Harappa Facts : నాలుగు వేల సంవత్సరాల నాటి ఓ చిన్న ముద్ర… దానిపై చెక్కిన ఓ రహస్యమైన బొమ్మ… దాని గురించి ఇప్పటికీ ఎవరికీ ఖచ్చితమైన సమాధానం లేదు. అయితే ఆ ముద్ర ఇప్పుడు భారత చరిత్ర, హిందూ సంప్రదాయాలు, నాగరికతల మూలాలు, పురావస్తు పరిశోధనలపై ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. మొహెంజోదారో తవ్వకాల్లో బయటపడిన ప్రసిద్ధ పశుపతి ముద్రపై భారత ప్రభుత్వం చెప్పిన ఒక వ్యాఖ్య, అమెరికన్ చరిత్రకారిణి ఆడ్రీ ట్రష్కే చేసిన ఒక అభ్యంతరం, దానికి భారతీయ చరిత్రకారులు ఇచ్చిన ప్రతిస్పందనలు కలిసి ఇప్పుడు పెద్ద యుద్ధంగా మారాయి. అసలు ఆ ముద్రపై కనిపిస్తున్న వ్యక్తి శివుడేనా? లేక వేరే నాగరికత నుంచి వచ్చిన ఏదైనా దేవతా రూపమా? శతాబ్దకాలంగా కొనసాగుతున్న ఈ వివాదం మళ్లీ ఎందుకు తెరపైకి వచ్చింది?
ఈ వివాదానికి కేంద్రబిందువైనది మొహెంజోదారోలో లభించిన ప్రసిద్ధ పశుపతి ముద్ర. ప్రస్తుతం పాకిస్థాన్లో ఉన్న ఈ పురాతన నగరం సింధు సరస్వతి నాగరికతకు ప్రధాన కేంద్రాల్లో ఒకటి. సుమారు క్రీస్తుపూర్వం 2300 నుంచి 2000 మధ్యకాలానికి చెందిన ఈ ముద్రపై కొమ్ములు ధరించిన ఓ వ్యక్తి యోగాసనాన్ని పోలిన భంగిమలో కూర్చుని కనిపిస్తాడు. చుట్టూ ఏనుగు, ఖడ్గమృగం, నీటి గేదె వంటి జంతువులు కనిపిస్తాయి. 1920లలో మొహెంజోదారో తవ్వకాలకు నాయకత్వం వహించిన బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్త జాన్ మార్షల్ ఈ బొమ్మను ప్రోటో శివుడు, పశుపతి రూపంగా అభివర్ణించారు. అప్పటి నుంచి ఈ వ్యాఖ్యానం ప్రజల్లో బలంగా స్థిరపడిపోయింది.
ఇటీవల కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ ముద్రను భారత నాగరికత నిరంతరత్వానికి ప్రతీకగా పేర్కొంటూ, దీనిపై ఉన్న వ్యక్తిని శివ పశుపతిగా అభివర్ణించింది. ములబంధాసనాన్ని పోలిన యోగ భంగిమ, శైవ సంప్రదాయాలను గుర్తు చేసే అంశాలు భారతీయ ఆధ్యాత్మిక వారసత్వానికి నిదర్శనమని పేర్కొంది. అయితే అమెరికన్ చరిత్రకారిణి ఆడ్రీ ట్రష్కే దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆమె అభిప్రాయం ప్రకారం ఈ బొమ్మ శివుడిది కాదని, ప్రాచీన ఇరాన్ ప్రాంతంలో వికసించిన ప్రోటో ఎలమైట్ నాగరికతకు చెందిన లార్డ్ ఆఫ్ యానిమల్స్ అనే దేవతా భావన ప్రభావంతో రూపొందిన రూపంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
ఆడ్రీ ట్రష్కే వ్యాఖ్యలపై భారతీయ రచయిత అమీష్ త్రిపాఠి తీవ్రంగా స్పందించారు. ముద్రపై కనిపించే ఏనుగు, ఖడ్గమృగం, నీటి గేదె వంటి జంతువులు భారత ఉపఖండానికి చెందినవేనని, అవి ప్రాచీన ఎలమ్ ప్రాంతంలో లేవని గుర్తు చేశారు. అంతేకాకుండా యోగాసనాన్ని పోలిన భంగిమను కూడా ప్రస్తావిస్తూ, ఇప్పుడు యోగాను కూడా ఎలమైట్ సంప్రదాయమే అంటారా అని ప్రశ్నించారు. చరిత్రకారిణి లావణ్య వెంసాని అయితే పశుపతి ముద్రకు, ఎలమైట్ ముద్రలకు పోలికే లేదని స్పష్టంగా పేర్కొన్నారు.
అయితే ఈ వివాదానికి మరో కోణం కూడా ఉంది. జర్మన్ ఇండాలజిస్ట్ డోరిస్ శ్రీనివాసన్ సహా పలువురు పరిశోధకులు గతంలోనే జాన్ మార్షల్ ప్రతిపాదించిన ప్రోటో శివ సిద్ధాంతాన్ని ప్రశ్నించారు. వారి అభిప్రాయం ప్రకారం హరప్పా కాలంలోని ఈ బొమ్మను నేరుగా శివుడిగా గుర్తించేందుకు తగిన ఆధారాలు లేవు. కొందరు దీనిని సంతానోత్పత్తికి సంబంధించిన దేవతగా భావిస్తే, మరికొందరు ఎద్దు మనిషి రూపంగా వ్యాఖ్యానించారు.
చరిత్రకారిణి రుచికా శర్మ కూడా ఇదే వాదనను ముందుకు తెచ్చారు. వేదకాల రుద్రుడు యోగి కాదని, పశుపతి లక్షణాలు కూడా చాలా తరువాతి కాలంలో శివునికి జతచేయబడ్డాయని ఆమె అభిప్రాయపడ్డారు. అందువల్ల హరప్పా కాలం నాటి ఈ బొమ్మను ఆధునిక హిందూ సంప్రదాయాల్లోని శివుడితో నేరుగా అనుసంధానం చేయడం చారిత్రకంగా జాగ్రత్తగా చూడాల్సిన అంశమని పేర్కొన్నారు.
పురాణ పరిశోధకుడు దేవదత్ పట్నాయక్ మాత్రం, ఈ బొమ్మను శివుడిగా ఖచ్చితంగా చెప్పలేమని, అదే సమయంలో యోగాసనాన్ని పోలిన భంగిమను కూడా విస్మరించలేమని ఆయన అభిప్రాయపడ్డారు. కొన్ని ముద్రల్లో కనిపించే చిహ్నాలు పురుష, స్త్రీ లక్షణాలపై కూడా కొత్త ప్రశ్నలను లేవనెత్తుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
అసలు సమస్య ఏంటంటే హరప్పా లిపి ఇప్పటికీ పూర్తిగా అర్థం కాలేదు. అందువల్ల ఈ నాగరికత ప్రజలు ఎవరిని ఆరాధించేవారు, వారి మత విశ్వాసాలు ఏమిటి, ఈ ముద్రల అసలు అర్థం ఏమిటి అనే ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానాలు లేవు. అందుకే పశుపతి ముద్రపై జరుగుతున్న ఈ చర్చ కేవలం ఒక పురావస్తు వస్తువు గురించే కాదు. భారత నాగరికత మూలాలు ఎక్కడ ఉన్నాయి, వేల ఏళ్ల సాంస్కృతిక నిరంతరత్వం నిజంగానే ఉందా, చరిత్రను ఎవరు ఎలా అర్థం చేసుకోవాలి అనే ప్రశ్నలన్నీ ఇందులో ముడిపడి ఉన్నాయి. అందుకే నాలుగు వేల ఏళ్ల నాటి ఆ చిన్న ముద్ర ఇప్పటికీ చరిత్ర ప్రపంచాన్ని ఆలోచింపజేస్తూనే ఉంది.
