RBI New Rules: ఇక బ్యాంకుల దౌర్జన్యానికి చెక్.. ఆర్‌బీఐ న్యూ రూల్స్.. బ్యాంకు కస్టమర్లకు భారీ ఊరట

  • ఆర్‌బీఐ న్యూ రూల్స్
  • 2027 జనవరి 1 నుంచి అమల్లోకి
  • బ్యాంకు కస్టమర్లకు భారీ ఊరట
Rbi New Rules

Rbi New Rules

బ్యాంకులో రుణం తీసుకునే సమయంలో లేదా క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు మీకు అవసరం లేకపోయినా బీమా పాలసీలు, పెట్టుబడి పథకాలు కొనుగోలు చేయాలని ఒత్తిడి ఎదురైందా? ఇకపై అలాంటి పరిస్థితులకు చెక్ పడనుంది. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు, ఆర్థిక ఉత్పత్తుల తప్పుడు విక్రయాలను అరికట్టేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

తప్పుడు విక్రయాలకు చెక్

2026 జూన్ 15న విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం, బీమా పాలసీలు, పెట్టుబడి ఉత్పత్తులు, రుణాలకు సంబంధించిన అదనపు పథకాలను వినియోగదారులపై బలవంతంగా రుద్దకూడదు. ఏ ఆర్థిక ఉత్పత్తినైనా విక్రయించే ముందు దాని ప్రయోజనాలు, నష్టాలు, రుసుములు, నిబంధనల గురించి పూర్తి సమాచారాన్ని వినియోగదారులకు స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది.

×
×
Ad

వినియోగదారుల అవసరాలు, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా లేని ఉత్పత్తులను విక్రయించడం, తప్పుదారి పట్టించే సమాచారం ఇవ్వడం లేదా సరైన సమ్మతి లేకుండా ఉత్పత్తులను విక్రయించడం “మిస్-సెల్లింగ్”గా పరిగణించబడుతుందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

డార్క్ ప్యాటర్న్‌లపై నిషేధం

డిజిటల్ బ్యాంకింగ్ సేవల్లో వినియోగదారులను తప్పుదోవ పట్టించే “డార్క్ ప్యాటర్న్స్” వినియోగాన్ని కూడా ఆర్‌బీఐ నిషేధించింది. డార్క్ ప్యాటర్న్స్ అంటే వినియోగదారులకు పూర్తి అవగాహన లేకుండా ఒక సేవకు అంగీకరించేలా చేసే డిజైన్ పద్ధతులు.

కొత్త నిబంధనల ప్రకారం బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ వెబ్‌సైట్లు, మొబైల్ యాప్‌లు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ఇటువంటి పద్ధతులను ఉపయోగించకూడదు. అలాగే, వినియోగదారులను తప్పుదోవ పట్టించే అంశాలు లేవని నిర్ధారించుకునేందుకు తమ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను క్రమం తప్పకుండా సమీక్షించాల్సి ఉంటుంది.

వినియోగదారుల సమ్మతి తప్పనిసరి

ఇకపై ఏదైనా ఆర్థిక ఉత్పత్తిని విక్రయించే ముందు వినియోగదారుల నుంచి స్పష్టమైన, పూర్తి సమాచారంతో కూడిన సమ్మతిని పొందడం తప్పనిసరి. వినియోగదారుడు ఇప్పటికే అంగీకరించాడని ఊహించి ఉత్పత్తులను విక్రయించకూడదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. అంతేకాకుండా, వినియోగదారుల సమ్మతికి సంబంధించిన రికార్డులను బ్యాంకులు భద్రపరచాలి. అదనపు ఉత్పత్తులు లేదా సేవలను కొనుగోలు చేయమని ఒత్తిడి చేయడం కూడా నిబంధనల ఉల్లంఘనగా పరిగణించనున్నట్లు తెలిపింది.

ఉల్లంఘనలకు కఠిన చర్యలు

తప్పుడు విక్రయం జరిగినట్లు నిర్ధారణ అయితే, సంబంధిత బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ.. కస్టమర్ కి డబ్బు తిరిగి చెల్లించాల్సి రావచ్చు. ఉత్పత్తి విక్రయాన్ని రద్దు చేసిన విషయాన్ని కూడా వినియోగదారుడికి తప్పనిసరిగా తెలియజేయాల్సి ఉంటుంది.

మార్కెటింగ్ కాల్స్‌పై కూడా నియంత్రణ

మార్కెటింగ్ కాల్స్, ప్రచార సందేశాల నుంచి వైదొలగేందుకు వినియోగదారులకు సులభమైన మార్గాన్ని అందించాలని ఆర్‌బీఐ సూచించింది. వినియోగదారుల అభీష్టానికి విరుద్ధంగా ప్రమోషనల్ కమ్యూనికేషన్లు పంపకూడదని స్పష్టం చేసింది.

వినియోగదారులకు మరింత రక్షణ

ఈ కొత్త మార్గదర్శకాలతో బ్యాంకింగ్ వ్యవస్థలో పారదర్శకత పెరగడంతో పాటు వినియోగదారుల హక్కులు మరింత బలోపేతం కానున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఆర్థిక సంస్థల జవాబుదారీతనం పెరగడం ద్వారా మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల విశ్వాసం మరింత బలపడే అవకాశం ఉంది. 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న ఈ నిబంధనలు, బ్యాంకింగ్ సేవలను మరింత వినియోగదారుల అనుకూలంగా మార్చే కీలక సంస్కరణలుగా భావిస్తున్నారు.