Pakistan: ‘సింధు నాగరికత మాదే..బుద్ధుడు మా వాడే’.. పాకిస్థాన్ కొత్త నాటకం..

Harappa Civilisation Pakistan

Harappa Civilisation Pakistan

Explainer: సింధు నది… వేల ఏళ్ల చరిత్రకు సాక్షిగా నిలిచిన ఒక జలధార. ఈ నది ఒడ్డునే ప్రపంచంలోని అత్యంత పురాతన నాగరికతల్లో ఒకటైన హరప్పా నాగరికత వికసించింది. అయితే ఇప్పుడు ఈ నాగరికత పేరు మరోసారి వార్తల్లోకి నిలుస్తోంది. కారణం చరిత్ర కాదు… పురావస్తు తవ్వకాలు కూడా కాదు… భారత్, పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న జల వివాదం.

మొహెంజోదారోలో పురావస్తు పరిశోధనలు:

2025లో కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ సింధు జలాల ఒప్పందాన్ని అమలులో నిలిపివేసింది. సరిహద్దు దాటి ఉగ్రవాదం కొనసాగుతున్న పరిస్థితుల్లో పాత ఒప్పందాలు యథాతథంగా కొనసాగలేవని స్పష్టం చేసింది. ఆ నిర్ణయం తర్వాత ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం మరింత వేడెక్కింది. అదే సమయంలో పాకిస్థాన్‌లో మరో ఆసక్తికర పరిణామం కనిపించింది. దాదాపు ఆరు దశాబ్దాలుగా పెద్దగా తవ్వకాలు జరగని మొహెంజోదారోలో పురావస్తు పరిశోధనలు ప్రారంభమయ్యాయి. వేల ఏళ్ల నాటి ఆ నగరం ఒక్కసారిగా మళ్లీ చర్చల్లోకి వచ్చింది. చరిత్రకారులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ సంస్థలు అందరూ సింధు నాగరికత గురించే మాట్లాడటం మొదలుపెట్టారు.

పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చారు. మొహెంజోదారో, హరప్పా లాంటి నాగరికతలు తమ భూభాగంలో ఉన్నాయని, సింధు నాగరికతకు పాకిస్థానే నిజమైన సంరక్షకుడని ఆయన చెప్పుకొచ్చారు. భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడాన్ని కేవలం రాజకీయ నిర్ణయంగా కాకుండా, సింధు నాగరికత వారసత్వంపై దాడిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.

×
×
Ad

మరోవైపు పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ కూడా ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో సింధు నాగరికత, మెహర్‌గఢ్, గాంధార నాగరికతలను పాకిస్థాన్ చరిత్రలో కీలక భాగాలుగా ప్రస్తావించారు. వేల ఏళ్ల చరిత్ర కలిగిన నాగరికతల సెంట్రిక్‌గా పాకిస్థాన్‌ను అభివర్ణించారు.

తక్షశిలకు ప్రాధాన్యం:

నిజానికి దశాబ్దాల పాటు పాకిస్థాన్ అధికారిక చరిత్రలో ప్రధానంగా ఇస్లామిక్ యుగానికే ప్రాధాన్యం లభించింది. ఇప్పుడు మాత్రం తక్షశిల, గాంధార, మెహర్‌గఢ్, మొహెంజోదారో లాంటి ఇస్లాంకు పూర్వం ఉన్న నాగరికతలను జాతీయ గుర్తింపులో భాగంగా చూపించే ప్రయత్నం జరుగుతోంది. తక్షశిలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం, గాంధార బౌద్ధ వారసత్వాన్ని అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించడం, సింధు నాగరికతపై డాక్యుమెంటరీలు రూపొందించడం లాంటి కార్యక్రమాలు కూడా అదే దిశగా సాగుతున్నాయి. సింధు నది చుట్టూ నిర్మితమైన నాగరికతకు పాకిస్థానే సహజ వారసుడనే భావనను ప్రపంచానికి తెలియజేయాలన్న ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది.

అయితే ఈ వాదనను అందరూ అంగీకరించడం లేదు. ఎందుకంటే హరప్పా నాగరికత విస్తీర్ణంలో ఎక్కువ భాగం నేటి భారత భూభాగంలో కూడా ఉంది. అనేక పురావస్తు కేంద్రాలు రాజస్థాన్, హర్యానా, గుజరాత్ ప్రాంతాల్లో వెలుగుచూశాయి. అందుకే పలువురు పరిశోధకులు దీన్ని కేవలం సింధు లోయ నాగరికతగా కాకుండా సింధు-సరస్వతి నాగరికతగా కూడా చెబుతుంటారు.

అంతేకాదు, ఆధునిక ప్రపంచంలో జల హక్కులను చరిత్ర నిర్ణయించదు. వేల ఏళ్ల క్రితం ఎవరు, ఎక్కడ నివసించారనే విషయం కంటే, నేటి అవసరాలు, అంతర్జాతీయ ఒప్పందాలు, వాతావరణ మార్పులు, నీటి లభ్యత లాంటి అంశాలే కీలకం. అందుకే మొహెంజోదారో పేరును ఎంతగా ప్రస్తావించినా, హరప్పా నాగరికతను ఎంతగా గుర్తుచేసినా, సింధు జలాల భవిష్యత్తు మాత్రం చారిత్రక భావోద్వేగాల కంటే రాజకీయ నిర్ణయాలు, దౌత్య చర్చలు, ప్రస్తుత వాస్తవాల ఆధారంగానే నిర్ణయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇప్పుడు సింధు నది చుట్టూ జరుగుతున్న పోరాటం కేవలం నీటి కోసం మాత్రమే కాకుండా.. చరిత్ర కోసం, వారసత్వం కోసం, ప్రపంచం ముందు తమ కథనాన్ని బలంగా వినిపించుకోవడం కోసం కూడా. ఇలా ఒకవైపు వేల ఏళ్ల నాగరికత శిథిలాలు… మరోవైపు ఆధునిక భౌగోళిక రాజకీయాల మధ్య సింధు నది కథ మరోసారి కొత్త మలుపు తిరుగుతోంది.