Lockup Death: ఏపీలో లాకప్‌ డెత్‌లు పరంపర.. రెండు జిల్లాల్లో ప్రకంపనలు

Nellore

Nellore

ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల పనితీరుపై రోజు రోజుకు వివాదాలు రేగుతున్నాయి. ఒక చోట కస్టోడియల్ టార్చర్ ఆరోపణలు.. మరోచోట లాకప్ డెత్ అభియోగాలు.. ఇంకో చోట నిందితులకు సహకరిస్తున్నారన్న విమర్శలు.. ఇలా పోలీసులు పలు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అదే వరుసలో నెల్లూరు జిల్లా, పల్నాడు జిల్లా పోలీసులు అపఖ్యాతి మూటగట్టుకున్నారు. ఇంతకీ ఈ రెండు జిల్లాల్లో ఏం జరిగింది? వాటిపై పోలీసులు ఏం చెబుతున్నారు?

సాయి కృష్ణ లాకప్ డెత్ వ్యవహారం మరువక ముందే నెల్లూరు జిల్లాలో అలాంటి ఘటనే జరిగింది. చోరీ కేసులో పోలీస్ స్టేషన్‌‌కి తీసుకొచ్చిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. విచారణ జరిపి పంపిన తర్వాత అతను పురుగు ముందు తాగాడని పోలీసులు చెబుతున్నారు. మృతుని బంధువులు మాత్రం లాకప్ డెత్ చేశారంటూ ఆరోపిస్తున్నారు.

మనుబోలు మండలం చెరుకు మూడిలో జరిగిన చోరీ కేసులో అక్కంపేటకు చెందిన ఇద్దరి నిందితులతో పాటు చెరుకుముడికి చెందిన ఏడుకొండల్ని పోలీసులు జులై 12న స్టేషన్‌కు తీసుకొచ్చారు.. విచారించి నోటీసులు ఇచ్చారు. అయితే జులై14న మధ్యాహ్నం ఏడుకొండలు గడ్డి ముందు తాగి అపస్మారక స్థితిలో ఉండగా తాము ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని మనుబోలు పోలీసులు చెబుతున్నారు. ఏడుకొండల్ని 5 రోజుల క్రితం పోలీసులు తీసుకోచ్చి చిత్రహింసలు పెట్టి కొట్టారని.. దెబ్బలు తట్టుకోలేక అతను చనిపోయాడంటూ మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వాయిస్: మనుబోలు ఎస్సై హనీప్‌తో పాటు పొదలకూరు ఎస్సై రాకేష్.. కానిస్టేబుల్ మాధవ్ చిత్రహింసలు పెట్టి చంపేశారని.. వారిపై చర్యలు తీసుకోవాలని భాదితులు డిమాండ్ చేస్తున్నారు.

లాకప్ డెత్ ఆరోపణలపై నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత స్పందించారు. మనుబోలు పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ అని వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. మనుబోలులో బంగారం దొంగతనం కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశామని.. అందులో ఏడుకొండలు ఒకరన్నారు. విచారించి జులై 12న ముగ్గురికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించామన్నారు. జులై12న హైవేలో.. జులై 13న ఉదయం పొదలకూరు వైన్ షాప్ వద్ద ఏడుకొండలు కనిపించినట్లు సీసీ కెమెరాల్లో ఉందన్నారు. కుటుంబ సభ్యులు ఆరోపించినట్లు లాకప్ డెత్ అనేది జరగలేదని.. జులై14న ఏడుకొండలు ఆత్మహత్యకి పాల్పడ్డట్లు గుర్తించామని స్పష్టం చేశారు.

మరోవైపు పల్నాడు జిల్లా పిడుగురాళ్లలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. పోలీసుల వేధింపులు భరించలేక దరియా హుస్సేన్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టించింది. సివిల్ పంచాయితీ వ్యవహారంలో రోజూ స్టేషన్‌కు పిలిపించి వేధిస్తున్నారంటూ మృతుడు దరియా హుస్సేన్ సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. తన ఇంటి విషయం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ ఇల్లు ఖాళీ చేయాలని లేదంటే కేసు పెడతామని వేధించారని సూసైడ్ లెటర్‌లో ఆరోపించాడు. సీఐ వెంకట్రావు, ఎస్సై నాగరాజు, ఏఎస్సై హనుమంతరావు ఇబ్బంది పెడుతున్నారని మనశ్సాంతి లేక పుట్టినరోజునే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో దరియా హుస్సేన్ పేర్కొన్నాడు. మొత్తంగా ఏపీలోని పలు జిల్లాల్లో పోలీసుల వ్యవహారం రోజు రోజుకు వివాదాస్పదమవుతోంది.