Vodafone – Idea: కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. కానీ వొడాఫోన్ ఐడియా షేర్లకు రెక్కలు! షేర్ ధర ఎంత పెరిగిందంటే..

Vodafone Idea

Vodafone Idea

Vodafone – Idea: ఈ రోజు స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. పెరుగుతున్న ముడి చమురు ధరలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి, అయితే మార్కెట్‌లో ఈ రోజు ఒక స్టాక్ పెట్టుబడిదారుల దృష్టిని వేగంగా ఆకర్షించింది. ఇంకతీ ఆ స్టాక్ ఏంటో తెలుసా.. వోడాఫోన్ ఐడియా. సోమవారం నాడు, నిఫ్టీ – బ్యాంక్ నిఫ్టీ పడిపోతున్నప్పుడు, ఈ టెలికాం స్టాక్ ఏకంగా 10% పెరిగి రూ.12.37కు చేరుకుంది. మొత్తం మార్కెట్‌కు విరుద్ధంగా, ఈ స్టాక్ ఇంతగా దూసుకుపోవడానికి కారణం ఏమిటనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఒకవైపు పెరుగుతున్న ముడి చమురు ధరలు, మరొక వైపు డాలర్‌తో పోలిస్తే బలహీనపడుతున్న రూపాయి కారణంగా స్టాక్ మార్కెట్ తీవ్రంగా దెబ్బతింది. నిఫ్టీ దాదాపు 250 పాయింట్లు పడిపోయి, 23,900 స్థాయికి సమీపంలో కదులుతోంది. బ్యాంక్ నిఫ్టీ 600 పాయింట్లకు పైగా పడిపోయింది. మార్కెట్ భయాలను కొలిచే ఇండియా విక్స్ (VIX) 9 శాతం పెరిగింది. ఇంత ప్రతికూల సమయంలో వొడాఫోన్ ఐడియా షేర్లు ఈ రోజు మార్కెట్‌లో లాభాలు నమోదు చేశాయి. గత శుక్రవారం రూ.11.25 వద్ద ముగిసిన ఈ స్టాక్, ఈరోజు రూ.11.22 వద్ద ప్రారంభమై, రూ.12.43కు చేరుకుంది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1,31,636 కోట్లకు చేరుకుంది.

బ్రిటన్ నుంచి బిగ్ న్యూస్ ..
నిజానికి ఈ రోజు మార్కెట్‌లో స్టాక్ పెరుగుదల వెనుక ఒక ప్రధాన వ్యూహాత్మక కారణం ఉందని సమాచారం. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. వొడాఫోన్ గ్రూప్ పీఎల్‌సి తన భారతీయ విభాగాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రణాళిక రచిస్తోంది. బకాయి ఉన్న స్పెక్ట్రమ్ ఫీజుల విషయంలో భారత ప్రభుత్వం నుంచి ఉపశమనం పొందిన తర్వాత, ఈ కంపెనీ ఒక కొత్త స్టార్ట్ కోసం చూస్తోంది. ఇప్పుడు, వొడాఫోన్ పీఎల్‌సి తన బ్యాలెన్స్ షీట్‌ను పటిష్టం చేసుకోవడానికి ఒక కొత్త వ్యూహాన్ని చేపడుతోంది. నగదు పెట్టుబడి పెట్టడానికి బదులుగా, కంపెనీ షేర్ల బదిలీ నమూనాను పరిశీలిస్తోంది. ప్రస్తుతం వొడాఫోన్ పీఎల్‌సి, వొడాఫోన్ ఐడియాలో 19% వాటాను కలిగి ఉంది, దీని విలువ సుమారుగా రూ.23,160 కోట్లు. దీనిలో కొంత భాగాన్ని ట్రెజరీ స్టాక్‌గా భారతీయ కంపెనీకి బదిలీ చేయవచ్చని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఈ బదిలీ వల్ల కంపెనీకి లాభం ఏంటంటే.. వొడాఫోన్ ఐడియా (Vi) ఈ షేర్లను పొందినప్పుడు, వాటిని మార్కెట్లో అమ్మడం ద్వారా లేదా పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టడం ద్వారా గణనీయమైన మొత్తంలో డబ్బును సమీకరించగలదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ డబ్బును కంపెనీ మౌలిక సదుపాయాలు, నెట్‌వర్క్‌ను విస్తరించడానికి నేరుగా ఉపయోగిస్తారు. ఇది కంపెనీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. వీటితో పాటు కంపెనీలో యాజమాన్య స్థాయిలో ఒక పెద్ద మార్పు కనిపించింది. మే 5వ తేదీన రవీందర్ టక్కర్ నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయగా, ఇప్పుడు ఆ బాధ్యతలను ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్ మంగలం బిర్లా స్వీకరించారు. ఈ రెండు ప్రధాన పరిణామాలు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పునరుద్ధరించాయి. నియంత్రణ సంస్థల మద్దతు, నిధుల సమీకరణపై ఉన్న అంచనాల ప్రత్యక్ష ఫలితమే ఈ పెరుగుదలకు కారణమని బోనాంజా రీసెర్చ్ విశ్లేషకురాలు ఖుషీ మిస్త్రీ కూడా అభిప్రాయపడ్డారు.

ఈ స్టాక్ ఇటీవలి పనితీరును చూస్తే, ఇది పెట్టుబడిదారులను నిరాశపరచలేదు. కేవలం గత వారంలోనే, ఈ స్టాక్ 16% పైగా రాబడిని ఇచ్చింది. ఒక నెల కాలంలో, ఇది దాదాపు 32% లాభపడింది. గత సంవత్సర కాలంలో ఇది సుమారు 84% ఆకట్టుకునే రాబడులను అందించినందున, దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ఇది ఒక మల్టీబ్యాగర్‌గా నిరూపించుకుంటోందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.