Sugar Price: పండుగల సీజన్ మొదలవుతోందంటే చాలు ఇళ్లలో పిండివంటలు, తీపి పదార్థాల సందడి నెలకుంటుంది. దసరా, దీపావళి వంటి పెద్ద పండుగల సమయంలో.. ఆకాశాన్నంటిన పంచదార ధరలు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. అయితే, పండుగల వేళ సామాన్యుడికి మళ్లీ ఊరట లభించనుంది. గడిచిన మూడు వారాల్లోనే బహిరంగ మార్కెట్లో కిలో పంచదార రిటైల్ ధర దాదాపు 10 శాతం మేర తగ్గి, రూ. 65 నుంచి రూ. 58.50 కి దిగివచ్చిన విషయం తెలిసిందే. కేవలం ధరల తగ్గింపే కాకుండా, మార్కెట్లో చక్కెర కొరత ఏర్పడకుండా కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పెద్ద ఎత్తున పంచదారను ఉపయోగించే వ్యాపారులు లేదా పారిశ్రామిక వినియోగదారులు ఇప్పటివరకు కేవలం 15 రోజులకు సరిపడా నిల్వలు (స్టాక్) మాత్రమే ఉంచుకోవడానికి అనుమతి ఉండగా, ఆ పరిమితిని ప్రభుత్వం ఇప్పుడు 30 రోజులకు పెంచింది.
గత కొన్ని వారాలుగా తగ్గుతున్న ధరల ట్రెండ్ను పరిగణనలోకి తీసుకుని, పండుగల సమయంలో పెరిగే డిమాండ్కు తగినట్లుగా సరఫరా ఉండేలా చూసేందుకే ప్రభుత్వం శుక్రవారం ఈ సడలింపు ఇచ్చింది. పండుగల సమయంలో స్వీట్లు, ఇతర పిండివంటల తయారీ విపరీతంగా పెరుగుతుంది కాబట్టి పంచదారకు విపరీతమైన డిమాండ్ ఏర్పడటం సహజం. ఇలాంటి కీలక సమయంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. కాకపోతే, చక్కెర మిల్లుల వద్ద ధరలు దాదాపు 25 శాతం వరకు పడిపోయినప్పటికీ, ఆ స్థాయిలో రిటైల్ మార్కెట్లో కస్టమర్లకు లబ్ధి చేకూరలేదని ఆహార శాఖ పరిశ్రమల వర్గాలకు స్పష్టం చేసింది. మిల్లుల వద్ద తగ్గిన ధరల ప్రయోజనాన్ని హోల్సేలర్లు, రిటైలర్లు, వ్యాపారులు వెంటనే సామాన్య వినియోగదారులకు అందించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
అయితే, వ్యాపారులకు నిల్వ పరిమితిని 15 రోజుల నుంచి 30 రోజులకు పెంచుతూ ఇచ్చిన ఈ వెసులుబాటు వెనుక ఒక ముఖ్యమైన షరతు కూడా ఉంది. నెలకు 10 టన్నుల కంటే ఎక్కువ పంచదారను ముడిసరుకుగా వాడే పెద్ద బిస్కెట్ తయారీ కంపెనీలు, స్వీట్ షాపులు, సాఫ్ట్ డ్రింక్ సంస్థలు, బేకింగ్ పరిశ్రమలు ఈ హోల్సేల్ వినియోగదారుల పరిధిలోకి వస్తాయి. ప్రభుత్వం ఇచ్చిన కొత్త సడలింపు ప్రకారం.. వీరు అదనంగా ఉంచుకునే మరో 15 రోజుల నిల్వలను కేవలం ‘టారిఫ్ రేట్ కోటా’ (TRQ) కింద దిగుమతి చేసుకున్న చక్కెర ద్వారా గానీ, లేదా ‘అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్’ కింద సేకరించిన దాని ద్వారా గానీ మాత్రమే భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది.
వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం టారిఫ్ రేట్ కోటా కింద 10 లక్షల టన్నుల చక్కెర దిగుమతికి అనుమతించడమే కాకుండా, ఎగుమతుల కోసం కేటాయించి ‘అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్’ కింద కొనుగోలు చేసిన పంచదారను కూడా స్థానిక స్వదేశీ మార్కెట్లో విక్రయించేందుకు ఆమోదం తెలిపింది. ఇకపోతే, దేశీయంగా ఓపెన్ మార్కెట్ నుంచి కొనుగోలు చేసే సాధారణ పంచదార నిల్వలపై మాత్రం పాత 15 రోజుల పరిమితి నిబంధనే వర్తిస్తుంది. దీనితో పాటు, ఈ హోల్సేల్ వ్యాపారులు, పారిశ్రామిక వినియోగదారులు తమ వద్ద ఉన్న పంచదార నిల్వల వివరాలను ప్రతి శుక్రవారం ఆహార శాఖకు చెందిన ఆన్లైన్ పోర్టల్లో తప్పనిసరిగా నమోదు చేయాలని కేంద్రం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ చర్యలన్నింటి వల్ల రాబోయే పండుగల సీజన్లో పంచదార లభ్యత పెరిగి, సామాన్యులకు తక్కువ ధరకే స్వీట్ల తీపి అందే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

