TDP Leader Murder Case: అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం ముదినేనివడ్డెపల్లెలో ఈ నెల 2వ తేదీన జరిగిన తెలుగుదేశం పార్టీ నేత తిరుపతి వారాధి (77) హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్య జరిగిన రోజు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి ఆ ఘటనపై ఆరా తీశారు. నిందితులను వెంటనే గుర్తించి అరెస్టు చేయాలి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పోలీసులను ఆదేశించారు. దీంతో, పోలీసులు ఎట్టకేలకు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. సంబేపల్లి మండలం దుద్యాల గ్రామానికి చెందిన తిరుపతి వారాధి (77) కొన్నేళ్ల క్రితం ముదినేనివడ్డెపల్లె కు వచ్చి స్థిరపడ్డారు.
Read Also: Lift Accident: మరో పసిప్రాణాన్ని బలిగొన్న లిఫ్ట్.. నాలుగున్నరేళ్ల చిన్నారి మృతి
అయితే, గ్రామంలో ప్రజలకు అవసరమైన పనులు చేసి పెడుతూ వస్తుండేవారు. ఇటీవల ఉపాధి హామీ పథకం కింద 5 లక్షల పనులు చేయించేందుకు కాంట్రాక్టు పనులు దక్కించుకున్నారు. రహదారి నిర్మాణానికి మరో 49 లక్షల విలువైన పని వచ్చిందని స్థానికులకు చెప్పారు. దీంతో అదే గ్రామానికి చెందిన మదనపల్లి చిన్నికృష్ణ, బంగారువాండ్లపల్లెకు చెందిన యోగానందరెడ్డి అలియాస్ ఆనంద్ రెడ్డిలు కాంట్రాక్టు పనుల కోసం పోటీ పడడమే కాకుండా ఎక్కడ నుంచో వచ్చి తమ గ్రామంలో పెత్తనం చెలాయిస్తున్నాడని వారు తిరుపతి వారాధి పై ద్వేషం పెంచుకున్నారు. ఈ నెల 2వ తేదీన మల్లూరమ్మ గుడి వద్ద వేప చెట్టు కింద తిరుపతి వారాధి నిద్రిస్తుండగా చిన్నికృష్ణ, ఆనంద రెడ్డిలు కలిసి బండరాయితో కొట్టి చంపినట్లు తమ విచారణలో తేలిందని రాయచోటి రూరల్ సీఐ వరప్రసాద్, ఎస్ఐ భక్తవత్సలం వివరించారు. హత్య కేసులోని ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు వెల్లడించారు.
