NTV Telugu Site icon

Insurance Premium: బీమా పాలసీలకు కొత్త రూల్స్.. ఎప్పట్నుంచి అమల్లోకి అంటే..!

Insurancepremium

Insurancepremium

జీవిత బీమా ప్రీమియంలకు సంబంధించి అక్టోబర్‌ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఎఐ ప్రతిపాదించిన సవరించిన సరెండర్ విలువ మంగళవారం నుంచి అమల్లోకి వచ్చినందున బీమా ప్రీమియంలు పెరగవచ్చు లేదా ఏజెంట్ల కమీషన్ తగ్గవచ్చు. ఈ సంవత్సరం ప్రారంభంలో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) వారి జీవిత బీమా పాలసీల నుంచి ముందుగానే నిష్క్రమించే పాలసీదారులకు మెరుగైన రాబడిని అందించడానికి సవరించిన సరెండర్ విలువ మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది.

జీవిత బీమా తీసుకునే వారిలో కొందరు గడువు ముగియక ముందే తమ పాలసీ రద్దు చేసుకుంటారు. అయితే ఈ సరెండర్‌ విలువకు సంబంధించి బీమా నియంత్ర, అభివృద్ధి ప్రాధికార సంస్థ కొన్ని నెలల క్రితం సవరించిన మార్గదర్శకాలను జారీ చేసింది. పాలసీని సరెండర్‌ చేస్తే మెరుగైన విలువను ఇవ్వాలని పేర్కొంది. ఆ మొత్తం సహేతుకంగా, సొమ్ముకు తగిన ప్రతిఫలం ఉండాలని పేర్కొంది.

ఐఆర్‌డీఏఐ మార్గదర్శకాలను అనుసరించి సరెండర్‌ విలువను సవరించేందుకు చాలా వరకు ప్రైవేటు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని తెలుస్తోంది. ఆయా సంస్థల దగ్గర ఉండే పాలసీల సంఖ్య తక్కువగా ఉండడమే ఇందుకు కారణం. అదే ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్‌ఐసీకి మాత్రం అంత సులువు కాదని విశ్లేషకులు చెబుతున్నారు. పెద్ద సంఖ్యలో పాలసీలు కలిగిన ఎల్‌ఐసీకి మార్గదర్శకాలకు అనుగుణంగా పాలసీ విలువులను సవరించడం చాలా పెద్ద పనేనని అభిప్రాయపడుతున్నారు. రెగ్యులేటర్ ఆదేశాలకు అనుగుణంగా తమ పాలసీలలో మార్పులు తీసుకురావడానికి ఎల్‌ఐసీ ముందు భారీ కర్తవ్యం ఉంది.