Tragedy: గురుగ్రామ్‌లో విషాదం.. సివిల్ ఇంజినీర్ నిర్లక్ష్యం లా విద్యార్థి ప్రాణం తీసింది

  • దాబా దగ్గర వేచిచూస్తుండగా దుర్ఘటన
  • నిద్రమత్తులో డ్రైవింగ్ చేసిన సివిల్ ఇంజినీర్ అరెస్ట్
  • సీసీటీవీ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు
Accident

Accident

Tragedy: ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్‌లో ఓ దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. ఒక సివిల్ ఇంజినీర్‌ నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా న్యాయ విద్యార్థి ప్రాణం కోల్పోయాడు. లీగల్ స్టూడెంట్ హర్ష్‌ తన స్నేహితుడు మోక్ష్‌తో కలిసి జూన్‌ 24న తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఢిల్లీ-జైపూర్ హైవే వద్ద ఉన్న చంచల్‌ దాబాకు వెళ్లాడు. అప్పటికే దాబా కిక్కిరిసిపోయిన కారణంగా వారు బయటే వేచి ఉండగా, మరో స్నేహితుడు అభిషేక్‌ కూడా అక్కడికి చేరాడు. ముగ్గురూ సర్వీస్ రోడ్‌ వద్ద రేలింగ్‌ పక్కన నిలబడి మాట్లాడుకుంటుండగా, ఓ కారు వేగంగా వచ్చి వారిని ఢీకొట్టి అక్కడి నుంచి పరుగులు తీసింది.

Chennai Drugs Case : డ్రగ్స్ కేసులో పంజా సినిమా దర్శకుడి తమ్ముడుకి రిమాండ్

ఈ ప్రమాదంలో హర్ష్‌తో పాటు అభిషేక్‌కు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. ఇద్దరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించినా, హర్ష్‌ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటన జరిగినప్పటికీ కారు ఆగకుండా పారిపోయింది. అయితే దానికి ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న స్థానికులు వెంటపడగా, కొద్ది దూరంలో ఆ కారు రోడ్డు పక్కన నిలిపివేయబడి కనిపించింది. అయితే అందులో ఎవ్వరూ లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి, కారు నంబర్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. అతడిని 31 ఏళ్ల మోహిత్‌గా గుర్తించారు. అతడు సివిల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడని, విధులు ముగించుకుని తిరిగే సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. అదే సమయంలో మోహిత్‌ నిద్రమత్తులో వాహనం నడుపుతున్నట్లు విచారణలో ఒప్పుకున్నాడు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. నిర్లక్ష్యంగా ప్రవర్తించి ఓ యువకుడి ప్రాణం తీసిన మోహిత్‌పై సంబంధిత చట్టాల ప్రకారం కేసులు నమోదు చేశారు.

Puri Rath Yatra 2025: నేడే పూరీ జగన్నాథుని రథయాత్ర.. భారీగా భద్రతా ఏర్పాట్లు..