Cyber Fraud in Tirupati: తక్కువ పెట్టుబడి- ఎక్కువ లాభం ఎర.. ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో రూ.33 లక్షలు చోరీ

  • ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో రూ. 33.25 లక్షల భారీ సైబర్ క్రైమ్..
  • తిరుపతి రూరల్ (మం) పుదిపట్లలో ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగిని ఫిర్యాదు..
  • UHNWIs యాప్ ఇన్‌స్టాల్ చేయించి, ప్రీ-ఐపీఓ, ట్రేడింగ్ పేరుతో డబ్బులు బదిలీ..
  • తెలియని యాప్‌లు, లింకులు నమ్మొద్దని పోలీసుల హెచ్చరిక..
Cyber

Cyber

Cyber Fraud in Tirupati: తిరుపతి జిల్లాలో భారీ సైబర్ క్రైమ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్ ట్రేడింగ్, ప్రీ-ఐపీఓ పెట్టుబడుల పేరుతో ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగిని నుంచి రూ.33.25 లక్షలు కాజేసిన ఘటన కలకలం రేపుతోంది. తిరుపతి రూరల్ మండలం పుదిపట్లకు చెందిన ఉద్యోగిని తాను సైబర్ మోసానికి గురయ్యానంటూ తిరుపతి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ ద్వారా సంప్రదించి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మబలికారు.. అనంతరం UHNWIs పేరుతో ఉన్న యాప్‌ను నా ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయించినట్లు తెలిపారు.

Read Also: Shashi Tharoor: సచిన్ లాంటి ‘వైభవం’ ఉన్న సూర్యవంశీ.. సెలెక్టర్లు ఇంకా దేని కోసం ఎదురు చూస్తున్నారు?

అయితే, యాప్‌లో మొదట ట్రేడింగ్ లాభాలను అధికంగా చూపించి, బాధితురాలికి నమ్మకం కలిగించారు. ఆ తర్వాత ప్రీ–ఐపీఓ పెట్టుబడుల పేరుతో విడతలుగా బ్యాంక్ ఖాతాల ద్వారా డబ్బులు బదిలీ చేయించుకున్నారు. లాభాలు వస్తున్నాయన్న భ్రమలో బాధితురాలు మొత్తం రూ.33.25 లక్షలు బదిలీ చేసినట్టు ఫిర్యాదులో తెలియజేసింది. డబ్బులు బదిలీ చేసిన తర్వాత, లాభాలు ఉపసంహరించుకోవాలంటే ముందుగా 20 శాతం కమిషన్, అలాగే అదనపు ప్రాసెసింగ్ చార్జీలు చెల్లించాలని సైబర్ నేరగాళ్లు డిమాండ్ చేశారు. మరింత డబ్బు పంపాలంటూ ఒత్తిడి తీసుకొచ్చారు. అనుమానం వచ్చి బాధితురాలు ప్రశ్నించగా.. ఫోన్ నంబర్లు, యాప్ సపోర్ట్ ఛానళ్ల నుంచి స్పందన రాలేదు.. దీంతో మోసం జరిగినట్టు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read Also: Shambhala Movie Review: శంబాల మూవీ రివ్యూ..ఆది సాయి కుమార్ హిట్ కొట్టాడా?

ఇక, ఫిర్యాదు అందుకున్న తిరుపతి సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. మోసానికి ఉపయోగించిన బ్యాంక్ ఖాతాలు, ఆన్‌లైన్ లింకులు, డిజిటల్ ట్రాన్సాక్షన్ల వివరాలను సేకరిస్తున్నారు. ఆయా ఖాతాల వెనుక ఉన్న వ్యక్తులు, నెట్‌వర్క్‌పై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. అయితే, తెలియని యాప్‌లు, అపరిచిత లింకులు ఇన్‌స్టాల్ చేయొద్దని సూచించారు. ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో అధిక లాభాల హామీలు నమ్మొద్దు.. డబ్బు పంపే ముందు ఖచ్చితమైన ధృవీకరణ చేసుకోవాలి. ఇలాంటి సైబర్ మోసాల పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.