Vinayaka Immersion Accident: వినాయక చవిత రోజు గణపయ్య విగ్రహాలు పెట్టి పూజించి భక్తులు.. బై బై గణేషా అంటూ.. గంగమ్మ ఒడికి తరలిస్తున్నారు.. అయితే, వినాయజక నిమజ్జనం సందర్భంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి.. ఇక, తాజాగా, చిత్తూరు జిల్లాలో వినాయక నిమజ్జన వేడుకల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. వి.కోట మండలం చింతమాకులపల్లి వద్ద వినాయక నిమజ్జనానికి వెళ్తున్న భక్తులపైకి ఓ లారీ దూసుకెళ్లింది. హైవే పక్కన నిలబడి ఉన్న భక్తులను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
అర్ధరాత్రి 12:30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో వరలక్ష్మి (27), శివ (26) మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో వెన్నెల (17), దిలీప్ (16), వరలక్ష్మి (35) ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో చింతమాకులపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. వినాయక నిమజ్జన వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లిన భక్తులపై లారీ దూసుకురావడంతో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

