Principal Murder: మిస్టరీగా ప్రిన్సిపల్ హత్య.. ఇంట్లో ఏం జరిగింది!

Bealert

Bealert

ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్ దారుణ హత్య నల్లగొండ జిల్లాలో సంచలనంగా మారింది. విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన ప్రిన్సిపల్ రూపారెడ్డిని దుండగులు విచక్షణారహితంగా పొడిచి దారుణంగా హత్య చేశారు. పక్కా ప్లాన్‌తో ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్‌ను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు గల కారణాలపై దర్యాప్తులో స్పష్టత రాకపోవడంతో.. నిందితుల జాడ ఇంకా తెలియరాలేదు.

నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలోని ప్రైవేట్ స్కూల్ నిర్వహిస్తున్న మహిళ రూపారెడ్డి దారుణ హత్యకు గురైంది. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండగా దుండగులు హత్య చేశారు. కొండమల్లేపల్లిలోని జేబీ కాలనీలో ఆగస్ట్ 12 ఉదయం రూపారెడ్డి హత్యకు గురైన విషయం బయటపడింది.

ఓ సీఐ, ఇద్దరు ఎస్ఐలు నివాసం ఉండే కాలనీలో ఓ మహిళ దారుణ హత్యకు గురి కావడం చర్చనీయాంశంగా మారింది. రూపారెడ్డి కొన్ని సంవత్సరాలుగా కొండమల్లేపల్లిలోని నాగార్జున గ్రామర్ స్కూల్ నిర్వహిస్తూ ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తున్నారు. ఆమె భర్త రాజేందర్రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వీరు జేపీ కాలనీలోని సొంత ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరికి హైదరాబాద్ శివారులోని గుర్రంగూడాలో కూడా సొంత ఇల్లు ఉంది. కుమారుడు అభినవ్ రెడ్డి హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. సెలవులు వచ్చినప్పుడు హైదరాబాద్‌కు వెళ్లి కుమారుడితోపాటే రూపారెడ్డి దంపతులు హైదరాబాద్‌లో ఉంటారు. ఈ క్రమంలోనే శని, ఆది, సొమవారం వరసగా మూడు రోజులు సెలవులు రావడంతో… రూపారెడ్డి భర్తతో కలిసి హైదరాబాద్ లోని తన కుమారుడి వద్దకు వెళ్లారు. తిరిగి మంగళవారం ఉదయం కొండమల్లేపల్లి కి రూపారెడ్డి ఒక్కరే రాగా ఆమె భర్త రాజేందర్రెడ్డి పని ఉందని హైదరాబాద్‌లోనే ఉండిపోయాడు.

ఎప్పటి లాగే మంగళవారం ఉదయం స్కూల్ కి వెళ్లిన రూపారెడ్డి సాయంత్రానికి తిరిగి కొండేమల్లేపల్లిలోని జేబీ కాలనీలో ఉన్న తన ఇంటికి వచ్చింది. బుధవారం ఉదయం రూపారెడ్డికి ఆమె భర్త రాజేందర్ రెడ్డి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె లిఫ్ట్ చేయకపోవడంతో… తమ ఇంటి పై అద్దెకు ఉంటున్న వారికి ఫోన్ చేసి ఒక్కసారి ఇంట్లో చూడమని రాజేందర్ రెడ్డి కోరాడు. అద్దెకు ఉంటున్న వారు వెళ్లి ఇంటి తలుపులు ఎన్నిసార్లు తట్టినా రూపారెడ్డి తలుపు తీయకపోవడంతో.. ఇంటి పక్కన ఉన్న వారిని కూడా పిలిచి తలుపులు తెరిపించే ప్రయత్నం చేశారు. కానీ రూపారెడ్డి డోర్ తెరవలేదు. వెనక ఉన్న కిచెన్ వద్దకు వెళ్లి చూడగా తలుపులు తెరిచి ఉండటం.. లోపలికి వెళ్లి చూడగా రూపారెడ్డి రక్తపు మడుగులో విగత జీవిగా కనిపించడంతో వెంటనే రూపారెడ్డి భర్తకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు స్దానికులు.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్‌తో పాటు డాగ్ స్క్వాడ్‌తో హత్య జరిగిన ప్రవేశంలో ఆధారాలు పరిశీలించారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రూపారెడ్డి ఒంటిపైన 27 వరకు కత్తిపోట్లు ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్ట్‌లో తేలింది. రూపారెడ్డిని కచ్చితంగా హత్య చేయాలనే పక్కా ప్లాన్‌తో రెక్కీ చేసి మరీ హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చారు. రూపారెడ్డి స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన కొద్దిసేపటి తర్వాత అంటే సాయంత్రం 7గంటల లోపే రూపారెడ్డి దారుణ హత్యకు గురై ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.

నిందితుడు ఇంటి వెనకాల నుంచి ఇంట్లోకి ప్రవేశించి.. కిచెన్ రూమ్ గుండా ఇంట్లోకి ప్రవేశించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇంటి ముందు సీసీ కెమెరాలు ఉండటంతో నిందితుడు ఇంటి వెనక బాగం నుంచి లోపలికి ప్రవేశించినట్లు పోలీసులు భావిస్తున్నారు. రూపారెడ్డి ఇంటికి చేరుకోవడానికి కూడా నిందితుడు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ కెమెరాలలో తన దృశ్యాలు రికార్డు కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని.. ఆమె ఇంటి వద్దకు చేరుకొని.. రూపారెడ్డిని దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు అభిప్రాయానికి వచ్చారు. హత్య జరిగిన తరువాతే రూపారెడ్డి సెల్ ఫొన్ స్విచ్చాఫ్ అయ్యిందని… రూపారెడ్డిని దారుణంగా హత్య చేసిన తరువాత ఆమె సెల్ ఫోన్‌ను హంతకుడు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. హంతకుడు హత్యకు ఉపయోగించిన కత్తి కూడా షార్ప్ వెపన్‌గా అనుమానిస్తున్నారు. కత్తిని కూడా నేరస్తుడు తన వెంట తీసుకుని వెళ్లి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు రూపా రెడ్డిని ఇంత దారుణంగా హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఎందుకు ఉంది..? హత్యకు గల కారణాలు ఏంటి? అనే కొణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

దగ్గరి బంధువులను, స్నేహితులను, రూపారెడ్డి నిర్వహిస్తున్న స్కూల్ స్టాఫ్‌ను, స్థానికులను పోలీసులు విచారిస్తున్నారు. ఆర్దిక లావాదేవీలపైనా, వ్యాపార వివాదాలపైనా పోలీసులు దృష్టి సారించారు. హత్య జరిగిన ప్రాంత సెల్‌ఫోన్ టవర్ డంప్‌ను కూడా పోలీసులు క్షుణ్ణంగా విశ్లేషిస్తున్నారు. కొండమల్లేపల్లిలోని అన్ని రూట్‌లలో ఉన్న సీసీ ఫుటేజ్‌లను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. కొందరు అనుమానాస్పద వ్యక్తుల కదలికలను, వాహనాల మూమెంట్స్‌ను గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. మొత్తంగా రూపారెడ్డి హత్య పక్కాగా ప్లాన్ చేసి రెక్కీ నిర్వహించి దారుణంగా హత్య చేశారని పోలీసులు భావిస్తున్నారు. హత్యకు పక్కా కారణం ఉంటుందని భావిస్తున్న పోలీసులు.. ఆ కారణం ఎంటో తేలితే నిందితులను గుర్తించడం పెద్ద సమస్య కాదని చెబుతున్నారు. మొత్తంగా రూపారెడ్డి హత్య కేసు సంచలనంగా మారగా.. నిందితులు ఎవరు? అనుమానితుల జాడపై స్పష్టత రాకపోవడంతో పోలీసులకు ఈ కేసు సవాల్‌గా మారింది.