1998 జూన్…ఫ్రాన్స్లోని లియోన్ నగరం. ప్రపంచ ఫుట్బాల్ అభిమానులందరూ ఒక మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు. అది సాధారణ వరల్డ్కప్ మ్యాచ్ కాదు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఒకరిపై ఒకరు ఆంక్షలు, ఆరోపణలు, శత్రుత్వంతో జీవిస్తున్న రెండు దేశాలు ఒకే మైదానంలో ఎదురుపడబోతున్న రోజు. ఒకవైపు అమెరికా…మరోవైపు ఇరాన్…! ప్రపంచమంతా ఊపిరిబిగపట్టుకొని చూస్తోంది. కానీ ఆ రోజు గ్రౌండ్లో జరిగిన సీన్ మాత్రం చరిత్రలో నిలిచిపోయింది. ఇరాన్ ఆటగాళ్లు చేతుల్లో తెల్లని గులాబీలు పట్టుకుని గ్రౌండ్లోకి అడుగుపెట్టారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆ పూలను అమెరికా ఆటగాళ్లకు అందించారు.
ఆ తర్వాత రెండు జట్లు కలిసి ఫొటో దిగాయి. నవ్వుకున్నాయి. షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నాయి. రాజకీయ నాయకులు, దౌత్యవేత్తలు, ప్రభుత్వాలు సాధించలేనిది 22 మంది ఫుట్బాల్ ఆటగాళ్లు సాధించారు. సీన్ కట్ చేస్తే 28 సంవత్సరాల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు 2026 ఫిఫా వరల్డ్కప్ అమెరికాలో జరుగుతోంది. ఇదే టోర్నీలో అమెరికాతో పాటు ఇరాన్ కూడా పాల్గొంటోంది. కానీ ఈసారి కథ వేరేలా ఉంది. ఒకప్పుడు గులాబీలు ఇచ్చిన దేశం… ఇప్పుడు యుద్ధపు పొగల మధ్య వరల్డ్కప్కు వచ్చింది.
ఇరాన్పై ఈ ప్రపంచకప్ ప్రభావం ఎలా పడింది?
ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ఈ వరల్డ్కప్పై కూడా ప్రభావం చూపిస్తున్నాయి. ఆటగాళ్ల వీసాల విషయంలో అనిశ్చితి నెలకొంది. జట్టు అధికారుల్లో కొందరికి ఎంట్రీ నిరాకరించారు. అభిమానుల టికెట్లపై వివాదం చెలరేగింది. అంతేకాదు…అమెరికాలో ఏర్పాటు చేసుకున్న తమ బేస్ క్యాంప్ను కూడా ఇరాన్ మార్చుకోవాల్సి వచ్చింది. అరిజోనాలో కాకుండా మెక్సికోలోని టిజువానాలో శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసుకుంది.
ఒక ఫుట్బాల్ జట్టు ప్రయాణం ఇలా రాజకీయ వార్తగా మారడం అరుదుగా జరుగుతుంది. అయితే ఈ కథను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మళ్లీ 1998కి వెళ్లాల్సిందే. అప్పట్లో ఇరాన్ అధ్యక్షుడు మొహమ్మద్ ఖాతామీ అమెరికాతో సంబంధాలను మెరుగుపరచాలని ప్రయత్నించారు. రెండు దేశాల మధ్య సంభాషణలు ప్రారంభమయ్యే సూచనలు కనిపించాయి. అదే సమయంలో వరల్డ్కప్ డ్రాలో అమెరికా, ఇరాన్ ఒకే గ్రూపులో పడిపోయాయి. అలా ఒక ఫుట్బాల్ మ్యాచ్ అకస్మాత్తుగా ప్రపంచ రాజకీయాల కేంద్రంగా మారింది. ఇరాన్ జట్టు కూడా ఆ టోర్నీకి అర్హత సాధించడానికి అద్భుతమే చేసింది. ఆస్ట్రేలియాతో జరిగిన ప్లేఆఫ్ మ్యాచ్లో దాదాపు ఓటమి అంచుల వరకు వెళ్లి తిరిగి వచ్చి వరల్డ్కప్ బెర్త్ సాధించింది.
ఆ విజయం తర్వాత టెహ్రాన్ వీధులు సంబరాల్లో మునిగిపోయాయి. కానీ అసలు చరిత్ర మాత్రం లియోన్లోనే ప్రత్యక్షమైంది. ప్రపంచం ఉద్రిక్తతను ఊహించింది కానీ మైదానంలో గులాబీలు కనిపించాయి. ప్రపంచం శత్రుత్వాన్ని ఆశించింది కానీ ఆటగాళ్లు స్నేహానికి ప్రతీకగా నిలిచారు. ఆ మ్యాచ్లో ఇరాన్ 2-1 తేడాతో అమెరికాను ఓడించింది. కానీ స్కోర్ కంటే ఎక్కువగా గుర్తుండిపోయింది ఆ తెల్లని గులాబీలే.
ఎందుకంటే అవి ఒక ఆశకు ప్రతీక. రెండు దేశాలు ఎప్పటికైనా దగ్గరవుతాయనే ఆశ. కానీ ఆ ఆశ ఎక్కువ కాలం నిలవలేదు. తర్వాతి సంవత్సరాల్లో ఆంక్షలు వచ్చాయి. అణు వివాదాలు వచ్చాయి. మధ్యప్రాచ్య ఘర్షణలు వచ్చాయి. సంబంధాలు మళ్లీ కఠినంగా మారాయి. ఇప్పుడు 2026 వరల్డ్కప్లో ఇరాన్ మరోసారి ప్రపంచ వేదికపై అడుగుపెట్టింది కానీ ఈసారి వారి చేతుల్లో గులాబీలు లేవు. అయితే రాజకీయాలు దేశాలను విడదీసినా… ఫుట్బాల్ మరోసారి వాటిని కలపగలదా? 1998లో లియోన్ మైదానం ఆ ప్రశ్నకు ఒక అందమైన సమాధానం ఇచ్చింది. మరి 2026 వరల్డ్కప్… దానికి మరో సమాధానం ఇవ్వబోతోందా? లేదా గులాబీల స్థానాన్ని పూర్తిగా ఘర్షణలు ఆక్రమించేస్తాయా? దీనికి సమాధానం రానున్న రోజుల్లో తెలిసిపోతుంది.

