ITR Filing AY 2026-27: ఆదాయం తక్కువ ఉన్నా సరే.. ఈ 5 కారణాలతో ITR తప్పనిసరి

Itr

Itr

ITR Filing AY 2026-27: ఆదాయం పన్ను మినహాయింపు పరిమితి కంటే తక్కువగా ఉందని భావించి ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయకుండా ఉండాలనుకుంటే ఒకసారి నిబంధనలు తప్పనిసరిగా పరిశీలించాలని ఆదాయపు పన్ను శాఖ సూచిస్తోంది. ఎందుకంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆదాయం పన్ను పరిధిలో లేకపోయినా ITR దాఖలు చేయడం తప్పనిసరి. నిబంధనలు పాటించకపోతే నోటీసులు, జరిమానాలు ఎదురయ్యే అవకాశం ఉంది.

మినహాయింపు పరిమితి ఎంత?

2026-27 అసెస్‌మెంట్ ఇయర్‌కు కొత్త పన్ను విధానంలో వార్షిక ఆదాయం రూ.4 లక్షల వరకు ఉన్నవారికి సాధారణంగా ITR దాఖలు చేయాల్సిన అవసరం ఉండదు. పాత పన్ను విధానంలో ఈ ప్రాథమిక మినహాయింపు పరిమితి రూ.2.5 లక్షలుగా కొనసాగుతోంది. అయితే, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఈ పరిమితికి లోబడినా ITR తప్పనిసరిగా దాఖలు చేయాలని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది.

ఈ పరిస్థితుల్లో ITR తప్పనిసరి

1. విదేశీ ఆస్తులు ఉంటే: భారతీయ నివాసితులు విదేశాల్లో ఆస్తులు, ఆర్థిక పెట్టుబడులు కలిగి ఉన్నా లేదా విదేశీ బ్యాంకు ఖాతాలో సంతకం చేసే అధికారం ఉన్నా ITR దాఖలు చేయాలి.

2. భారీ విలువైన బ్యాంకు లావాదేవీలు: ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కరెంట్ ఖాతాల్లో ఏడాదిలో రూ.1 కోటి కంటే ఎక్కువ నగదు జమ చేసినా, సేవింగ్స్ ఖాతాల్లో రూ.50 లక్షలకు పైగా డిపాజిట్లు చేసినా ITR దాఖలు చేయడం తప్పనిసరి.

3. విదేశీ ప్రయాణాలు, అధిక విద్యుత్ బిల్లులు: ఆర్థిక సంవత్సరంలో విదేశీ ప్రయాణాలపై రూ.2 లక్షలకు పైగా ఖర్చు చేసినా లేదా విద్యుత్ బిల్లులు రూ.1 లక్షకు మించి చెల్లించినా ITR ఫైల్ చేయాల్సి ఉంటుంది.

4. వ్యాపారం, వృత్తి ఆదాయం: వ్యాపార టర్నోవర్ రూ.60 లక్షలకు మించి ఉంటే లేదా వృత్తిపరమైన (ప్రొఫెషనల్) స్థూల రసీదులు రూ.10 లక్షలకు మించి ఉంటే ఆదాయం మినహాయింపు పరిమితిలో ఉన్నప్పటికీ ITR తప్పనిసరిగా దాఖలు చేయాలి.

5. TDS లేదా TCS నిర్దిష్ట పరిమితి దాటితే: ఆర్థిక సంవత్సరంలో మొత్తం TDS లేదా TCS రూ.25 వేలకుపైగా ఉంటే ITR దాఖలు చేయాలి. సీనియర్ సిటిజన్ల విషయంలో ఈ పరిమితి రూ.50 వేలుగా నిర్ణయించారు.

నిబంధనలు పాటించకపోతే?

పైన పేర్కొన్న నిబంధనల్లో ఏదైనా వర్తిస్తే ITR దాఖలు చేయకపోతే ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు రావడంతో పాటు జరిమానాలు కూడా విధించే అవకాశం ఉంది. అందువల్ల ఆదాయం పన్ను పరిధిలో లేకపోయినా, ఈ ప్రత్యేక నిబంధనలు మీకు వర్తిస్తున్నాయో లేదో ఒకసారి పరిశీలించి ITR దాఖలు చేయడం ఉత్తమం. కాగా, ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) దాఖలు చేయడానికి సాధారణ పన్ను చెల్లింపుదారులకు చివరి తేదీ జూలై 31, 2026గా ఉంది.. ఈ గడువులోగా రిటర్నులను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది..