హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొహెడ గ్రామంలో గుండెల్ని పిండేసే విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మోసం చేయడమే కాకుండా, తన కన్న బిడ్డను కూడా అమ్మేసిందని తెలియడంతో మనస్తాపానికి గురైన గోవర్ధన్ అనే యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మంగళవారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కొహెడ గ్రామానికి చెందిన గోవర్ధన్, సరిత గౌడ్ అనే యువతిని నాలుగేళ్ల క్రితం ఇంట్లో వారికి తెలియకుండా ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక బాబు కూడా పుట్టాడు. అయితే, కొంతకాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సరిత గౌడ్ తన బాబును మరొకరికి అమ్మేసిందని, తాను మరొకరిని వివాహం చేసుకున్నానని గోవర్ధన్కు సమాచారం ఇచ్చింది. కన్నబిడ్డ దూరం కావడం, భార్య మోసం చేయడంతో తీవ్ర మనస్థాపానికి గురైన గోవర్ధన్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
గోవర్ధన్ ఆత్మహత్య చేసుకునే ముందు తన సెల్ ఫోన్లో భార్య చేసిన మోసాలకు సంబంధించి అన్ని వీడియో రికార్డులను, ఫొటోలను , సూసైడ్ నోట్ను భద్రపరిచాడు. ఈ ఆధారాలన్నీ పోలీసుల వద్ద ఉన్నప్పటికీ, నిందితురాలు సరిత గౌడ్ను ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడంపై బాధితుని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన కొడుకు ప్రాణం పోయిందని, కనీసం తన మనవడైనా ఎక్కడున్నాడో వెతికి తమకు అప్పగించాలని గోవర్ధన్ తల్లి మీడియా ముందు కన్నీరుమున్నీరుగా విలపించింది.
ఈ కేసుపై హయత్ నగర్ సీఐ నాగరాజు గౌడ్ స్పందిస్తూ.. సంఘటనా స్థలం నుండి గోవర్ధన్ మొబైల్ ఫోన్, అందులోని రికార్డింగ్స్ , సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని, దీనిపై న్యాయపరమైన సలహాలు (Legal Opinion) తీసుకున్న తర్వాత నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సరిత గౌడ్ ఎక్కడ ఉందనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు. నిండు నూరేళ్ల జీవితాన్ని భార్య మోసం కారణంగా అర్ధాంతరంగా ముగించుకున్న గోవర్ధన్ మృతితో కొహెడ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నారి బాబు ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
