Pakistan: పాక్ జైలు నుంచి తప్పించుకున్న 200 మంది ఖైదీలు.. కరాచీలో ఉద్రిక్తత..

  • పాకిస్తాన్‌లో జైలు నుంచి తప్పించుకున్న ఖైదీలు..
  • కరాచీ మాలిర్ జైలులో ఘటన..
  • 200 మంది వరకు పారిపోయినట్లు వార్తలు..
Pakistan

Pakistan

Pakistan: పాకిస్తాన్‌కి భారీ దెబ్బ తగిలింది. కరుడుగట్టిన నేరస్తులు ఉండే కరాచీలోని మాలిర్ జైలు నుంచి ఖైదీలు తప్పించుకున్నారు. మాలిర్ జైలు లోపల హింసాత్మక దాడి జరిగిన తర్వాత సోమవారం అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన జరిగింది. ఖైదీలు పోలీస్ అధికారులతో ఘర్షణ పడిన తర్వాత తప్పించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో, కరాచీ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ఖైదీలు జైలు ప్రవేశద్వారాన్ని బద్దలుకొట్టి పెద్ద సంఖ్యలో పారిపోయారు. జైలులో పెద్ద ఎత్తున కాల్పులు జరిగినట్లు రిపోర్టులు వస్తున్నాయి. సాధారణ ప్రజలు జైలు పరిసరాల నుంచి వెంటనే వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

Read Also: US-India Trade Deal: భారతదేశంతో త్వరలో వాణిజ్య ఒప్పందం: యూఎస్ వాణిజ్య కార్యదర్శి..

దాదాపుగా 200 మంది వరకు ఖైదీలు తప్పించుకున్నట్లు సమాచారం. అయితే, వీరిలో 20 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఖైదీల దాడిలో గాయపడిన ఒక పోలీస్ పరిస్థితి విషమంగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి. భద్రతా కారణాల దృష్ట్యా జైలుకు ఆనుకుని ఉన్న జాతీయ రహదారిని రెండు వైపులా తాత్కాలికంగా మూసివేయారు. జైలు డిఐజి హసన్ సెహ్టో తరువాత మీడియాతో మాట్లాడుతూ, జైలు మొత్తాన్ని సీల్ చేశామని, కొంతమంది ఖైదీలు, పోలీసులు గాయపడినట్లు తెలిపారు. మరోవైపు, పరిస్థితిని చక్కదిద్దేందుకు పాక్ రేంజర్లు, పోలీసులు, ఎఫ్‌సి సిబ్బంది ప్రయత్నిస్తోంది.