Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!

  • కాపురాల్లో చిచ్చు పెడుతున్న కలహాలు
  • బైక్ కొనివ్వలేదనే కారణంతో కిరాతకుడిగా మారిన భర్త
  • సంగారెడ్డి జిల్లా మారేపల్లిలో ఘటన
Suicide Murders

Suicide Murders

Suicide Murders: మద్యం మత్తు, క్షణికావేశం, అదనపు కట్నం కోసం వేధింపులు.. ఇలా కారణమేదైనా సరే పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి. కుటుంబ కలహాలు.. భార్యనో లేదా భర్తనో లేదా.. ఒక్కోసారి ఇద్దరిని కూడా బలి తీసుకుంటున్నాయి. ఇప్పుడు అలాంటి ఘటనలే రెండు వేర్వేరుగా తెలంగాణలో జరిగాయి. సంగారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తి.. అదనపు కట్నం కోసం భార్యను చంపేసి.. తాను కూడా సూసైడ్ చేసుకున్నాడు. మరోవైపు సిరిసిల్ల జిల్లాలోనూ ఓ వ్యక్తి కుటుంబ కలహాల కారణంగా భార్యను చంపేసి బలవన్మరణం చెందాడు.

కారణం ఏదైనా సరే.. దంపతుల పచ్చని సంసారంలో అగ్ని గుండం రేగుతోంది. ఈ క్రమంలో భర్తనో లేదా భార్యనో.. కిరాతకులుగా మారుతున్నారు. తమ కాపురాన్ని తామే చేజేతులా కూల్చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో సంగారెడ్డి జిల్లాలో అత్తింటివారు బైక్ కొనివ్వలేదనే చిన్న కారణంతో ఒక భర్త కిరాతకుడిగా మారాడు. కట్టుకున్న భార్యను గదిలోనే ఉరేసి దారుణంగా హతమార్చాడు. ఆ తర్వాత పోలీసు కేసు అవుతుందనే భయంతో.. తానూ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలం మారేపల్లిలో వెలుగుచూసింది. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లోనూ తీవ్ర విషాదం నెలకొంది.

×
×
Ad

కొండాపూర్ మండలం మారేపల్లికి చెందిన దాసరి అంజయ్యకు, నారాయణఖేడ్ మండలం సంజీవ్‌రావుపేటకు చెందిన యాదమ్మతో 11 నెలల క్రితం వివాహమైంది. వివాహం జరిగిన కొన్ని రోజుల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. అంజయ్య తన భార్య, తల్లి, సోదరుడితో కలిసి మారేపల్లి శివారులోని ఒక మామిడితోటను కౌలుకు తీసుకున్నాడు. ఆ తోటలోనే ఒక చిన్న తాత్కాలిక నివాసాన్ని ఏర్పాటు చేసుకుని తోటలో కాసే మామిడి పండ్లను విక్రయిస్తూ ఆ కుటుంబం జీవనం సాగిస్తోంది.

అంజయ్య కాలక్రమేణా మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులో రోజూ భార్య యాదమ్మతో గొడవపడటం అలవాటుగా మార్చుకున్నాడు. తనకు ద్విచక్ర వాహనం కొనివ్వలేదని.. బైక్ తెస్తేనే నిన్ను సరిగ్గా చూసుకుంటానని తరచూ భార్యను వేధింపులకు గురిచేసేవాడు. ఈ క్రమంలోనే అంజయ్య తల్లి మామిడి పండ్లను విక్రయించేందుకు సమీపంలోని సదాశివపేట పట్టణానికి వెళ్లారు. ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఆ సమయంలో మరోసారి ద్విచక్రవాహనం కొనిచ్చే విషయంపై ఇద్దరి మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది. యాదమ్మ సమాధానంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన అంజయ్య.. ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసి గదిలోకి తీసుకెళ్లి ఆమె చున్నీతోనే మెడకు ఉరేసి దారుణంగా హత్య చేశాడు.

యాదమ్మ ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని గమనించిన అంజయ్య పోలీసు కేసు అవుతుందని, జైలుకు వెళ్లాల్సి వస్తుందని తీవ్ర ఆందోళన, భయానికి గురయ్యాడు. దీంతో తప్పు చేసినట్లు గ్రహించిన అంజయ్య.. భార్య శవం ఉన్న గది నుంచి బయటకు వచ్చి ఘటనా స్థలానికి కొద్ది దూరంలోనే ఉన్న ఒక మామిడి చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వచ్చేసరికి ఇద్దరూ శవాలై పడి ఉండటాన్ని చూసి షాక్ అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను పరిశీలించి, క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించారు. యాదమ్మ తండ్రి సాయిలు తన కూతురిని అల్లుడు అంజయ్యే బైక్ కోసం వేధించి చంపేసాడని పోలీసులకు ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదు మేరకు కొండాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.

మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ ఇలాంటి తరహా విషాద ఘటనే జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను హత్య చేసిన భర్త.. అనంతరం తాను కూడా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తంగళ్లపల్లి మండలం మండపల్లి గ్రామంలో కలకలం రేపింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మహమ్మద్ షరీఫోద్దీన్ తన భార్య షాహిన్‌ను హత్య చేసి అనంతరం తాను కూడా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించి కేసు నమోదు చేశారు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు వెల్లడించారు. మహమ్మద్ షరీఫోద్దీన్ స్థానిక హోటల్‌లో పనిచేస్తుండగా.. అతని భార్య షాహిన్ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నట్లు తెలిసింది. జిల్లెళ్ల ప్రాంతానికి చెందిన ఈ దంపతులు సుమారు 40 సంవత్సరాల క్రితం మండపల్లి గ్రామానికి వలస వచ్చి అక్కడే నివాసం ఉంటున్నారు. గత నాలుగేళ్లుగా గ్రామంలోని ఓ పెంకుటింట్లో అద్దెకు జీవనం సాగిస్తున్నారు.