Explainer: పాక్-అఫ్ఘాన్ సరిహద్దు వెంబడి మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. కొండల మధ్య ఒక్కసారిగా డ్రోన్ల గర్జన వినిపించింది. వరుస పేలుళ్లతో బలోచిస్తాన్, ఖైబర్ పఖ్తున్ ఖ్వా సరిహద్దు ప్రాంతాలు దద్దరిల్లిపోయాయి. పాకిస్తాన్ భూభాగంలోకి నేరుగా డ్రోన్లను పంపి ఐసీస్-K స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నామని తాలిబన్లు ప్రకటించారు. ఈ దాడిలో పలువురు ఐసిస్ ఉగ్రవాదులు హతమైనట్లు చెప్పారు. ఇంతకీ పాక్లోని ఐసీస్-K స్థావరాలను అఫ్ఘాన్ ఎందుకు లక్ష్యంగా చేసుకుంది? ఈ మంటలకు ఆజ్యం పోసింది ఎవరు?
అఫ్ఘాన్ రివెంజ్ ప్లాన్:
ఈ దాడులకు కేవలం రెండు రోజుల ముందే పాకిస్తాన్ అఫ్ఘానిస్తాన్ భూభాగంపై భారీ వైమానిక దాడులు చేసింది. సరిహద్దు వెంబడి ఉన్న ఉగ్రవాద స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నామని పాక్ ప్రకటించింది. అయితే ఆ దాడుల్లో మహిళలు, చిన్నారులతో పాటు పలువురు పౌరులు చనిపోయారు.
దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తత ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇప్పుడు పాక్ దాడులకు ప్రతిస్పందనగానే తాము ఐసీస్-K స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నామని తాలిబన్లు చెబుతున్నారు. అయితే అసలు ఇక్కడ చాలామందికి వచ్చే సందేహం ఒక్కటే. పాకిస్తాన్లో ఐసీస్-K స్థావరాలు ఎలా వచ్చాయి? ఈ సంస్థకు పాకిస్తాన్కు సంబంధం ఏంటి? దీన్ని అర్థం చేసుకోవాలంటే ఐసీస్-K చరిత్ర తెలుసుకోవాలి.
ISIS-K కథేంటి?
ఐసీస్-K అంటే ఇస్లామిక్ స్టేట్ ఖొరాసాన్. 2015లో ఏర్పడిన ఈ ఉగ్రసంస్థ అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్, మధ్య ఆసియా దేశాలను కలిపి ఖొరాసాన్ పేరుతో ఒక ఇస్లామిక్ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తోంది.
ఈ సంస్థ అప్పటి నుంచి అఫ్ఘానిస్తాన్తో పాటు పాకిస్తాన్ రెండింటిలోనూ రక్తపాతం సృష్టిస్తూ వస్తోంది. 2021లో అమెరికా సైన్యం అఫ్ఘానిస్తాన్ నుంచి వెళ్లిపోయి తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రపంచం ముందు తామే అసలైన పాలకులమని నిరూపించుకోవాలని తాలిబన్లు ప్రయత్నిస్తుంటే, వారిని బలహీనపర్చేందుకు ఐసీస్-K వరుస దాడులు చేసింది. కాబూల్ విమానాశ్రయం బాంబు పేలుడు నుంచి మసీదులు, పాఠశాలలు, మైనారిటీ వర్గాలపై జరిగిన అనేక దాడులకు ఈ సంస్థే బాధ్యత వహించింది. అందుకే ఇప్పుడు తాలిబన్లకు అతిపెద్ద శత్రువు ఐసీస్-Kగా మారింది.
మరోవైపు పాకిస్తాన్కు కూడా ఈ ఉగ్రసంస్థ తలనొప్పిగానే మారింది. ముఖ్యంగా అఫ్ఘాన్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న బలోచిస్తాన్, ఖైబర్ పఖ్తున్ ఖ్వా ప్రాంతాల్లో ఐసీస్-K తన కార్యకలాపాలను విస్తరించినట్లు భద్రతా సంస్థలు చెబుతున్నాయి. ఈ ప్రాంతాలను ఉపయోగించుకుని రెండు దేశాల్లోనూ దాడులకు ప్రయత్నిస్తోందని ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు తాలిబన్లు నేరుగా సరిహద్దు దాటి ఈ స్థావరాలపైనే దాడి చేసినట్లు ప్రకటించారు.
అయితే ఈ కథలో మరో కోణం కూడా ఉంది. పాకిస్తాన్ మాత్రం చాలా కాలంగా మరో ఉగ్రసంస్థ అయిన తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ అంటే TTPకి అఫ్ఘానిస్తాన్ ఆశ్రయం ఇస్తోందని ఆరోపిస్తోంది. ఆ సంస్థ పాకిస్తాన్ భూభాగంలో దాడులు చేసి మళ్లీ అఫ్ఘానిస్తాన్లోకి వెళ్లిపోతోందని చెబుతోంది. తాలిబన్లు మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తున్నారు. దీంతో పరస్పర అనుమానాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పుడు తాజా డ్రోన్ దాడులతో పరిస్థితి మరోసారి ప్రమాదకరంగా మారింది. రెండు దేశాలు తమ చర్యలను ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లుగానే చెబుతున్నా, సరిహద్దు దాటి దాడులు కొనసాగితే ఈ ఉద్రిక్తత మరింత పెరిగే అవకాశం ఉంది.
ఒకవైపు ఐసీస్-Kను నిర్మూలించాలన్న తాలిబన్ల ప్రయత్నం, మరోవైపు తమ భద్రతే ప్రధానమని చెబుతున్న పాకిస్తాన్ వైఖరి… ఈ రెండింటి మధ్య ఇప్పుడు మొత్తం ప్రాంత భద్రతే చిక్కుకుంది. రాబోయే రోజుల్లో ఈ ఘర్షణ మరింత విస్తరిస్తుందా… లేదా దౌత్య చర్చలతో చల్లారుతుందా అన్నది ఇప్పుడు ప్రపంచం గమనిస్తోంది.

