Illicit Affair: వివాహేతర సంబంధం కారణంగా తన భార్యతో పదే పదే గొడవ పడి ఆమెను గొంతు నులిమి హత్య చేసిన ఘటన గుజరాత్లోని జునాగఢ్ సమీపంలోని సర్దార్పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఈ దంపతులు ఇద్దరు గ్రామంలో వ్యవసాయ కూలీలుగా పని చేసుకుంటున్నారు. నానియా సస్తే మరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడంపై అతని భార్య నియతితో తరచుగా గొడవలు పెట్టుకునేవాడు.. దాంతో అతను తన భార్యను వదిలి ప్రేయసితో ఉండాలని నిర్ణయించుకున్నాడు.
Read Also: SPIRIT : రెబల్ ఫ్యాన్స్ కు సందీప్ రెడ్డి ‘స్పిరిట్’ గిఫ్ట్..
ఈ నేపథ్యంలో అక్టోబర్ 18వ తేదీ రాత్రి 8 గంటల ప్రాంతంలో నానియా సస్తే పొలంలో నియతితో గొడవ పడ్డాడు. ఇది తీవ్ర వాగ్వాదానికి దారి తీయడంతో, ఆ వాగ్వాదంలోనే అతడు ఆమెను గొంతు నులిమి చంపాడు అని పోలీసులు పేర్కొన్నారు. ఈ హత్య జరిగిన తర్వాత నానియా సస్తే నేరానికి సంబంధించిన సాక్ష్యాలను మాయం చేసేందుకు తన స్నేహితుడైన జేను సోలంకి సహాయం కోరినట్లు తెలుస్తుంది. మధ్యప్రదేశ్లో క్రిమినల్ రికార్డు ఉన్న సోలంకిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.
