయర్ ఎన్నికల్లో విజయం సాధించిన బర్న్హామ్.. సమర్థవంతమైన వక్తగా కూడా పేరు సంపాదించారు.
భారత్తో బర్న్హామ్కు ప్రత్యేక అనుబంధం
ఆండీ బర్న్హామ్ ఎదుగుదల భారత్-బ్రిటన్ సంబంధాల పరంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (CETA) జూలై 15, 2026 నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఆయన నాయకత్వం కీలకంగా మారే అవకాశం ఉంది. 2025 జూలై 26న సంతకం చేసిన ఈ ఒప్పందం ద్వారా భారత్-బ్రిటన్ మధ్య వాణిజ్య, పెట్టుబడి సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని అంచనా వేస్తున్నారు. భారత ఉత్పత్తులకు బ్రిటిష్ మార్కెట్లో ప్రాధాన్యత పెరగడంతో బంగ్లాదేశ్, పాకిస్థాన్ వంటి దేశాల ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
2019లో గ్రేటర్ మాంచెస్టర్ మేయర్గా బర్న్హామ్ భారత్ పర్యటన చేపట్టి పలు వాణిజ్య ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. అనంతరం “మాంచెస్టర్-ఇండియా పార్ట్నర్షిప్” వ్యూహానికి మద్దతు తెలుపుతూ వాణిజ్యం, పెట్టుబడులు, ఆవిష్కరణల రంగాల్లో సహకారాన్ని ప్రోత్సహించారు. మాంచెస్టర్ ప్రాంతంలో నివసిస్తున్న 55 వేల మందికి పైగా భారతీయ సంతతి ప్రజలను ఆయన పలుమార్లు ప్రశంసించారు. ప్రాంతీయ అభివృద్ధిలో భారతీయ సమాజం కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.
2019లో బెంగళూరు పర్యటన సందర్భంగా మాంచెస్టర్, బెంగళూరును “సిస్టర్ సిటీస్”గా అభివృద్ధి చేయాలని బర్న్హామ్ ప్రతిపాదించారు. టెక్నాలజీ, స్టార్టప్లు, ఆవిష్కరణల రంగాల్లో ఇరు నగరాలకు ఉన్న సామర్థ్యాలను ఆయన ప్రస్తావించారు. అలాగే సాల్ఫర్డ్ యూనివర్సిటీ, కర్ణాటక రాష్ట్ర ఉన్నత విద్యా మండలి మధ్య అవగాహన ఒప్పందానికి కూడా ఆయన మద్దతు ఇచ్చారు.
భారత్కు ఏమి లాభం?
2024లో నిర్వహించిన బహునగర వాణిజ్య మిషన్, 2025లో మాంచెస్టర్లో భారత తొలి కాన్సులేట్ జనరల్ కార్యాలయం ప్రారంభం వంటి కార్యక్రమాలకు బర్న్హామ్ మద్దతు తెలిపారు. వీటి ద్వారా 100 మిలియన్ పౌండ్లకు పైగా పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఏర్పడ్డాయి. ఆండీ బర్న్హామ్ యూకే తదుపరి ప్రధానిగా బాధ్యతలు చేపడితే వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, విద్య రంగాల్లో భారత్-బ్రిటన్ సంబంధాలు మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉందని రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

