Explainer: బంగారం మనది.. బిజినెస్ వాళ్లది.. ఆసియాలో గోల్డ్‌ హబ్‌గా సింగపూర్ ఎలా మారింది?

Singapore Gold Hub

Singapore Gold Hub

Singapore Gold Hub: భారతీయులకు బంగారం మీద ఉన్న ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పండగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు.. ఇలా ఏదైనా సరే కచ్చితంగా బంగారం కొంటుంటాం. ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని కొనేది మనమే. అయితే ఈ బిజినెస్ లో అసలైన లాభాలు, ఆధిపత్యం మాత్రం మనకు రావడం లేదు. ఆసియాలో ఇండియా లాంటి దేశాలు పెద్ద ఎత్తున పసిడి కొనుగోళ్లు చేస్తుంటే.. సింగపూర్ లాంటి దేశాలు తెర వెనుక ఉండి అసలు ఆట ఆడుతున్నాయి. మన దగ్గర డిమాండ్ ఉన్నా.. సింగపూర్ మాత్రం ఆసియా గోల్డ్ హబ్‌గా మారిపోతోంది.
YouTube video player

ట్రేడింగ్.. స్టోరేజ్.. ఫైనాన్సింగ్‌లో ఇండియా కీలక పాత్ర:

భారతీయుల ఇళ్లలో దాదాపు 25 వేల టన్నుల బంగారం ఉందని ఒక అంచనా. ప్రపంచంలోని చాలా దేశాల సెంట్రల్ బ్యాంకుల దగ్గర ఉన్న రిజర్వుల కంటే మన దగ్గర ఉన్న బంగారమే ఎక్కువ. ఇది వినడానికి బాగానే ఉన్నా ఇక్కడే ఒక అసక్తికరమైన విషయం ఉంది. ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద కన్స్యూమర్ అయినప్పటికీ ట్రేడింగ్.. స్టోరేజ్.. ఫైనాన్సింగ్ లాంటి విషయాల్లో మన పాత్ర చాలా తక్కువ. మన దేశం కేవలం కొనుగోలుకే పరిమితం అవుతోంది. గ్లోబల్‌గా బంగారాన్ని ఒక చోట నుంచి మరో చోటికి తరలించే ఎకో సిస్టమ్‌లో ఇండియా పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది. ఈ గ్యాప్‌ను ఆధారం చేసుకుని సింగపూర్ ఇప్పుడు కొత్త అవకాశాలను వెతుకుతోంది. ఆసియాలో గోల్డ్ వ్యాపారాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు భారీ ప్రణాళికలు రచిస్తోంది…స్పాట్

సింగపూర్‌ లక్ష్యం ఏంటి?

ఆసియా ఖండంలో బంగారానికి తిరుగులేని హబ్‌గా మారాలనేది సింగపూర్ లక్ష్యం. ఇందులో భాగంగా సెంట్రల్ బ్యాంకుల కోసం ప్రత్యేకంగా వాల్ట్ సేవలు, కొత్త గోల్డ్ క్లియరింగ్ సెటిల్మెంట్ సిస్టమ్ తీసుకురావాలని ఆ దేశం ప్లాన్ చేస్తోంది. ఇదంతా అర్థం కావాలంటే అసలు గోల్డ్ బిజినెస్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి. ఈ సిస్టమ్ లో ముఖ్యంగా నాలుగు దశలు ఉంటాయి. అవి మైనింగ్-రిఫైనింగ్, ట్రేడింగ్-ప్రైస్ డిస్కవరీ, స్టోరేజ్-క్లియరింగ్, చివరగా వినియోగం. ఈ నాలుగు లేయర్స్ లో ఇండియా కేవలం చివరిదైన వినియోగంలో మాత్రమే నంబర్ వన్ స్థానంలో ఉంది. మిగతా విభాగాల్లో మన దేశం ఆధిపత్యం చూపడం లేదు.

ప్రపంచవ్యాప్తంగా ఒకే గోల్డ్ మార్కెట్ అంటూ ఏమీ లేదు. వివిధ దేశాల్లోని ఫైనాన్షియల్ సెంటర్లు ఒక్కో విభాగంలో స్పెషలైజేషన్ సాధించాయి. లండన్ హోల్ సేల్ బులియన్ ట్రేడింగ్ లో టాప్ లో ఉంటే న్యూయార్క్ ఫ్యూచర్స్ కు కేంద్రంగా ఉంది. షాంఘై ఫిజికల్ ట్రేడింగ్‌కు హబ్‌గా మారగా స్విట్జర్లాండ్ రిఫైనింగ్‌కు కేరాఫ్ గా నిలిచింది. దుబాయ్ బులియన్ మార్కెట్‌కు బ్రిడ్జిగా పనిచేస్తోంది. ఈ పరిస్థితిని మార్చడానికి ఇండియా కూడా గట్టిగానే ప్రయత్నించింది. 2022లో గిఫ్ట్ సిటీలో ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్ ను ప్రారంభించింది. కొనుగోలుదారులు నేరుగా స్థానిక ఎక్స్చేంజ్ ద్వారా బంగారం కొనేలా చేయడం దీని ఉద్దేశం. ఈ ప్లాట్ ఫామ్ ద్వారా మార్చి 2025 నాటికి ఏకంగా 100 టన్నులకు పైగా బంగారం ఇంపోర్ట్ అయ్యింది.

అయితే కేవలం ఎక్స్చేంజ్ ఏర్పాటు చేయడం, హబ్ గా మారడం ఈ రెండు వేర్వేరు విషయాలు. ఇందులో లండన్‌ను ఒకసారి గమనించాలి. వందల ఏళ్లుగా గ్లోబల్ గోల్డ్ ట్రేడ్ కు లండన్ రారాజుగా ఉంది. ప్రపంచంలోని సెంట్రల్ బ్యాంకులు ఇక్కడే లావాదేవీలు చేస్తుంటాయి. దీనికి కారణం అక్కడ ఉన్న అతిపెద్ద ఎక్స్చేంజ్ మాత్రమే కాదు.. వారు ఏర్పాటు చేసిన ఎకో సిస్టమ్. లోకో లండన్ పేరుతో ఉన్న ఈ నెట్వర్క్ లో వాల్ట్స్, బులియన్ బ్యాంక్స్, క్లియరింగ్ హౌసెస్, ఇన్సూరెన్స్ సంస్థలు అన్నీ ఒక పద్ధతిలో పనిచేస్తాయి. ఇక్కడి విధానాలపై ప్రజలకు నమ్మకం కూుడా ఎక్కువే. అందుకే ప్రపంచం మొత్తం లండన్ ధరలనే ప్రామాణికంగా తీసుకుంటుంది.

సింగపూర్ సరిగ్గా ఇదే పాయింట్ ను క్యాచ్ చేసింది. కేవలం ట్రేడింగ్ వేదికలను ఏర్పాటు చేయడానికి బదులు మార్కెట్ వెనుక ఉన్న వాల్ట్స్, క్లియరింగ్ సిస్టమ్స్, కస్టడీ సేవలపై దృష్టి పెట్టింది. ఆసియా దేశాల్లో బంగారానికి డిమాండ్ విపరీతంగా పెరగడంతో సింగపూర్ తీసుకున్న నిర్ణయానికి టైమింగ్ పర్ఫెక్ట్ గా కుదిరింది. ప్రస్తుతం సెంట్రల్ బ్యాంకులు రికార్డు స్థాయిలో బంగారాన్ని కొంటున్నాయి. ఈ కొనుగోళ్లు ఎక్కువగా ఆసియాలోనే జరుగుతున్నాయి. దానికి తోడు రాజకీయ స్థిరత్వం, బలమైన చట్టాలు, అత్యుత్తమ లాజిస్టిక్స్ సింగపూర్‌కు ప్లస్ పాయింట్స్ గా మారాయి. సెంట్రల్ బ్యాంకులు తమ ఆస్తుల భద్రత కోసం ఇలాంటి నమ్మకమైన ప్రదేశాలనే ఎంచుకుంటాయి.

ఒక ఆర్థిక కేంద్రాన్ని సృష్టించాలంటే కేవలం డిమాండ్ ఉంటే సరిపోదు బలమైన మౌలిక సదుపాయాలు కావాలి. ఇండియాలో ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్ ఏర్పాటు ఒక మంచి ముందడుగు అయినప్పటికీ గోల్డ్ హబ్ గా మారాలంటే ఎక్స్చేంజ్ చుట్టూ అన్ని సదుపాయాలను నిర్మించాలి. నెట్వర్క్ ఎఫెక్ట్స్‌తో ట్రేడర్లు, రిఫైనర్లు, ఇన్వెస్టర్లు ఎప్పుడైనా సరే లిక్విడిటీ ఉన్న చోటకే వస్తారు. సింగపూర్ ఇప్పటికే గెలిచిపోయిందని దీని అర్థం కాదు. కానీ గ్లోబల్ మార్కెట్లో బంగారం కలిగి ఉండటం కంటే ఆ బంగారం ప్రవహించే మౌలిక సదుపాయాలను సొంతం చేసుకోవడమే అసలైన అవకాశం అని సింగపూర్ నిరూపిస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే ఇండియా దగ్గర డిమాండ్ ఉంటే సింగపూర్ ఆ డిమాండ్ కు తగ్గ వ్యవస్థలను నిర్మించుకుంటోంది.