Prices Hike : దేశం కొంపముంచనున్న వర్షాలు.. నిత్యావసర ధరలు పెరుగుతాయా?

Prices Hike

Prices Hike

Prices Hike : పెట్రోల్ ధరలు పెరుగుతాయా… గ్యాస్ సిలిండర్ మళ్లీ భారమవుతుందా… ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతలతో ముడి చమురు ధరలు ఎగిసిపడితే ద్రవ్యోల్బణం మళ్లీ పెరుగుతుందా… గత కొన్ని వారాలుగా భారత ఆర్థిక వ్యవస్థపై చర్చ అంతా ఈ ప్రశ్నల చుట్టూనే తిరిగింది. కానీ ఇప్పుడు ఆ భయం కొంత తగ్గింది. చమురు ధరలు క్రమంగా స్థిరపడుతున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం తర్వాత పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు సడలాయి. ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన హోర్ముజ్ జలసంధి విషయంలోనూ ఆందోళనలు తగ్గుముఖం పట్టాయి. దీంతో చమురు ఆధారిత ద్రవ్యోల్బణ భయం కొంత వెనక్కి తగ్గింది.

అయితే ఆందోళన పూర్తిగా తొలగిపోలేదు. భారత ఆర్థిక వ్యవస్థను ఇప్పుడు మరో కొత్త ప్రమాదం వెంటాడుతోంది. అది ముడి చమురు కాదు. వర్షాలు. ముఖ్యంగా బలహీనమైన నైరుతి రుతుపవనాలు ఇప్పుడు దేశ ద్రవ్యోల్బణానికి అతిపెద్ద ముప్పుగా మారే అవకాశముందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

×
×
Ad

ఇన్ఫోమెరిక్స్ రేటింగ్స్ చీఫ్ ఎకనమిస్ట్ డాక్టర్ మనోరంజన్ శర్మ అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం భారతదేశానికి చమురు కంటే వర్షాలే పెద్ద ప్రమాదంగా కనిపిస్తున్నాయి. ప్రపంచ చమురు ధరలు అదుపులోనే ఉన్నాయని, పశ్చిమ ఆసియా సంక్షోభం క్రమంగా తగ్గుతోందని, భారత్ కూడా వివిధ దేశాల నుంచి చమురు దిగుమతులు చేసుకునే సామర్థ్యాన్ని పెంచుకుందని ఆయన చెబుతున్నారు. కానీ వ్యవసాయం మాత్రం ఇప్పటికీ వర్షాలపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది.

భారతదేశంలో సాగుభూమిలో దాదాపు సగం భాగం వర్షాధారంగానే ఉంది. మరోవైపు వినియోగదారుల ధరల సూచీలో ఆహార పదార్థాల వాటా సుమారు 46 శాతం. అలాంటి పరిస్థితిలో వర్షాలు తగ్గితే ధాన్యాలు, పప్పుధాన్యాలు, కూరగాయలు, పండ్లు, నూనెగింజల ఉత్పత్తి దెబ్బతింటుంది. సరఫరా తగ్గిపోతుంది. ఫలితంగా ధరలు పెరుగుతాయి. ఇది నేరుగా ప్రజల జేబులపై ప్రభావం చూపుతుంది.

మే నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 3.48 శాతం నుంచి 3.93 శాతానికి పెరిగింది. ఆహార, ఇంధన ధరల పెరుగుదల దీనికి ప్రధాన కారణంగా నిలిచింది. అదే సమయంలో హోల్‌సేల్ ద్రవ్యోల్బణం 9.68 శాతానికి చేరింది. ఈ పరిస్థితుల్లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ కూడా 2026–27 ఆర్థిక సంవత్సరానికి తన ద్రవ్యోల్బణ అంచనాను 4.6 శాతం నుంచి 5.1 శాతానికి పెంచింది.

బలహీనమైన రుతుపవనాల ప్రభావం ముందుగా కూరగాయల మార్కెట్‌లో కనిపిస్తుంది. వర్షాలు తక్కువగా పడితే ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో కూరగాయలు, పప్పులు, వంటనూనెలు, పాల ఉత్పత్తుల ధరలు వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎల్ నినో పరిస్థితులు ఏర్పడిన సంవత్సరాల్లో ఆహార ద్రవ్యోల్బణం మరింత తీవ్రమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

దీని ప్రభావం మధ్యతరగతి కుటుంబాలపై స్పష్టంగా కనిపించవచ్చు. ఒక పట్టణ మధ్యతరగతి కుటుంబానికి నెలవారీ ఖర్చు రూ.1,000 నుంచి రూ.3,000 వరకు అదనంగా పెరిగే అవకాశం ఉందని డాక్టర్ శర్మ అంచనా వేస్తున్నారు. తక్కువ ఆదాయ వర్గాల పరిస్థితి మరింత కఠినంగా ఉండొచ్చు. ఎందుకంటే వారి ఖర్చుల్లో ఆహార వ్యయం వాటా చాలా ఎక్కువగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఒకవైపు ఆహార ధరలు పెరగడం, మరోవైపు వ్యవసాయ ఆదాయం తగ్గిపోవడం వల్ల ద్వంద్వ ప్రభావం ఎదురయ్యే అవకాశం ఉంది.

ఈ పరిస్థితిని ఆర్‌బీఐ కూడా నిశితంగా గమనిస్తోంది. వర్షాభావం కారణంగా ఆహార ద్రవ్యోల్బణం పెరిగితే వడ్డీ రేట్ల తగ్గింపుపై కేంద్ర బ్యాంకు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి రావచ్చు. ఆహార ధరలు ఎక్కువకాలం అధికంగానే ఉంటే ద్రవ్యోల్బణం నియంత్రణ కష్టమవుతుంది. అదే సమయంలో గ్రామీణ వినియోగం తగ్గడం వల్ల ఆర్థిక వృద్ధి కూడా మందగించే ప్రమాదం ఉంది.

అయితే గతంలోలాగా తీవ్రమైన సంక్షోభం తప్పనిసరిగా వస్తుందని భావించాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో ఆహార ధాన్య నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. సాగునీటి సౌకర్యాలు విస్తరించాయి. రవాణా వ్యవస్థ మెరుగుపడింది. అవసరమైతే ప్రభుత్వం జోక్యం చేసుకుని సరఫరాను సమతుల్యం చేసే సామర్థ్యాన్ని కూడా పెంచుకుంది.

అయినా సరే ఈ ఏడాది వర్షాల పరిస్థితి దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా మారింది. కొన్ని వారాల క్రితం వరకు ద్రవ్యోల్బణానికి విలన్‌గా కనిపించిన ముడి చమురు ఇప్పుడు వెనక్కి తగ్గుతోంది. కానీ ఇప్పుడు అదే స్థానంలో వర్షాలు నిలుస్తున్నాయి. అందుకే ఈసారి ప్రజలు పెట్రోల్ బంకుల కంటే ఆకాశం వైపే ఎక్కువగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.