RBI: లోన్ తిరిగి చెల్లించకపోతే బ్యాంకు మీ మొబైల్ ఫోన్‌ను లాక్ చేస్తుందా? షాకిస్తున్న ఆర్‌బిఐ కొత్త ప్రతిపాదన

  • రుణ వసూళ్లకు సంబంధించిన నిబంధనల్లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రతిపాదించిన కీలక మార్పులు
  • EMI చెల్లిస్తే గంటలోపు ఫోన్ అన్‌లాక్
  • ఈ నిబంధన ప్రతి రుణానికి వర్తించదని RBI స్పష్టం
Rbi

Rbi

మీరు రుణం తీసుకుని మొబైల్ ఫోన్ కొనుగోలు చేసి, EMIలను సకాలంలో చెల్లించకపోతే, భవిష్యత్తులో బ్యాంకులు మీ స్మార్ట్‌ఫోన్‌లోని కొన్ని సేవలను పరిమితం చేసే అవకాశం ఉంది. రుణ వసూళ్లకు సంబంధించిన నిబంధనల్లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రతిపాదించిన కీలక మార్పులు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

అయితే, ఈ నిబంధన ప్రతి రుణానికి వర్తించదని RBI స్పష్టం చేసింది. మొబైల్ ఫోన్, టాబ్లెట్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ప్రత్యేకంగా “డివైస్ లోన్” ద్వారా కొనుగోలు చేసిన సందర్భాల్లో మాత్రమే ఈ నియమాలు అమల్లోకి రావచ్చు. వ్యక్తిగత రుణం, గృహ రుణం లేదా వాహన రుణం చెల్లించకపోయినా బ్యాంకులు వినియోగదారుల ఫోన్‌లను లాక్ చేయలేవు.

ఫోన్ సేవలను ఎప్పుడు పరిమితం చేయవచ్చు?

RBI ప్రతిపాదన ప్రకారం, డివైస్ లోన్ తీసుకున్న వినియోగదారుడు వరుసగా 90 రోజుల పాటు EMIలు చెల్లించకపోతే, బ్యాంకు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే, అలాంటి చర్యలకు ముందు వినియోగదారునికి తప్పనిసరిగా ముందస్తు నోటీసు ఇవ్వాలి. దీని అనంతరం, బ్యాంకులు ఫోన్‌లోని కొన్ని ఫీచర్లను తాత్కాలికంగా నిలిపివేయడం లేదా పరిమితం చేయడం చేయవచ్చు.

పూర్తిగా ఫోన్ బ్లాక్ కాదు

వినియోగదారులకు ఊరటనిచ్చే అంశంగా, ఫోన్‌ను పూర్తిగా నిలిపివేయరాదని RBI స్పష్టం చేసింది. కింది అత్యవసర సేవలు యథావిధిగా పనిచేస్తాయి:

ఇంటర్నెట్ కనెక్టివిటీ
ఇన్‌కమింగ్ కాల్స్
SOS / అత్యవసర సేవలు
ప్రభుత్వ అత్యవసర హెచ్చరికలు
అంటే, వినియోగదారుల కమ్యూనికేషన్ పూర్తిగా నిలిచిపోదు.

EMI చెల్లిస్తే గంటలోపు ఫోన్ అన్‌లాక్

వినియోగదారుడు బకాయి EMIని చెల్లించిన తర్వాత, బ్యాంకు ఒక గంటలోపు ఫోన్ సేవలను పునరుద్ధరించాల్సి ఉంటుంది. అలా చేయడంలో విఫలమైతే, బ్యాంకు గంటకు రూ.250 చొప్పున వినియోగదారునికి నష్టపరిహారం చెల్లించాల్సి రావచ్చు.

రికవరీ ఏజెంట్లపై కఠిన నియంత్రణ

రికవరీ ఏజెంట్ల ప్రవర్తనపై కూడా RBI కఠిన నిబంధనలను ప్రతిపాదించింది.

ఇకపై ఏజెంట్లు.. వినియోగదారులను బెదిరించడం, దూషణలు చేయడం, వ్యక్తిగత సమాచారం లేదా వీడియోలను సోషల్ మీడియాలో పంచుకోవడం, అధికంగా కాల్స్ లేదా మెసేజ్‌లు పంపడం, వంటి చర్యలు చేయకూడదు. ఇవి నిబంధనల ఉల్లంఘనగా పరిగణించబడతాయి.

కాల్ రికార్డింగ్ తప్పనిసరి

కొత్త మార్గదర్శకాల ప్రకారం, రికవరీకి సంబంధించిన ప్రతి కాల్ వివరాలను బ్యాంకులు భద్రపరచాలి. ఎప్పుడు కాల్ చేశారు, ఎంతసేపు మాట్లాడారు, ఏమి చర్చించారు వంటి వివరాలన్నీ రికార్డ్ చేయాల్సి ఉంటుంది.

ఈ ప్రతిపాదిత నిబంధనలపై RBI మే 31 వరకు ప్రజలు, సంస్థల నుంచి అభిప్రాయాలు, సూచనలు కోరుతోంది. ఈ నిబంధనలు 2026 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశముందని సమాచారం.