Jagtial Crime: జగిత్యాల జిల్లాలో ఒకే రోజు రెండు దారుణాలు జరిగాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యలపై వారి భర్తలు అఘాయిత్యాలకు తెగబడ్డారు. ఒకడు ఏకంగా యువతిని అత్యంత దారుణంగా కత్తితో నరికి నరికి చంపేశాడు. కనీసం గర్భిణీ అనే కనికరం కూడా లేకుండా విచక్షణ మర్చిపోయి ప్రవర్తించాడు. మరో ఘటనలో యువకుడు.. భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అదృష్టవశాత్తూ ఆమె ప్రాణాలతో బయటపడింది. కానీ ఈ రెండు కేసుల్లో ఒకరు అదనపు కట్నం కోసం వేధిస్తుండగా.. మరో వ్యక్తి భార్యపై అనుమానంతో అఘాయిత్యానికి పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి.
READ ALSO: Kuppam Murder Case: ఒక్క ఫోన్ కాల్.. తోటలో శవంగా యువకుడు! కుప్పంలో కలకలం..
ఆ యువతి పేరు వైష్ణవి. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ స్వస్థలం. ఈమె ఓ యూట్యూబర్. ఇప్పుడిప్పుడే తనకంటూ సోషల్ మీడియాలో ఓ గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇదే క్రమంలో కోరుట్లకి చెందిన హరిబాబుతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత.. అది కాస్తా ప్రేమగా మారడంతో.. తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లిచేసుకున్నారు. కానీ ఈ పెళ్లికి హరిబాబు తల్లిదండ్రులు ససేమిరా అన్నారు. ఐనప్పటికీ వివాహం చేసుకుని వేరే కాపురం పెట్టారు దంపతులు. ఇద్దరు కలిసి ‘Vaishu Amma’ అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. వారి ఛానెల్కు ఇప్పటికే 48 వేల మందికి పైగా సబ్ స్ర్కైబర్లు ఉన్నారు. ఓ వైపు.. ఛానెల్.. మరోవైపు వైవాహిక జీవితం.. అంతా బాగానే సాగిపోతోంది అనుకున్న సమయంలో.. హరిబాబు ఇంట్లో ఆస్తి తగాదాలు జరిగాయి. అదే క్రమంలో హరిబాబు కూడా వైష్ణవిని కట్నం కోసం వేధించడం షురూ చేశాడు. దీంతో వారిద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. అలా జరిగిన గొడవలు పెరిగి పెద్దవిగా మారాయి. ఆ సమయంలో కోపంతో ఊగిపోయిన హరిబాబు.. వైష్ణవిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. కనీసం 5 నెలల గర్భిణీ అని కూడా చూడకుండా.. కత్తితో దాడి చేయడం కలకలం రేపింది. మరోవైపు నిందితుడు హరిబాబు నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు.
హత్య ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ వైష్ణవి కుటుంబ సభ్యులు.. నిందితుడికి ఉరిశిక్ష విధించాలని పోలీస్ స్టేషన్ ముందు నినాదాలు చేశారు. లేదంటే హరిబాబును తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అటు హరిబాబు, వైష్ణవి మధ్య.. అబార్షన్ కోసం గొడవ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. పోలీస్ స్టేషన్లో నిందితుడు హరిబాబు నోరు విప్పితే అసలు విషయాలు బయటపడతాయంటున్నారు పోలీసులు.
జగిత్యాల జిల్లాలోనే మరో దారుణం జరిగింది. ధర్మపురిలో.. ప్రేమించి పెళ్లి చేసుకున్నోడే కాలయముడై భార్యపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ధర్మపురికి చెందిన నవీన్.. రమ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నవీన్..ఇంట్లో ఒప్పుకోకపోవడంతో.. రమ్య ఇంటి వద్దే వచ్చి ఉంటున్నాడు. కొన్నాళ్లు వీరి కాపురం సవ్యంగానే సాగింది. కొన్నాళ్లుగా భార్య రమ్యపై భర్త నవీన్.. అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఇరువురి మధ్యన తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన గొడవ కారణంగా ప్రస్తుతం ఆమె భర్తను వదిలేసింది. ఈ క్రమంలో నవీన్.. భార్య ఇంటికి వెళ్లి రమ్యని బయటకు పిలిచాడు. రమ్య బయటికి రాగానే అప్పటికే తనతో తెచ్చుకున్న పెట్రోల్ను రమ్యపై పోసి నిప్పంటించాడు. ఆమె తల్లిదండ్రులు అడ్డుకొనే ప్రయత్నం చేయగా వారిని పక్కకు నెట్టేశాడు. మంటలు అంటుకొని ఆర్తనాదాలు చేస్తున్న రమ్యను తల్లిదండ్రులు కాపాడే ప్రయత్నం చేసినా అప్పటికే ఆమె ఒళ్లంతా కాలిపోయింది. చివరకి మంటలను ఆర్పేసి హుటాహుటిన జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన రమ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలతో పోరాడుతోంది. మరోవైపు నవీన్ ధర్మపురి మున్సిపాలిటీలో తాత్కాలిక ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. తమ కూతురికి నిప్పంటించి హత్యాయత్నం చేసిన నవీన్ ను కఠినంగా శిక్షించాలని రమ్య తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
READ ALSO: Congress: కేరళ ఎన్నికల నగారా.. 55 మందితో కాంగ్రెస్ తొలి జాబితా విడుదల!
