సూర్యాపేట జిల్లాలో రాజకీయ కక్షలు మరోసారి పురుడు పోసుకున్నాయి. 2007లో జరిగిన ఓ పొలిటికల్ మర్డర్కు ప్రతీకారంగా మధు అనే BRS నాయకుడి హత్య జరిగింది. హత్యకు ఐదేళ్లుగా కాపు కాసిన నిందితులు… ఆరుసార్లు హత్య చేయడానికి ప్రయత్నించి విఫలమైనట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈసారి సమయం కోసం కాకుండా… పక్కాగా ప్లాన్ చేసి మర్డర్ చేసి.. పోలీసులకు చిక్కారు నిందితులు.
యస్.. మీరు విన్నది కరెక్టే.. ఇటీవల సూర్యాపేటలో బీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధు హత్య ప్రతీకారంలో భాగంగానే జరిగినట్లు జిల్లా పోలీసులు నిర్ధారించారు. నిందితులు ఐదేళ్లు కాపు కాసి… హత్యకు ఆరుసార్లు ప్రయత్నం చేసే విఫలమై చివరకు పక్కా ప్లాన్ తో హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. సూర్యాపేట మండలం యార్కారం గ్రామానికి చెందిన BRS నాయకుడు చింతలపాటి మధు మే 22న దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్యలో మొత్తం ఆరుగురు నిందితులు పాల్గొనగా.. ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. నిందితుల నుంచి మటన్ కొట్టే కత్తి, కారు, బైక్, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
యర్కారం సర్పంచ్ మిద్దె రవీందర్ 2007లో హత్యకు గురయ్యాడు. ఈ కేసులో చింతలపాటి మధు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. దీంతో రవీందర్ కుమారుడు జీవన్.. మధుపై కక్ష పెంచుకున్నాడు. ఇటీవల కోర్టు మధుపై ఉన్న కేసును కొట్టేసింది. ఈ నేపథ్యంలోనే మధును హత్య చేయాలని మిద్దె రవీందర్ కొడుకు జీవన్ పక్కా ప్లాన్ చేశాడు. ఐదేళ్ల క్రితమే మధు హత్యకు జీవన్ డిసైడ్ అయ్యాడు. మిద్దె రవీందర్ హత్య జరిగినప్పుడు అతని కొడుకు జీవన్ వయసు 8 సంవత్సరాలు. ఎప్పటికైనా మధును హత్య చేయాలని నిర్ణయించుకున్న జీవన్.. కొన్ని సంవత్సరాల క్రితం తన స్నేహితులైన సైదులు, ప్రసాద్లను మధుతో స్నేహం చేసేందుకు పంపించాడు. సైదులు, ప్రసాద్ ఇద్దరు మధుతో స్నేహం చేస్తూ అతనికి అత్యంత నమ్మకస్తులుగా మారిపోయారు.
ఈ ఐదేళ్లలో మధు హత్య చేసేందుకు పలుసార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు జీవన్. ఒకసారి కారుతో యాక్సిడెంట్ చేయించి హత్య చేయాలనుకున్నాడు.. అది విఫలమైంది. మరోసారి నిమికల్లో ఓ పంచాయతీలో మధు హత్యకు ప్లాన్ చేసినా అది వర్కౌట్ కాలేదు. దీంతో సమయం కోసం వేచి ఉన్న జీవన్.. మధు కదలికలపై నిరంతరం నిఘా పెట్టాడు. మధు ఎప్పుడు, ఎక్కడికి, ఎలా వెళ్తున్నాడు? ఎవరితో ఉంటున్నాడు? ఏ సమయంలో ఒంటరిగా దొరుకుతాడు? అనే వివరాలను తన మనుషులు సైదులు, ప్రసాద్ ద్వారా తెలుసుకొని పక్కాగా ప్లాన్ చేశాడు.
ప్లాన్లో భాగంగానే మధుకు సైదులు, ప్రసాద్ లు రెగ్యులర్గా దావతులు ఏర్పాటు చేస్తున్నారు. దావత్లో వివిధ రకాల మాంసం, మద్యం ఏర్పాటు చేస్తున్నారు. జీవన్ చెప్పినట్లుగా రోజు ఇదే పద్ధతిలో విందు ఏర్పాటు చేసి మధు పిలుస్తున్నారు సైదులు, ప్రసాద్. దీంతో ప్రసాద్, సైదులు ఇద్దరిపై మధుకు అత్యంత నమ్మకం ఏర్పడింది. ఇక మర్డర్ ప్లాన్ అమలకు తెర లేపారు నిందితులు. ప్లాన్ ప్రకారం మే 22న మధును దావత్ ఉందని సైదులు, ప్రసాద్ తాళ్లగడ్డలోని ఓ ఇంటికి పిలిపించారు. రాగానే చేపల కూర, మద్యం ఇవ్వడంతో.. కొద్దిసేపటికే మధు మత్తులోకి వెళ్లిపోయాడు. జీవన్కు సమాచారం ఇవ్వడంతో ఆనంద్ అనే వ్యక్తితో కలిసి ఆ ఇంటికి వచ్చాడు. జీవన్ రాగానే సైదులు మటన్ కత్తితో మధుపై దాడికి పాల్పడగా.. ఆ తర్వాత.. జీవన్ విచక్షణ రహితంగా మధును కత్తితో పొడిచి హత్య చేశాడు. తీవ్ర గాయాలతో మధు ఆ ఇంట్లోనే చనిపోయాడు.
అనంతరం డెడ్ బాడీ రక్తం బయటికి కనిపించకుండా మూడు గోనె సంచులు కలిపి ఒకే గోనెసంచిగా చేశారు. అందులో మధు మృతదేహాన్ని కట్టి కారులో తీసుకెళ్లి ఏర్కారం శివారులో కల్వర్టు కింద పడేశారు. 2007లో చనిపోయిన మిద్దె రవీందర్ చనిపోయినచోట డెడ్ బాడీని వేయాలని భావించినా.. జనసంచారం ఉండడంతో ప్లాన్ మార్చి… కల్వర్టు కింద పడేసి నిందితులు పరారయ్యారు. హత్యకు ఉపయోగించిన కత్తి, సెల్ ఫోన్లను ఆదివేంల సమీపంలోని కాలువలో పడేశారు. మధు హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడైన జీవన్తో పాటు చింతా సైదులు, ప్రసాద్, ఆనంద్, భరత్ చంద్ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలుగా ఉన్న చింత సైదులు భార్య భవాని పరారీలో ఉన్నారు. మొత్తంగా ఈ కేసును ఛేదించిన పోలీసులు..ప్రతీకారంలో భాగంగానే హత్య చేసినట్లు నిర్ధారించారు.
