Vizag: పరిచయస్తులే యమకింకరులు.. సాగర తీరంలో వరుస హత్యల వెనుక మిస్టరీ ఇదేనా?

  • సాగర తీరంలో వరుస హత్యలు
  • బెంబేలెత్తిపోతున్న వైజాగ్ వాసులు
  • సెన్సేషన్‌గా విశాఖ హత్యలు
Vizag

Vizag

ముక్కుమోహం తెలియని వాళ్లు మన మీద దాడి చేస్తే భయపడతాం.. అదే పరిచయస్తులే దాడి చేసి ప్రాణాలు తీస్తే అమ్మో… ఊహించుకుంటునే భయంగా ఉంటుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి ఎదురవుతుంది. కొంత మంది పరిచయస్తులు.. డబ్బు కోసం, నగల కోసం ఎంతకైనా దిగిజారి ప్రవర్తిస్తున్నారు. ఇలాగే విశాఖ సాగర తీరంలో జరిగిన వరుస హత్యలు మహిళలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మృత్యువు ఎప్పుడు ఏ విధంగా వస్తుందోనన్న భయం అనుక్షణం వేధిస్తోంది. అసలు విశాఖలో ఏం జరుగుతోంది?

ఆర్ధిక అవసరాలు, అనవసరపు పరిచయాలు ఎప్పటికైనా ప్రమాదమేనని ఈ ఘటనలు చూస్తే తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా వరుస ఘటనలు విశాఖలో సెన్సేషన్‌గా మారాయి. ఎవరూ ఊహించని రీతిలో హత్యకు పాల్పడుతున్నది అంతా కూడా మృతులకు పరిచయస్తులు, తెలిసిన వారే కావడం.. వారి చేతుల్లోనే నిండు ప్రాణాలను కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. మహిళల గురించి, వారి ఆర్ధిక స్థోమతలు, వైవాహిక జీవితాలు, వారి ఇంటి పరిస్థితులు గురించి బాగా తెలిసిన వారే అదనుచూసి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. డబ్బు, బంగారం కోసం కిరాతకులుగా మారుతున్నారు.

కొద్ది నెలల క్రితం ఆరిలోవలోని దుర్గానగర్‌కు చెందిన కాపు లక్ష్మి అనే మహిళకు రాంగ్‌ ఫోన్‌ కాల్‌తో పరిచయమైన విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన వ్యక్తి ఈ ఏడాది ఫిబ్రవరి 11న ఆమె ఇంటికి వెళ్లాడు. చీటీలు నిర్వహించే లక్ష్మి ఇంట్లో ఒంటరిగా ఉండడంతో తనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నందున కొంత డబ్బు ఇవ్వాలని కోరాడు. ఆమె తాను ఇవ్వనని చెప్పేసరికి విచక్షణ కోల్పోయి లక్ష్మిని గొంతు నులిమి హత్యచేశాడు. అక్కడితో ఆగకుండా వచ్చిన పని గుర్తుకొచ్చి అనంతరం ఆమె శరీరంపై ఉన్న బంగారం, ఇంట్లోని నగదుని అపహరించుకుపోయాడు.

మార్చి 30న నేవీలో ఉద్యోగం చేస్తున్న చింతాడ రవీంద్ర తనకు డేటింగ్‌ యాప్‌లో పరిచయమైన కైలాసపురానికి చెందిన మౌనికను హత్య చేసి శరీరాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. కొన్ని శరీర భాగాలను ఫ్రిజ్‌లో పెట్టి మరికొన్నింటిని నగర శివారుల్లో కాల్చేశాడు.

ఈ ఘటన మరువక ముందే మే13న అక్కయ్యపాలెం శ్రీనివాస నగర్‌కు చెందిన పార్వతిని ఆమెకు చెందిన దుకాణాన్ని అద్దెకు తీసుకున్న వ్యక్తి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో హత్య చేసి బంగారంతో పరారైపోయాడు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా మే 19న భీమిలికి చెందిన కొయ్య ప్రవీణ్‌ తనకు పరిచయస్తురాలైన కొమ్మాది వైఎస్‌ఆర్‌ కాలనీకి చెందిన వివాహితను కాపులుప్పాడలోని ఒక లేవుట్‌లోకి తీసుకువెళ్లి వైరుతో గొంతునులిమి ఊపిరాడకుండా చేశాడు. మరణించిందని భావించి ఆమెను తుప్పల్లో పడేసి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. మరుసటిరోజు మార్నింగ్‌ వాక్‌కు వెళ్లిన గ్రేహౌండ్స్‌ పోలీసులు తుప్పల్లో కొన ఊపిరితో ఉన్న వివాహితను గుర్తించి భీమిలి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆమెను ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం కోలుకుంటోంది. బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలం మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఏప్రిల్‌ 15న జోడుగుళ్లపాలేనికి చెందిన జెస్సీ అనే యువతి తన స్నేహితుడి పుట్టినరోజు వేడుకల కోసం విశాలాక్షి నగర్‌లోని ఒక లాడ్జికి వెళ్లింది. అక్కడ స్నేహితులంతా మూకుమ్మడిగా ఆమెపై దాడి చేసి గాయపరచడంతో మనస్తాపానికి గురై అదే లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడింది.

ఈ విధంగా ఒకదాని తర్వాత మరోకటి.. ఒకటికి మించి మరొకటి ఘటనలు జరిగాయి. నగరంలో ఒంటరి మహిళలపై జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తెలిసిన వ్యక్తులే దారుణాలకు తెగబడుతుండడంతో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. మహిళలు ఇంట్లో ఒంటరిగా ఉన్నపుడు తెలిసిన వ్యక్తులు వచ్చినాసరే ఇంట్లోకి అనుమతించకుండా జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. ఇంట్లో విధిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం, నగదు, విలువైన ఆభరణాలను ఉంచుకోకుండా బ్యాంక్‌ లాకర్లలో భద్రపరుచుకోవడం చేయాలని సూచిస్తున్నారు.. ఎవరైనా అనుమానితులుగా అనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.