విద్యాబుద్ధులు నేర్పి సమాజంలో ఉన్నత స్థానంలో నిలబెట్టాల్సిన ఒక విశ్వవిద్యాలయ ప్రొఫెసర్.. విద్యార్థిని పట్ల కీచకుడిగా మారిన వైనం లక్నో యూనివర్సిటీలో తీవ్ర కలకలం రేపింది. పరీక్షా పత్రాలను లీక్ చేస్తాననే నెపంతో, ఒక బీఎస్సీ విద్యార్థినిని లైంగికంగా లొంగదీసుకోవడానికి ప్రయత్నించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బాధితురాలు ధైర్యంగా ప్రొఫెసర్ బాగోతాన్ని ఆడియో రికార్డింగుల రూపంలో బయటపెట్టడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
ఘోరానికి ఒడిగట్టిన ప్రొఫెసర్..
లక్నో యూనివర్సిటీ జువాలజీ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ పరంజిత్ సింగ్, ఒక విద్యార్థినిని మానసికంగా, లైంగికంగా వేధించాడు. “నీ కోసం రెండు క్వశ్చన్ పేపర్లు తెచ్చాను, నన్ను కలవడానికి ఎప్పుడు వస్తావు?” అంటూ సదరు ప్రొఫెసర్ ఫోన్ లో వేధించడం ఆ ఆడియోలో స్పష్టమైంది. దానికి ఆ విద్యార్థిని “నేను సిలబస్ అంతా చదివేసాను సర్.. అవి నాకు అనవసరం లేదు” అని చెప్పినా వినకుండా, పరీక్షలకు వారం రోజుల ముందే తనను ఒంటరిగా కలవాలని సదరు ప్రొఫెసర్ తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. గతంలో కూడా తనను లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడని, కేవలం తనను శారీరకంగా వేధించడానికే ప్రొఫెసర్ పిలుస్తున్నాడని ఆ విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేసింది.
ధైర్యం చేసిన బాధితురాలు ఆడియో క్లిప్లను యూనివర్సిటీ అధికారులకు సమర్పించడంతో, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రొఫెసర్ పరంజిత్ సింగ్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే వర్సిటీ అంతర్గత రాజకీయాల వల్లే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ప్రొఫెసర్ బుకాయించాడు.
మరోవైపు ఈ ఘటనపై అఖిల భారత విద్యార్థి పరిషత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడిపై కఠిన చట్టాల కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ క్యాంపస్లో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది. స్పందించిన వైస్ ఛాన్సలర్ జేపీ సైనీ.. అంతర్గత కమిటీని ఏర్పాటు చేసి 24 గంటల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. సంస్థ ప్రతిష్టను దెబ్బతీసే ఇలాంటి చర్యలను ఎంతమాత్రం సహించేది లేదని వర్సిటీ స్పష్టం చేసింది.
