Site icon NTV Telugu

Vanasthalipuram Murder: హైదరాబాద్‌లో దారుణ హత్య.. గర్భిణి అని కూడా చూడకుండా రంపం, కత్తులతో మాజీ భర్త కిరాతకం!

Hyderabad Double Murder

Hyderabad Double Murder

Vanasthalipuram Murder: కలహాలు.. కాపురాల్లో చిచ్చురేపుతున్నాయి. భార్య, భర్త మధ్య తలెత్తుతున్న వివాదాలు..ఒక్కోసారి ఎవరో ఒకరిని చంపుకునే వరుకు వెళ్తున్నాయి. వివాహేతర బంధాలు కావచ్చు..లేదా కుటుంబ కలహాలు కావచ్చు..లేదా మద్యం లాంటి వ్యసనాలు కావచ్చు.. వరకట్న వేధింపులు కావచ్చు.. ఇలా సమస్య ఏదైనా కొంత మందికి మాత్రం హత్యలే పరిష్కారంగా కనిపిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ ఇలాంటి హత్యలే రెండు జరిగాయి. రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వనస్థలిపురంలో మాజీ భార్యను మాజీ భర్త హత్య చేయగా, హైదరాబాద్ పాతబస్తీలో భర్తను భార్య మట్టుబెట్టింది.

READ ALSO: HYD DRUGS ARREST: డెడ్ డ్రాప్.. అట్టర్ ఫ్లాప్..

ఆయన పేరు మహేష్. ఏపీకి చెందిన మహేష్.. తెలంగాణకు చెందిన సునీతను కొన్నేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే కావడంతో .. ఉద్యోగరీత్యా అమెరికాకు వెళ్లారు. పెళ్లి తర్వాత అమెరికాకు వెళ్లి అక్కడే ఉద్యోగాలు చేస్తూ స్థిరపడ్డారు. ప్రారంభంలో వారి దాంపత్య జీవితం సాఫీగానే సాగినప్పటికీ.. కొంతకాలానికి మనస్పర్ధలు తలెత్తాయి. దీంతో కాపురంలో వివాదాలు పెరగడంతో సునీత భారత్‌కు తిరిగి వచ్చేసింది. హైదరాబాద్‌లో నివాసం ఏర్పరుచుకుంది. అనంతరం మహేష్‌పై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసింది. దీంతో పోలీసులు మహేష్‌‌ను పట్టుకునేందుకు లుక్‌ ఔట్ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అతను పనిచేస్తున్న అమెరికా సాఫ్ట్‌వేర్ సంస్థ చర్యలు తీసుకుని అతడిని భారత్‌కు పంపించింది. అతని వీసా, పాస్‌పోర్ట్ కూడా రద్దయ్యాయి.

భార్య చేసిన ఈ పని మహేష్‌లో ఆమె పట్ల ద్వేషాన్ని మరింత పెంచింది. అంతే కాదు ఆమెపై పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఇండియాకు చేరుకున్న మహేష్.. హైదరాబాద్‌లో పలుచోట్ల ఉద్యోగాల కోసం ప్రయత్నించాడు. కానీ ఫలితం లేకపోయింది. ఇదే సమయంలో సునీత.. అతనికి విడాకులు ఇచ్చి మరొకరిని వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఈ పరిణామాలు మహేష్‌లో మరింత అలజడి రేపాయి. తన జీవితాన్ని నాశనం చేసిందంటూ మహేష్.. ఆమెపై తీవ్రంగా కక్ష పెంచుకున్నాడు. సునీతను ఎలాగైనా హత్య చేయాలని కొన్ని రోజులుగా ప్రణాళిక సిద్ధం చేశాడు.

సునీతను చంపి మృతదేహాన్ని ముక్కలు చేసి పారేయాలని ఉద్దేశంతో ముందుగానే టూల్‌బాక్స్, రంపం, రెండు కత్తులు, పెట్రోల్ డబ్బా కొనుగోలు చేశాడు. ఆమె నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌పై కొన్ని రోజులుగా నిఘా పెట్టాడు. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని గమనించాడు. మధ్యాహ్నం సమయంలో సునీత ఇంట్లో ఒంటరిగా ఉన్నట్టు గుర్తించిన మహేష్ తలుపు తట్టి లోపలికి ప్రవేశించాడు. తలుపు తెరిచిన వెంటనే కత్తులతో దాడి చేసి, పూల కుండితో తలపై బలంగా కొట్టి హత్య చేశాడు. మృతిచెందిందని నిర్ధారించుకున్న తర్వాత మృతదేహాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో ఇంటికి వచ్చిన సునీత అత్త అక్కడి దృశ్యం చూసి కేకలు వేయడంతో మహేష్ పెట్రోల్ పోసి ఇంటిని తగలబెడతానని.. తనను తాను కాల్చుకుంటానని బెదిరించాడు. ఆమె అరుపులు విని స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. పారిపోవడానికి ప్రయత్నించిన మహేష్‌ను స్థానికులు అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్లూస్ టీంతో కలిసి ఆధారాలు సేకరించారు. మహేష్‌ను అదుపులోకి తీసుకుని హత్య కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ముందస్తుగా పథకం రచించి హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మహేష్.. మర్డర్ చేసిన సమయంలో సునీత రెండు నెలల గర్భిణిగా ఉంది. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన త్రినాథ్‌ను ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్న సమయంలోనే మొదటి భర్త హత్య చేశాడు. మరోవైపు సునీతకు అప్పటికే పెళ్లి అయిందన్న విషయం తెలియదని త్రినాథ్ కుటుంబ సభ్యులు, బంధువులు చెబుతున్నారు. ఈ దారుణ ఘటనతో వనస్థలిపురం ప్రాంతంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది. ప్రేమతో ప్రారంభమైన దాంపత్యం.. ద్వేషంతో ముగిసిన ఈ సంఘటన అందరినీ కలచివేసింది.

మరోవైపు హైదరాబాద్ పాతబస్తీలో భర్తను అత్యంత దారుణంగా భార్య హత్య చేసింది. మద్యం మహమ్మారి వారి కుటుంబంలో చిచ్చు పెట్టింది. హైదరాబాద్ పాతబస్తీ భవానీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి దారుణ ఘటన జరిగింది. అతని పేరు మహమ్మద్ ఇషాక్. వృత్తిరీత్యా ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఐతే ఇటీవల అతడు మద్యానికి బానిసయ్యాడు. మద్యం తాగి వచ్చి రోజూ ఇంట్లో గొడవ పడుతున్నాడు. భర్త ప్రవర్తనతో.. విసిగివేసారిన భర్య.. అతను నిద్రలో ఉండగా.. దుపట్టాతో గొంతు బిగించి హత్య చేసిందని స్థానికులు చెబుతున్నారు. ఇషాక్ మద్యపానం కారణంగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో భార్య నూర్ జహాన్ బేగం ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

READ ALSO: Vijay – Rashmika: పాపం.. పెళ్లి కూడా ప్రశాంతంగా చేసుకోనివర్రా..

Exit mobile version