RBI Polymer Notes: దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. రూ.10, రూ.20 నోట్లపై ఆర్‌బీఐ భారీ సన్నాహాలు

  • కాగితపు నోట్లకు గుడ్‌బై?.. ప్లాస్టిక్ నోట్లపై ఆర్‌బీఐ భారీ సన్నాహాలు
  • మొదట రూ.10, రూ.20 నోట్లు
  • కాగితపు నోట్ల తరహాలోనే భద్రతా ఫీచర్లు
Rbi

Rbi

భారతదేశంలో కరెన్సీ నోట్ల వ్యవస్థలో కీలక మార్పులకు రంగం సిద్ధమవుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దేశంలో పాలిమర్ (Polymer) లేదా ప్లాస్టిక్ కరెన్సీ నోట్ల ప్రవేశంపై సన్నాహాలు ప్రారంభించినట్లు సమాచారం. తొలి దశలో రూ.10, రూ.20 ప్లాస్టిక్ నోట్లను చలామణిలోకి తీసుకురావాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

మొదట రూ.10, రూ.20 నోట్లు

సమాచారం ప్రకారం, తొలి దశలో తక్కువ విలువ కలిగిన రూ.10, రూ.20 నోట్లను పాలిమర్‌తో తయారు చేసి విడుదల చేయనున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే, దశలవారీగా ఇతర పెద్ద నోట్లను కూడా పాలిమర్ రూపంలో తీసుకురావడంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

కాగితపు నోట్ల తరహాలోనే భద్రతా ఫీచర్లు

పాలిమర్ నోట్లలో కూడా ప్రస్తుతం కాగితపు నోట్లలో ఉపయోగిస్తున్న ఆధునిక భద్రతా ప్రమాణాలను అమలు చేయనున్నారు. వీటిలో… మైక్రో-ఆప్టిక్ హోలోగ్రామ్, ప్రత్యేక భద్రతా సిరా, నకిలీని గుర్తించే ప్రత్యేక ఫీచర్లు, అధునాతన సెక్యూరిటీ ఎలిమెంట్లు వంటి టెక్నాలజీని వినియోగించనున్నారు. దీంతో నకిలీ నోట్ల తయారీని గణనీయంగా అరికట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు.

ప్లాస్టిక్ నోట్లు ఎలా ఉంటాయి?

ఈ నోట్లు క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల్లా గట్టిగా ఉండవు. ప్రత్యేక పాలిమర్ పదార్థంతో తయారయ్యే ఇవి తేలికగా, పలుచగా, సులభంగా వంగేలా ఉంటాయి. పరిమాణం, డిజైన్ మాత్రం ప్రస్తుత కాగితపు నోట్ల మాదిరిగానే ఉండే అవకాశం ఉంది.

ప్రైవేట్ కంపెనీల నుంచి పాలిమర్ షీట్లు

పాలిమర్ నోట్ల తయారీ కోసం అవసరమైన ప్రత్యేక షీట్ల సరఫరాకు ఆర్‌బీఐ ప్రైవేట్ కంపెనీలను కూడా ఆహ్వానించినట్లు సమాచారం. అయితే, నోట్ల విడుదలకు సంబంధించి ఖచ్చితమైన తేదీని అధికారులు ఇంకా ప్రకటించలేదు. ఈ ప్రక్రియలో వాతావరణ పరిస్థితులు, ప్రజల వినియోగం, సాంకేతిక పరీక్షలు వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు.

ఇది మొదటిసారి కాదు

భారత్‌లో పాలిమర్ నోట్లపై ఇది తొలి ప్రయత్నం కాదు. 2012లో మైసూరు, జైపూర్, భువనేశ్వర్, సిమ్లా వంటి నగరాల్లో రూ.10 పాలిమర్ నోట్లను పరీక్షాత్మకంగా ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే, సాంకేతిక సమస్యల కారణంగా ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదు.

ప్రజలకు కలిగే ప్రయోజనాలు

పాలిమర్ నోట్లతో ప్రజలకు పలు ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది.

చిరిగిపోవడం, మురికిగా మారడం తక్కువ
ఎక్కువ కాలం మన్నిక
నీటి ప్రభావానికి తట్టుకునే సామర్థ్యం
నకిలీ నోట్ల ముప్పు తగ్గింపు
నిర్వహణ వ్యయం తగ్గే అవకాశం

ప్రపంచంలోని పలు దేశాల్లో ఇప్పటికే వినియోగం

ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్, న్యూజిలాండ్ సహా పలు దేశాల్లో పాలిమర్ కరెన్సీ నోట్లు ఇప్పటికే విజయవంతంగా చలామణిలో ఉన్నాయి. ఈ దేశాల్లో ఇవి ఎక్కువ కాలం మన్నికగా ఉండటంతో పాటు నకిలీ కరెన్సీని నియంత్రించడంలో కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నాయి.

నోట్ల ముద్రణ ఖర్చు పెరుగుతోంది

ఆర్‌బీఐ తాజా నివేదిక ప్రకారం, నోట్ల ముద్రణ వ్యయం 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.5,101.4 కోట్ల నుంచి 2025లో రూ.6,372.8 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో సుమారు 23.8 బిలియన్ చిరిగిన నోట్లు చలామణి నుంచి తొలగించారు. ఈ పరిస్థితుల్లో ఎక్కువకాలం మన్నికగా ఉండే పాలిమర్ నోట్ల ప్రవేశం ఖర్చులను తగ్గించడంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.