Drone Attack: యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)పై జరిగిన భారీ డ్రోన్ దాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపింది. అబుదాబిలోని ప్రముఖ ‘బరకా అణు విద్యుత్ కేంద్రం’ వెలుపల ఈ దాడి జరగ్గా, అనంతరం అక్కడ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇరాన్కు చెందిన డ్రోన్ ద్వారానే ఈ దాడి జరిగినట్లు అధికారులు గుర్తించారు.
అబుదాబి మీడియా కార్యాలయం నివేదికల ప్రకారం.. బరకా అణు విద్యుత్ కేంద్రం వెలుపలి భద్రతా వలయం (సెక్యూరిటీ పెరిమీటర్) సమీపంలో ఈ డ్రోన్ దాడి జరిగింది. ఈ క్రమంలో ప్లాంట్ ప్రాంగణంలోని ఒక విద్యుత్ జనరేటర్కు మంటలు అంటుకున్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ దాడి వల్ల ఎలాంటి రేడియేషన్ లీకేజీ కాలేదని, అణు భద్రతకు సంబంధించిన ఎలాంటి సమస్యలు తలెత్తలేదని అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి.
అరబ్ ప్రపంచంలోనే తొలి అణు కేంద్రం..
అల్ ధఫ్రా ప్రాంతంలో ఉన్న ఈ ‘బరకా అణు విద్యుత్ కేంద్రం’ అరబ్ ప్రపంచంలోనే మొట్టమొదటి న్యూక్లియర్ ప్లాంట్ కావడం గమనార్హం. యూఏఈ మొత్తం విద్యుత్ సరఫరాలో మెజారిటీ వాటాను ఈ ప్లాంటే అందిస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన రక్షణ, అగ్నిమాపక బృందాలు మంటలను అదుపులోకి తెచ్చాయి. ప్రస్తుతం ప్లాంట్లోని అన్ని యూనిట్లు సాధారణంగానే పనిచేస్తున్నాయని, కీలక వ్యవస్థలకు ఎలాంటి నష్టం జరగలేదని ‘ఫెడరల్ అథారిటీ ఫర్ న్యూక్లియర్ రెగ్యులేషన్’ (FANR) ప్రకటించింది. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని, కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని యూఏఈ ప్రభుత్వం ప్రజలను కోరింది.
గత ఫిబ్రవరి 28న ఇరాన్తో ఉద్రిక్తతలు ప్రారంభమైనప్పటి నుంచి యూఏఈ లక్ష్యంగా అనేక క్షిపణి, డ్రోన్ దాడులు జరుగుతున్నాయి. గతంలోనూ ఇక్కడి ఇంధన కేంద్రాలు, సముద్ర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. తాజా దాడికి ఇరాన్ నేరుగా బాధ్యత వహించనప్పటికీ, దానికి సంబంధించిన డ్రోన్లను ఉపయోగించినట్లు యూఏఈ అధికారులు ధృవీకరించారు. అమెరికా, ఇజ్రాయెల్ – ఇరాన్పై దాడులు స్టార్ట్ చేసినప్పటి నుంచి యూఏఈ తీవ్రంగా నష్టపోయింది. ఇప్పటివరకు ఇరాన్ యూఏఈపై దాదాపు 2,800కు పైగా డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించినట్లు సమాచారం.
మరోవైపు అంతర్జాతీయంగా ఉద్రిక్తతలను తగ్గించేందుకు జరుగుతున్న అమెరికా-ఇరాన్ చర్చలు పూర్తిగా ఆగిపోయాయి. అమెరికా ఇరాన్పై దాడులను గత నెలలోనే నిలిపి వేసినప్పటికీ, ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించడం స్టార్ట్ చేసింది. ముఖ్యంగా అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన ‘హోర్ముజ్ జలసంధి’ పై ఇరాన్ కఠినమైన నియంత్రణను కొనసాగిస్తోంది. ఈ మార్గంలో చమురు రవాణాకు అంతరాయం కలగడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం ఏర్పడింది, దీని ఫలితంగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇరు దేశాలు పట్టు విడువకపోవడంతో శాంతి చర్చలు ప్రస్తుతానికి లేనట్లే కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
