Sister Executed Brother In Jharkhand After Her Objected Her Boyfriend: అతడు సొంత తమ్ముడు.. రక్తం పంచుకుని పుట్టాడు.. తమ్ముడంటే ఆమెకు ఎంతో ఇష్టం కూడా! కానీ.. ఒక్క విషయంలో అభ్యంతరం తెలిపినందుకు ఆమె అతనిపై కోపం పెంచుకుంది. ప్రియుడితో తిరగొద్దని నిలదీసినందుకు చంపేసింది. ఈ దారుణ ఘటన జార్ఖండ్లోని రామ్ గఢ్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. రామ్ గఢ్ జిల్లాకు చెందిన చంచల కుమారి (25) ఓ థర్మల్ పవర్ స్టేషన్లో పని చేస్తోంది. ఆ పవర్ స్టేషన్కు సంబంధించిన క్వార్టర్స్లోనే నివసిస్తోంది. ఆమెకు 21 ఏళ్ల రోహిత్ కుమార్ అనే సోదరుడు ఉన్నాడు. కొంతకాలం క్రితం చంచలకు సోను అన్సారీ అనే వ్యక్తితో పరిచయం అయ్యింది. అది ప్రేమగా మారడంలో.. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరగడం ప్రారంభించాడు. అతడు ఆమె క్వార్టర్స్కి తరచూ వచ్చి వెళ్తుండేవాడు.
ఈ విషయం సోదరుడు రోహిత్ కుమార్కి తెలిసింది. ఆ వ్యక్తి ఎవరని ఆరా తీయగా.. తన ప్రియుడని, అతని పేరు సోను అన్సారీ అని తెలిపింది. అయితే.. ఆ వ్యక్తి తమ కులం వాడు కాకపోవడంతో, ఈ సంబంధాన్ని రోహిత్ వ్యతిరేకించడం మొదలుపెట్టాడు. అతనితో కలిసి తిరగొద్దని వారించాడు. లేదంటే తాను విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పేస్తానని బెదిరించాడు. దీంతో.. సోదరుడిపై ఆమె పగ పెంచుకుంది. తన ప్రేమకు అడ్డొస్తున్నాడని, శాశ్వతంగా అడ్డు తొలగించుకునేందుకు పన్నాగం పన్నింది. తన ప్రియుడితో కలిసి హతమార్చేందుకు స్కెచ్ వేసింది. ప్లాన్ ప్రకారం.. ఒక రోజు చంచల తన సోదరుడ్ని క్వార్టర్స్లోని ఓ రహస్య ప్రాంతానికి పిలిచింది. అక్క పిలుపు మేరకు రోహిత్ వెళ్లాడు. ఆల్రెడీ అక్కడ మాటు వేసిన సోను అన్సారీ.. రోహిత్ రాగానే అతనిపై దాడి చేశాడు. చంచల, సోను కలిసి అతడ్ని చంపేశారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా.. క్వార్టర్స్లోనే మృతదేహాన్ని దాచారు. అనంతరం ఏమీ ఎరుగనట్టుగా చంచల ఇంటికి వెళ్లింది.
తమ కుమారుడు ఇంటికి తిరిగి రాకపోవడం, ఎక్కడా జాడ కనిపించకపోవడంతో.. రోహిత్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే చంచల కుమారి క్వార్టర్స్లో రోహిత్ మృతదేహం లభించింది. దీంతో చంచలపై అనుమానం రావడంతో.. ఆమెను గట్టిగా నిలదీశారు. అప్పుడు తన ప్రియుడో సోనుతో కలిసి తానే తమ్ముడ్ని చంపేశానని, తమ ప్రేమకు అడ్డుగా ఉన్నందుకే ఈ ఘాతుకానికి పాల్పడ్డానని తెలిపింది. పోలీసులు చంచల, సోనుని అరెస్ట్ చేసి.. దర్యాప్తు చేపట్టారు.
