హైదరాబాద్ ఐటీ కారిడార్ పరిధిలోని మాదాపూర్లో సాగుతున్న ఒక వీకెండ్ డ్రగ్స్ పార్టీని మాదాపూర్ ఎస్ఓటీ (SOT) పోలీసులు అత్యంత చాకచక్యంగా దాడి చేసి భగ్నం చేశారు. మాదాపూర్ పరిధిలోని చంద్రనాయక్ తండాలో గల ‘MBS భాగ్యలక్ష్మి అపార్ట్మెంట్స్’ లోని ఒక ఫ్లాట్లో కొందరు యువకులు డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్నారనే నమ్మకమైన సమాచారంతో పోలీసులు శనివారం అర్ధరాత్రి ఈ దాడులు నిర్వహించారు. వీకెండ్ కావడంతో ఈ డ్రగ్స్ పార్టీ కోసం ప్రత్యేకంగా విజయవాడ నుండి కొందరు యువకులు హైదరాబాద్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ దాడిలో పార్టీ ఆర్గనైజర్ అయిన దనేకుల తరుణ్ తేజతో పాటు మొత్తం తొమ్మిది మంది యువకులను పోలీసులు అక్కడికక్కడే పట్టుకున్నారు.
బెజవాడ కనెక్షన్.. రూ. లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం
పోలీసుల ప్రాథమిక విచారణలో విజయవాడకు చెందిన కార్తీక్, పృథ్వి అనే వ్యక్తులు ఈ డ్రగ్స్ నెట్వర్క్ను నడుపుతున్నట్లు తేలింది. వీరిద్దరూ దనేకుల తరుణ్ తేజ ద్వారా హైదరాబాద్లో యువతకు డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ దాడిలో నిందితుల నుండి ₹ లక్షల విలువైన 15 గ్రాముల ఎండీఎంఏ (MDMA), 382 గ్రాముల ఓజీ కుష్ గంజాయి , 9 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ప్రధాన ఆర్గనైజర్ తరుణ్ తేజను పోలీసులు అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న విజయవాడకు చెందిన కార్తీక్, పృథ్విల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులపై ఎన్డీపీఎస్ (NDPS) యాక్ట్ కింద కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు, ఈ ముఠాకు ఇంకా ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు.

