UPI Transactions: యూపీఐ సేవలు ఉచితం కాదు.. ఆర్బీఐ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు..

Upi Transations

Upi Transations

యూపీఐ లావాదేవీలు ప్రస్తుతం ఉచితంగానే సాగుతున్నప్పటికీ, భవిష్యత్తులో వీటిపై రుసుములు విధించే అవకాశం ఉందనే వార్తలపై ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందించారు. డిజిటల్ చెల్లింపుల మౌలిక సదుపాయాల నిర్వహణకు అయ్యే ఖర్చులను ఎవరో ఒకరు భరించాల్సిందేనని, ఈ వ్యవస్థను బలోపేతం చేయడానికి నిరంతరం నిధులు అవసరమని ఆయన పేర్కొన్నారు. Merchant Discount Rate (MDR) లేదా ఇతర మార్గాల ద్వారా ఈ వ్యయాన్ని ఎలా భరించాలనేది ప్రభుత్వం చట్ట సవరణల ద్వారా పరిశీలిస్తోందని తెలిపారు.

ప్రస్తుతం వినియోగదారులకు యూపీఐ ఉచితంగా లభిస్తున్నప్పటికీ, దీని వెనుక బ్యాంకులు, చెల్లింపు సేవా సంస్థల సర్వర్ల నిర్వహణ, మోసాల నిరోధక వ్యవస్థలు, సెటిల్‌మెంట్ల కోసం భారీగా నిధులు వెచ్చిస్తున్నాయి. 2020 జనవరి నుంచి వ్యాపారులపై ఎటువంటి ఆంక్షలు లేకుండా ఉచిత యూపీఐ సేవలు అమలులోకి రాగా.. ప్రభుత్వం సబ్సిడీల రూపంలో బ్యాంకులకు కొంత సొమ్ము చెల్లిస్తూ వచ్చింది. అయితే.. గత కొన్నేళ్లలో యూపీఐ లావాదేవీలు ఊహించని స్థాయిలో పెరగడంతో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు బ్యాంకుల నిర్వహణ వ్యయానికి సరిపోవడం లేదు.

ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టానికి పార్లమెంటులో సవరణలు ప్రతిపాదించారు. ప్రతిపాదిత ప్రణాళిక ప్రకారం, రూ. 2,000 కంటే ఎక్కువ విలువ కలిగిన లావాదేవీలపై 0.3 శాతం నుంచి 0.5 శాతం వరకు MDR రుసుము విధించే అవకాశం ఉంది.

ఈ మార్పుల వల్ల సాధారణ వినియోగదారులకు లేదా చిన్న వ్యాపారులకు ఎటువంటి భారం పడదు. మీ స్థానిక కూరగాయల వ్యాపారికి లేదా రోజువారీ చిన్న అవసరాలకు చేసే యూపీఐ చెల్లింపులు మునుపటిలాగే ఉచితంగానే ఉంటాయి. కేవలం అధిక టర్నోవర్ ఉన్న పెద్ద రిటైల్ సంస్థలు, పెద్ద మాల్స్ మాత్రమే ఈ రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ఇది వినియోగదారులపై పడే పన్ను కాదు, కేవలం పెద్ద వ్యాపార సంస్థలు డిజిటల్ చెల్లింపులను స్వీకరించినందుకు చెల్లించే నిర్వహణ రుసుము మాత్రమే.