POK: ‘మా ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోండి..’ పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో కొత్త పోరాటం..!

How Pakistan Punjabised Pok

How Pakistan Punjabised Pok

Punjabisation Explained: పంజాబైజేషన్… ఈ పదం ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న కశ్మీర్ ప్రాంతంలో ఎక్కువగా వినిపిస్తున్న పదం ఇదే. అసలు ఒక ప్రాంతాన్ని తుపాకులతో ఆక్రమించడం ఒక లెవెల్ అయితే… ఆ ప్రాంతం భాషను మార్చడం, రాజకీయాలను కంట్రోల్ చేయడం, జనాభా స్వరూపాన్నే మార్చేయడం మరో లెవెల్. పాకిస్తాన్ ప్రపంచానికి దాన్ని ఆజాద్ కశ్మీర్ అని చూపిస్తుంది. పేరు వింటే ఫ్రీడమ్ గుర్తొస్తుంది. కానీ అక్కడ నిరసనలు చేస్తున్నవాళ్ల మాటలు ఇంకోరకంగా ఉన్నాయి. తమకు అసలు స్వేచ్ఛ లేదని అక్కడి ప్రజలు నిప్పులు కక్కుతున్నారు.

ఎందుకంటే కాగితాల మీద అది కశ్మీర్ అయినా… గ్రౌండ్ మీద మాత్రం పంజాబ్ ప్రభావం పెరుగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. ఇలా భాష నుంచి రాజకీయాల వరకు…ఉద్యోగాల నుంచి భూముల వరకు… ఎన్నికల నుంచి అధికార వ్యవస్థ వరకు… అన్నీ క్రమంగా స్థానికుల చేతుల నుంచి జారిపోతున్నాయని అక్కడి ఉద్యమకారులు చెబుతున్నారు. అందుకే ఇప్పుడు పీవోకేలో ఒక కొత్త డిబేట్ మొదలైంది. పాకిస్తాన్ కశ్మీర్‌ను కంట్రోల్ చేస్తోందా? లేదా క్రమంగా పంజాబ్ మోడల్‌లోకి మార్చేస్తోందా? అసలు పీవోకే వెనుక ఉన్న కథేంటి?

×
×
Ad

కరాచీ అగ్రిమెంట్‌ అంటే ఏంటి?

ఈ కథను అర్థం చేసుకోవాలంటే మనం 1949కి వెళ్లాలి. ఎందుకంటే పంజాబైజేషన్ కథ అక్కడే మొదలైంది. భారత్ విభజన తర్వాత కశ్మీర్ విషయంలో యుద్ధాలు, రాజకీయాలు, అంతర్జాతీయ చర్చలు నడుస్తున్న కాలం. అప్పుడే ఒక కీలక ఒప్పందం జరిగింది. అదే కరాచీ అగ్రిమెంట్.

పేరు వినడానికి సాధారణ ఒప్పందంలా అనిపించొచ్చు కానీ చాలా మంది విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం పీవోకే భవిష్యత్తును డిసైడ్ చేసిన మలుపు అదే. ఆ ఒప్పందం తర్వాత రక్షణ, విదేశాంగం, కశ్మీర్‌కు సంబంధించిన కీలక అధికారాలు అన్నీ ఇస్లామాబాద్ చేతుల్లోకి వెళ్లిపోయాయి. అంటే కశ్మీర్ గురించి కీలక నిర్ణయాలు కశ్మీర్‌లో కాకుండా బయట తీసుకోవడం మొదలైందన్న మాట.

అక్కడి నుంచి కథ నెమ్మదిగా మారడం మొదలైంది. ఒక విషయం ఇక్కడ క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. పీవోకేలో కేవలం కశ్మిరీలు మాత్రమే లేరు.. అక్కడ గుజ్జర్లు, రాజపుత్రులు, జాట్లు ఉన్నారు. పహారీ మాట్లాడే ప్రాంతాలు ఉన్నాయి. హింద్కో మాట్లాడే ప్రాంతాలూ ఉన్నాయి.

పీవోకేపై పాకిస్థాన్‌ పెత్తనం:

గిల్గిట్ బాల్టిస్తాన్‌లో అయితే వైవిధ్యం మరింత కనిపిస్తుంది. కాబట్టి పంజాబైజేషన్ అంటే కేవలం భాష మారిపోయిందని కాదండి.. అసలు డిబేట్ మొత్తం పవర్ గురించే. డిసిషన్స్ ఎవరు తీసుకుంటున్నారన్నదే ఇంపార్టెంట్. ఎన్నికల్లో గెలిచిన స్థానిక నాయకులు కాకుండా ఇస్లామాబాద్‌లో కూర్చున్న వ్యవస్థా పీవోకేపై పెత్తనం చెలాయిస్తోంది. ఇదే కారణంగా సంవత్సరాలు గడిచేకొద్దీ అసంతృప్తి పెరుగుతూ వచ్చింది. పీవోకేకు ప్రధాని, అధ్యక్షుడు ఉన్నారు. జెండా కూడా ఉంది. చూడటానికి అన్నీ ఉన్నట్టే కనిపిస్తాయి. కానీ అధికార కేంద్రాలే లేవు.

ఈ విమర్శ మరింత బలపడటానికి మరో కారణం జనాభా మార్పుల ఆరోపణలు. స్థానిక ఉద్యమకారుల వాదన ప్రకారం దశాబ్దాలుగా పాకిస్తాన్‌లోని ఇతర ప్రాంతాల నుంచి ముఖ్యంగా పంజాబ్ ప్రాంతం నుంచి వచ్చినవారి ప్రభావం పెరిగింది. వారంతా భూములు కొన్నారు. వ్యాపారాలు పెంచుకున్నారు. పరిపాలనలో కీలక స్థానాలు సంపాదించుకున్నారు. దీంతో స్థానికులు తమ ప్రాంతంలో తామే సైడ్ క్యారెక్టర్లుగా మారుతున్నామనే ఫీలింగ్‌లోకి వెళ్లిపోయారు.

ఈ అసంతృప్తి గిల్గిట్ బాల్టిస్తాన్‌లో మరింత గట్టిగా వినిపిస్తుంది. ఎందుకంటే అక్కడ మరో అంశం కూడా ఉంది. అది మత సమీకరణాలు. చారిత్రకంగా షియా జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కాలక్రమేణా పరిస్థితులు మారిపోయాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలా వలసలు పెరిగాయి. కొత్త శక్తి సమీకరణాలు వచ్చాయి. మత ఘర్షణలు కూడా పెరిగాయి. దీంతో స్థానిక గుర్తింపు క్రమంగా బలహీనపడుతోందనే వాదన బలపడింది. ఇక ఈ ఎపిసోడ్‌ 2025తర్వాత మరింత రక్తికట్టించింది. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ అనే సంస్థ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు ప్రారంభమయ్యాయి. మొదట ప్రజలు విద్యుత్ బిల్లుల గురించి మాట్లాడారు. ధరల పెరుగుదల గురించి మాట్లాడారు. కానీ కొద్దిరోజుల్లోనే అసలు కోపం బయటకు వచ్చింది.

మా ప్రాంతం గురించి నిర్ణయాలు మేమే తీసుకోవాలని ప్రజలు చెప్పడం మొదలుపెట్టారు. బయటివారి ప్రభావం తగ్గాలని డిమాండ్ చేశారు. రాజకీయ వ్యవస్థలో మార్పులు కోరారు. అక్కడి నుంచి పంజాబైజేషన్ అనే పదం మళ్లీ వార్తల్లోకి వచ్చింది. అది అక్కడి అసంతృప్తికి ఒక పేరుగా నిలిచిపోతోంది. ఇదండీ పంజాబైజేషన్ అసలు కథ.