TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్‌కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?

Tcs Case

Tcs Case

TCS Nashik Case: నాసిక్ టీసీఎస్ మతమార్పిడి కేసులో కొత్త పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. నిందితురాలుగా ఉన్న నిదా ఖాన్ ఇటీవలే పట్టుబడింది. కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఆమె పరారీలో ఉంది. రెండు రోజుల క్రితం ఛత్రపతి సంభాజీనగర్‌లో ఒక ఇంట్లో పట్టుబడింది. ఆమె ఆచూకీ తెలియకుండా ఉండేందుకు స్థానిక ఎంఐఎం కార్పొరేటర్ మతీన్ పటేల్ సహకరించినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఆమెకు ఆశ్రయం ఇచ్చిన ఇళ్లు మతీన్ పటేల్‌కు చెందినదని ముందుగా వార్తలు వచ్చాయి. కానీ విచారణ తర్వాత దాని యజమానులు హనీఫ్ ఖాన్, సయ్యద్ సర్వార్ అని తేలింది. వీరిద్దరు ఆ ఇంటిని రూ. 23 లక్షలకు కొనుగోలు చేశారు.

Read Also: Kerala CM: కేరళ కాంగ్రెస్‌లో వర్గపోరు.. సీఎంగా ఆయనకే రాహుల్ మద్దతు..

నిదా ఖాన్ ఇక్కడే ఉంటుందని తమకు ఏ మాత్రం తెలియదని ఇంటి యజమానులు వాదిస్తున్నారు. కొన్ని రోజుల పాటు తన ఇంట్లో అతిథులు ఉంటారని మతీన్ పటేల్ చెప్పాడని, అందుకే ఇంటిని అద్దెకు ఇచ్చినట్లు చెబుతున్నారు. నిదా ఖాన్‌కు ఈ ఇళ్లు ఆశ్రయం ఇవ్వడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మున్సిపల్ కార్పొరేషన్ ఈ ఇంటికి నోటీసులు జారీ చేసింది. ఛత్రపతి సంభాజీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆ ఇంటిని అక్రమమని ప్రకటించి, మూడు రోజుల్లోగా కూల్చివేయాలని నోటీసు జారీ చేసింది. ఈ ఇంటి నిర్మాణం అక్రమమని అధికారులు చెబుతున్నారు.

ఈ కేసులో నిదా ఖాన్ కీలకంగా వ్యవహరించినట్లు తెలిసింది. డానిష్ అనే ఉద్యోగి తనకు వివాహం అయిందనే విషయాన్ని దాచిపెట్టి ఒక యువతితో స్నేహం చేశాడు. ఆ సమయంలో ఇస్లాం మతంలోకి మారాలని ఆమెపై ఒత్తిడి వచ్చింది. నిదా ఖాన్ బాధితురాలికి మాయమాటలు చెప్పి, మతపరమైన ఆచారాలు పాటించేలా బలవంతం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. మతపరమైన యాప్‌లు మొబైల్‌లో డౌన్లోడ్ చేసి, హిజాబ్ ధరించడం, కల్మా పఠించడం వంటికి నేర్పించింది. ఆమె పేరును ‘‘హనియా’’ మార్చింది. ఈ మొత్తం నెట్వర్క్‌కు అంతర్జాతీయ సంబంధాలు ఉన్నాయని ప్రభుత్వ ప్రాసిక్యూటర్ అజయ్ మిసర్ కోర్టుకు తెలిపారు. ఈ కేసులో నిదా ఖాన్‌కు సహకరించిన మతీన్ పటేల్‌న సహ నిందితుడిగా తేల్చారు. కోర్టు నిదాఖాన్ ను మే 11 వరకు పోలీస్ కస్టడీకి అప్పగించింది.