Suryapet Job Scam: ఉద్యోగాలు ఇప్పిస్తామని భారీగా నగదు వసూళ్లు చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు పోలీసులు. నాకు ఉన్నతస్థాయిలో పరిచయాలు ఉన్నాయని బదిలీలు చేయిస్తానని.. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి బాధితులను నిందితుడు మోసం చేసి నగదు వసూళ్లు చేసినట్లు పోలీసులు గుర్తించారు. జల్సాలకు అలవాటుపడిన నిందితుడు. బాధితుల వద్ద నుంచి వసూలు చేసిన డబ్బుతో విలాసవంతమైన జీవితం గడిపినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇంతకీ ఎవరా కంత్రీగాడు? బాధితుల్ని ఎలా వలలో వేశాడు?
READ MORE: Cyber Crime Cases: స్మార్ట్ ఫోన్తో జాగ్రత సుమా..! అమ్మాయిలకు హైదరాబాద్ పోలీసుల కీలక సూచనలు..
ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు వసూలు చేసి మోసం చేసిన వ్యక్తిని సూర్యాపేట వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం రెడ్డిగూడెం గ్రామానికి చెందిన దుగ్యాల రఘురామ్.. ప్రస్తుతం హైదరాబాదులో నివాసం ఉంటున్నాడు. హైదరాబాద్లోని పలు ప్రాంతాలలో ప్లేగ్రౌండ్లను లీజుకు తీసుకొని వాటి ద్వారా జీవనోపాధి పొందుతున్నాడు.. పోలీసుల కథనం ప్రకారం.. కొన్ని నెలల క్రితం సూర్యాపేటలోని జమ్మిగడ్డకు చెందిన నాగమణి అనే స్టాఫ్ నర్స్ను హైదరాబాద్లోని డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయం వద్ద కలిశాడు రఘురామ్. ఆ సమయంలో నాగమణితో పరిచయం పెంచుకొని మాట్లాడాడు. తనతో పాటు హైదరాబాద్లోని డీఎంఈ కార్యాలయంలో సూపరిండెంట్గా పనిచేస్తున్న వాణికి చాలా మంది ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయని పని ఏమిటో చెప్తే చేయిస్తానని స్టాఫ్ నర్స్ నాగమణిని నమ్మించాడు. హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు బదిలీ కావాలని నాగమణి కోరింది. అందుకోసం 20 లక్షలు ఖర్చు అవుతుందని రఘురాం స్పష్టం చేయగా.. రఘురామ్, వాణితో పని అవుతుందని నమ్మిన స్టాఫ్ నర్స్ నాగమణి ఆ డబ్బులు రఘురాంకు ఇచ్చింది.
READ MORE: Theft Gangs: సినీ స్టైల్ చోరీలు.. పోలీసులకు సవాల్ విసురుతున్న ముఠాలు..
నాగమణి ప్రభుత్వ ఉద్యోగం రాకముందు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ నర్సింగ్ కళాశాలలో పనిచేసింది. స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తకి ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో హైదరాబాద్కు చెందిన వాణితో కలిసి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు ఇప్పిస్తానని… ఎవరైనా పరిచయం ఉంటే చెప్పాలని నాగమణిని రఘురాం కోరాడు. దీంతో గతంలో తాను పనిచేసిన కళాశాలకు చెందిన కొందరికి రఘురాం విషయాన్ని నాగమణి చెప్పింది. దీంతో రఘురామ్, వాణి ఇద్దరు కలిసి సూర్యాపేట జిల్లాతో పాటు వివిధ జిల్లాలకు చెందిన సుమారు 60 మంది నిరుద్యోగులను కలిసి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి నిరుద్యోగులను బురిడీ కొట్టించారు. ఒక్కొక్కరి నుంచి 3 నుంచి 5 లక్షల వరకు వసూలు చేశారు. ఈ విధంగా మొత్తం రూ. కోటి 85 లక్షలు వసూలు చేశారు. అయితే ఇటీవల వచ్చిన ఫలితాల్లో రఘురామ్కు డబ్బులు ఇచ్చిన వారికి ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులు రఘురాంను తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల కోసం డబ్బులు ఇచ్చిన వారికి ఉద్యోగాలు రాకపోవడం, స్టాఫ్ నర్స్ నాగమణికి సూర్యాపేటకు బదిలీ కాకపోవడంతో రఘురాం, వాణిపై అనుమానం వచ్చి వారి గురించి వివరాలు సేకరించారు బాధితులు. దీంతో రఘురాం తనను మోసం చేశాడని బాధితురాలు నాగమణి గుర్తించింది. గతనెల 18న బాధితులు సూర్యాపేట పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలు నాగమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సూర్యాపేట పోలీసులు.. ధర్యాప్తు ప్రారంభించి నిందితుడు రఘురాంను పట్టుకునేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే రఘురాం తన స్వగ్రామం రెడ్డిగూడెంలో ఉండగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసినట్లు అంగీకరించినట్లు సమాచారం. నిరుద్యోగుల నుంచి వసూలు చేసిన డబ్బుతో జల్సాగా తిరుగుతూ విలాస జీవితం గడిపినట్లు పోలీసులు గుర్తించారు. రూ.30 లక్షల విలువైన ఒక స్థలం, ఒక కారును రఘురామ్ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు అతని వద్ద నుంచి నకిలీ నియామక పత్రాలను, పలు చెక్కులను, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
