CIBIL Score New Rules: మారిన సిబిల్‌ స్కోర్‌ రూల్స్‌.. తక్కువ సిబిల్ ఉంటే రుణం దొరకదా? అసలు నిజం ఏంటి?

  • ఆర్బీఐ కొత్త "ఎక్స్‌పెక్టెడ్ క్రెడిట్ లాస్ (ECL) డైరెక్షన్-2026" నిబంధనలు..
  • దేశంలోని రుణగ్రహీతలపై భారీగా ప్రభావం చూపే అవకాశం..
  • 2027 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్న కొత్త రూల్స్‌..
  • సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే రుణాలు కష్టమేనా..?
Cibil Score New Rules

Cibil Score New Rules

CIBIL Score New Rules: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రవేశపెట్టిన కొత్త “ఎక్స్‌పెక్టెడ్ క్రెడిట్ లాస్ (ECL) డైరెక్షన్-2026” నిబంధనలు దేశంలోని రుణగ్రహీతలపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నిబంధనలు 2027 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుండగా, ముఖ్యంగా తక్కువ సిబిల్ స్కోర్ కలిగిన వారికి గృహ, వాహన, విద్యా రుణాలు పొందడం మరింత సవాలుగా మారవచ్చని బ్యాంకింగ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న విధానం ప్రకారం, రుణగ్రహీత 90 రోజుల పాటు ఈఎంఐలు చెల్లించకపోతే ఆ రుణాన్ని నిరర్థక ఆస్తి (NPA)గా పరిగణించి బ్యాంకులు నిధులను కేటాయిస్తాయి. అయితే కొత్త ECL విధానంలో, రుణం మొండిబకాయిగా మారే అవకాశం ఉన్నప్పుడే బ్యాంకులు ముందస్తుగా నిధులను కేటాయించాల్సి ఉంటుంది. దీంతో భవిష్యత్ నష్టాలను ముందుగానే అంచనా వేసి వాటిని ఎదుర్కొనేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉండాల్సి వస్తుంది.

బ్యాంకులపై అదనపు భారం..!

ఈ కొత్త విధానం కారణంగా బ్యాంకులపై అదనపు ఆర్థిక భారం పడనుంది. పరిశ్రమ అంచనాల ప్రకారం, ఈ మార్పుల వల్ల బ్యాంకింగ్ రంగంపై సుమారు రూ.42 వేల కోట్ల మేర ప్రభావం ఉండవచ్చు. ఫలితంగా బ్యాంకులు రుణాల మంజూరులో మరింత జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉంది. ప్రస్తుతం భారతదేశంలో రుణాల కోసం దరఖాస్తు చేసుకునే వారిలో సుమారు 62 శాతం మందికి సిబిల్ స్కోర్ 730 కంటే తక్కువగా ఉందని అంచనా. దీంతో ఈ వర్గానికి చెందిన వ్యక్తులు భవిష్యత్తులో రుణాల ఆమోదం పొందడంలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. కొన్ని సందర్భాల్లో అధిక వడ్డీ రేట్లు, అదనపు హామీలు లేదా పూచీకత్తులు కూడా బ్యాంకులు కోరే అవకాశం ఉంది.

×
×
Ad

వారికి ప్రయోజనం..!

మరోవైపు, 730 లేదా అంతకంటే ఎక్కువ సిబిల్ స్కోర్ కలిగిన కస్టమర్లకు ఈ మార్పులు ప్రయోజనకరంగా మారవచ్చు. ఇలాంటి ప్రీమియం కస్టమర్లకు తక్కువ వడ్డీ రేట్లు, మెరుగైన రుణ నిబంధనలు మరియు వేగవంతమైన రుణ ఆమోదాలు లభించే అవకాశముంది. ప్రస్తుతం దేశంలో సుమారు 7 కోట్ల మంది వినియోగదారులు ఈ వర్గంలో ఉన్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ECL ఫ్రేమ్‌వర్క్ కింద బ్యాంకులు కేవలం సిబిల్ స్కోర్ మాత్రమే కాకుండా, కస్టమర్ చెల్లింపుల చరిత్ర, ఆదాయ స్థిరత్వం, ఉద్యోగ భద్రత, ప్రస్తుత రుణ భారం, లోన్-టు-వాల్యూ (LTV) నిష్పత్తి వంటి అనేక అంశాలను పరిశీలిస్తాయి. ఈ సమాచారం ఆధారంగా భవిష్యత్తులో రుణం డిఫాల్ట్ అయ్యే అవకాశాన్ని అంచనా వేస్తాయి.

ఈఎంఐ సకాలంలో చెల్లించకపోతే అంతే..

కొత్త నిబంధనల ప్రకారం, రుణగ్రహీత ఈఎంఐ చెల్లింపుల్లో విఫలమైతే బ్యాంకులు కేటాయించాల్సిన నిధుల పరిమాణం గణనీయంగా పెరుగుతుంది. ఉదాహరణకు, రూ.25 లక్షల గృహ రుణంపై 30 రోజుల పాటు చెల్లింపులు నిలిచిపోతే ప్రస్తుతం రూ.10 వేల వరకు ఉన్న కేటాయింపు అవసరం రూ.25 వేలకు పెరగవచ్చు. 31 నుంచి 60 రోజుల మధ్య డిఫాల్ట్ అయితే ఇది రూ.1.25 లక్షల వరకు చేరవచ్చు. 90 రోజులకుపైగా చెల్లింపులు నిలిచిపోతే ప్రస్తుతం 15 శాతం మేర ఉన్న కేటాయింపు రూ.5 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది.

బ్యాంకులు మరింత బలోపేతం..

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈసీఎల్ విధానం బ్యాంకింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే వినియోగదారులు తమ సిబిల్ స్కోర్‌ను మెరుగుపరచుకోవడం, ఈఎంఐలు మరియు క్రెడిట్ కార్డ్ బిల్లులను సకాలంలో చెల్లించడం, అవసరానికి మించి రుణాలు తీసుకోకుండా జాగ్రత్తపడటం అత్యంత అవసరం. మొత్తంగా 2027 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ కొత్త నిబంధనలతో భారత బ్యాంకింగ్ రంగంలో రుణాల పంపిణీ విధానంలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఇకపై రుణాల మంజూరులో పరిమాణం కంటే రుణగ్రహీతల క్రెడిట్ నాణ్యత మరియు రిస్క్ సామర్థ్యానికే ఎక్కువ ప్రాధాన్యత లభించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.